Best Web Hosting Provider In India 2024
AP Engineering Colleges : ఇంజనీరింగ్ విద్యలో నాణ్యత పెంపుదలపై దృష్టి సారించండి : లోకేష్
AP Engineering Colleges : ఇంజనీరింగ్ విద్యలో నాణ్యత పెంపుదలపై దృష్టి సారించాలని.. మంత్రి నారా లోకేష్ సూచించారు. గత పాలకుల కారణంగా విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయిందన్నారు. క్యాలెండర్ ప్రకారం రీయంబర్స్మెంట్ డబ్బులు విడుదల చేయాలని ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు విజ్ఞప్తి చేశాయి.
రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో నాణ్యత పెంచడంపై యాజమాన్యాలు దృష్టి సారించాలని.. మంత్రి నారా లోకేష్ సూచించారు. ఉండవల్లి నివాసంలో ఇంజనీరింగ్ కళాశాలల మేనేజ్ మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు లోకేష్ ను కలిశారు. ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా విద్యావ్యవస్థ నిర్వీర్యమైందని, ప్రాథమికస్థాయి నుంచే పరివర్తన తేవాలన్నది తమ లక్ష్యమని అన్నారు.
సంస్కరణలకు శ్రీకారం..
‘ఇంటర్మీడియట్ విద్యలో గత 10 సంవత్సరాలుగా సంస్కరణలు లేవు. నేను మంత్రి అయ్యాక సంస్కరణలకు శ్రీకారం చుట్టాం. అన్ని విద్యాసంస్థల్లో గ్రాస్ ఎన్ రోల్ మెంట్ రేషియో పెరగాల్సి ఉంది. విద్యావ్యవస్థలో నైతిక విలువలతో కూడిన సంస్కరణలు తేవాలన్నది మా ఉద్దేశం. సంస్కరణలు అమలుచేసే క్రమంలో ఏవైనా తప్పులు దొర్లితే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మా ప్రభుత్వంలో ఏకపక్ష నిర్ణయాలు ఉండవు. చర్చలు, సంప్రదింపుల ద్వారానే ఏదైనా విధానపరమైన నిర్ణయం తీసుకుంటాం’ అని లోకేష్ వివరించారు.
ప్రభుత్వానికి తెలియజేయాలి..
‘ఈ ఏడాది ఆర్టిఎఫ్ స్కాలర్ షిప్లకు సంబంధించి తొలివిడతలో రూ.788 కోట్లకు గాను.. ఇప్పటికే 571.96 కోట్లు విడుదల చేశాం. రెండు, మూడు రోజుల్లో మిగిలిన 216.04 కోట్లు కూడా విడుదల చేస్తాం. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్, ఆర్ అండ్ డి, ఇన్నొవేషన్స్ పై దృష్టి సారించాలి. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్లేస్ మెంట్స్ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలి’ అని లోకేష్ కోరారు.
కోడ్ ముగిసిన తర్వాత..
‘విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకురావాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత ఒక రోజు వర్క్ షాప్ నిర్వహించి ఇంజనీరింగ్ విద్య నాణ్యత పెంచేందుకు అందరి అభిప్రాయాలు తీసుకుంటాం’ అని లోకేష్ స్పష్టం చేశారు.
ఫీజులు గిట్టుబాటుగా లేవు..
ఇంజనీరింగ్ కళాశాలల ప్రతినిధులు మాట్లాడుతూ.. ఇంజనీరింగ్ విద్యార్థులకు సంబంధించి ఫీజు రీయంబర్స్ మెంట్ సొమ్మును ఎప్పటికప్పుడు క్యాలండర్ ప్రకారం విడుదల చేయాలని కోరారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఫీజులు గిట్టుబాటుగా లేవని, వాటిని సవరించాలని కోరారు. ఈ విషయంలో ముందస్తుగా కసరత్తు ప్రారంభించాలన్నారు. ఎంసెట్ షెడ్యూలును నిర్ణీత సమయం ప్రకారం విడుదల చేయాలని, ఎంసెట్ లో 3 కౌన్సిలింగ్స్ విధానాన్ని అమలుచేయాలని కోరారు.
చొరవ చూపాలి..
ఇంజనీరింగ్ కళాశాలల్లో చదివిన విద్యార్థుల ప్లేస్ మెంట్స్ విషయంలో ప్రభుత్వం చొరవచూపాలని, ఇందుకోసం స్టేట్ లెవల్ జాబ్ మేళాతో సహా యూనివర్సిటీల్లో ఆయా కంపెనీలను రప్పించి జాబ్ మేళాలు నిర్వహించాలని కాలేజీయ యాజమాన్యాలు కోరాయి. అటెండెన్స్ విషయంలో వెయిటేజి విధానాన్ని అమలుచేస్తే.. సత్ఫలితాలు ఉంటాయని సూచించారు.
టాపిక్