Best Web Hosting Provider In India 2024
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/02/03.02...jogi ramesh.jpg)
మున్సిపల్ ఉప ఎన్నికల్లో టీడీపీ అరాచక పర్వం
మాజీ మంత్రి జోగి రమేష్ ఆగ్రహం
రాజకీయాల్లో ఏ విలువలు లేని వ్యక్తి చంద్రబాబు
2019లో ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్కు ప్రచారం
ఇప్పుడు అదే ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి ప్రచారం
కేజ్రీవాల్పై అదే పనిగా విమర్శల పర్వం
అధికారం కోసం మారడం చంద్రబాబు నైజం
ప్రెస్మీట్లో జోగి రమేష్ ధ్వజం
తాడేపల్లి: కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పాతరేసిందని మాజీ మంత్రి, వైయస్ఆర్సీపీ సీనియర్ నేత జోగి రమేష్ మండిపడ్డారు. మున్సిపల్ ఉప ఎన్నికల్లో టీడీపీ అరాచక పర్వం చూసి ప్రజాస్వామికవాదులు నివ్వెర పోతున్నారని ఆయన తెలిపారు. అధికార దుర్వినియోగంతో మున్సిపాలిటీల్లో మెజారిటీ లేకపోయినా సరే గద్దెనెక్కాలని తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాలు, దాడులతో దిగజారుడు రాజకీయం చేస్తోందని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన జోగి రమేష్ చెప్పారు.
చంద్రబాబు చెప్పేదొకటి. చేసేదొకటి:
మున్సిపల్ ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల దౌర్జన్యాలకు, అరాచకాలకు, అక్రమాలకు పాల్పడ్డారో ప్రజలు గమనించారు. చంద్రబాబు పాలనను చూసి ప్రజలు విస్తుపోతున్నారు. చంద్రబాబు చెప్పేది ఒకటి, చేసేది మరొకటి. ఇతర పార్టీల వారు టీడీపీలోకి రావాలంటే తమ పదవులను విడిచిపెట్టి రావాలని గతంలో ఎంతో నైతిక విలువలను పాటించే వ్యక్తిగా ప్రకటించారు. కానీ నేడు రాష్ట్రంలో మున్సిపల్ ఉప ఎన్నికల్లో ఎలాంటి ఫిరాయింపులు చేయిస్తున్నారో చూస్తే.. చంద్రబాబు రెండు నాలుకల దోరణితో ఎలా వ్యవహరిస్తారో అందరికీ అర్థమవుతోంది.
రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించాలి:
రాష్ట్రంలోని ఏ కార్పోరేషన్, మున్సిపాలిటీలోనూ మున్సిపల్ ఉప ఎన్నికలలో పోటీ చేసే కనీస మెజారిటీ కూడా కూటమి పార్టీలకు లేదు. డిప్యూటీ మేయర్, మున్సిపాలిటీల ఛైర్పర్సన్స్, వైస్ ఛైర్పర్సన్స్ ఎన్నికల్లో కనీస మెజారిటీ లేకుండా మీ అభ్యర్ధులను ఎలా పోటీకి నిలబెట్టారు? అధికారం ఉందని దౌర్జన్యంతో వైయస్ఆర్సీపీ నుంచి గెలిచిన వారిని మీకు అనుకూలంగా ఓటెయ్యమని బెదరించడం, ప్రలోభపెట్టడంతో పాటు, దాడులకూ తెగబడ్డారు. తిరుపతిలో వైయస్ఆర్ సీపీ కార్పోరేటర్లు బస్సులో వెడుతుంటే, పట్టపగలు నడిరోడ్డుపై దాడిచేయడం అత్యంత దారుణం. ఈ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా? చంద్రబాబు చేయిస్తున్న వికృత చేష్టలు చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఈ పరిణామాలపై ఎన్నికల కమిషన్ వెంటనే స్పందించి విచారణకు ఆదేశించాలి. చంద్రబాబు దుర్మార్గాలపై తగిన చర్యలు తీసుకోవాలి.
రాజకీయంగా సిద్దాంతాలు లేని చంద్రబాబు:
తాజాగా చంద్రబాబు ఢిల్లీలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళి కేజ్రీవాల్పై విమర్శలు చేశారు. ఇదే చంద్రబాబు 2019లో ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లి ఇదే కేజ్రీవాల్, మమతా బెనర్జీల పక్కన కూర్చుని బీజేపీని, ప్రధాని నరేంద్రమోదీని తీవ్రంగా విమర్శించారు. అంటే అధికారం కోసం ఎవరిపైన అయినా సరే బురద చల్లడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. రాజకీయాల్లో ఏ మాత్రం విలవలు, విశ్వసనీతయ లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారూ అంటే.. అది ఒక్క చంద్రబాబు మాత్రమే. చంద్రబాబు రాజకీయ ఎదుగుదలే వెన్నుపోటుతో ప్రారంభమైంది.
ఆ తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకుని 1999 ఎన్నికల్లో గెలుపొందారు. 2004లో ఓటమి పాలు కాగానే బీజేపీని వదిలిపెట్టాడు. 2009లో టీఆర్ఎస్, కమ్యూనిస్ట్లతో పొత్తు పెట్టుకుని పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఓటమి పాలవ్వగానే ఆ పార్టీలను వదిలిపెట్టారు. 2014లో మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చారు. ఆ తరువాత మళ్లీ బీజేపీని వదిలిపెట్టారు. 2024లో మళ్లీ బీజేపీ, జనసేనలతో కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చారు. రాజకీయాల్లో చంద్రబాబుకు ఒక సిద్దాంతం, విధానం అంటూ లేదు. అధికారమే ఆయన పరమావధి. అందు కోసం ఆయన ఎవరితోనైనా కలుస్తారు, ఎవరినైనా విమర్శిస్తారని జోగి రమేష్ తేల్చి చెప్పారు.