Best Web Hosting Provider In India 2024
AP Ministers Rankings : ర్యాంకులు ఎవరినీ ఎక్కువ చేయడానికి కాదు – సీఎం చంద్రబాబు
మంత్రులకు ర్యాంకుల విషయంపై సీఎం చంద్రబాబు స్పందించారు. కేవలం పనులు వేగవంతం కోసమే ర్యాంకులన్నారు. ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అని చెప్పడం కోసం కాదని స్పష్టం చేశారు. పైస్థాయి నుంచి చిరుద్యోగి వరకు పనిపై దృష్టి పెడితేనే ఫలితాలు ఉంటాయని ట్వీట్ చేశారు.
ప్రభుత్వంలో పని తీరు ఆధారంగా ఏపీ మంత్రులకు ర్యాంకులు ఇవ్వటం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో పవన్ ర్యాంక్ విషయాన్ని హైలెట్ చేస్తూ వైసీపీ నేతలు పలు ప్రశ్నలను సంధిస్తున్నారు. వ్యూహాత్మకంగానే చంద్రబాబు ఇదంతా చేస్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
మంత్రుల ర్యాంకుల విషయం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో… ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు. కేవలం పనుల వేగవంతం కోసమే ర్యాంకులని స్పష్టం చేశారు. ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అని చెప్పడం కోసం కాదన్నారు. ప్రజలు అపారమైన నమ్మకంతో 2024 ఎన్నికల్లో 93 స్ట్రైక్ రేట్ తో చారిత్రాత్మక తీర్పును ఇచ్చి గెలిపించారని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు.
“ప్రజల ఆశల్ని, ఆకాంక్షల్ని నెరవేర్చేందుకు తొలిరోజు, తొలిగంట నుంచి ప్రయత్నం చేస్తున్నాం. గత ప్రభుత్వ పాలనలో విధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు శాయశక్తులా కష్టపడుతున్నాం. పింఛన్ల పెంపు, ఉచిత గ్యాస్, అన్న క్యాంటీన్లు వంటి పథకాలతో సంక్షేమం అమలు చేస్తూనే…మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల సాధనతో అభివృద్దివైపు అడుగులు వేస్తున్నాం. ఎదురవుతున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని సుపరిపాలనతో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తాం. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం” అని చంద్రబాబు తన పోస్టులో ప్రస్తావించారు.
ప్రతి ఒక్కరూ కష్టపడాలి – సీఎం చంద్రబాబు
ఈ లక్ష్యాలను వేగంగా చేరుకోవాలంటే ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరూ కష్టపడాలని చంద్రబాబు పునరుద్ఘాటించారు. “టీమ్ వర్క్గా పని చేసినప్పుడే ఉత్తమ ఫలితాలు సాధించగలమని నేను విశ్వసిస్తాను. అసాధారణ, వేగవంతమైన పనితీరు చూపితే తప్ప…విధ్వంస రాష్ట్రంలో పునర్నిర్మాణ ఫలితాలను ప్రజలకు చూపలేం. అందుకే ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరు టీం స్పిరిట్ తో పనితీరుపై సమీక్షించుకుని పనిచేయాలన్నదే మా ఆలోచన. అందులో భాగంగానే ఫైళ్ల క్లియరెన్స్ లో మంత్రులకు ర్యాంకులు ఇచ్చాం” అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు .
తక్కువ చేయడానికి కాదు…
“దస్త్రాల పరిష్కారంలో నిన్న విడుదల చేసిన ర్యాంకులు ఎవరినీ ఎక్కువ చేయడానికి కాదు.. ఎవరినీ తక్కువ చేయడానికి కాదు. ఎవరు ఏ స్థానంలో ఉన్నారనేది చెప్పడం ద్వారా తమతో తాము పోటీ పడటంతో పాటు, ఒకరితో ఒకరు పోటీ పడి పనిచేయడానికి, పాలనలో వేగం పెంచేందుకు చేసిన ప్రయత్నమే ఇది. ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో నేను కూడా నా స్థానాన్ని మరింత మెరుగుపరుచుకోవాల్సి ఉంది” అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
“పీపుల్ ఫస్ట్’ విధానంతో నేను, నా కేబినెట్ సహచర మంత్రులంతా పనిచేస్తున్నాము. లక్ష్యాల సాధనకు అడుగులు వేస్తున్నాము. గ్రామ స్థాయిలో చిరు ఉద్యోగి నుంచి సీఎం వరకు అంతా కష్టపడి సమిష్టిగా పనిచేస్తేనే ప్రజల సమస్యలు, కష్టాలు తీర్చి… సమస్యల సుడిగుండంలో ఉన్న రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టగలం. ప్రతి ఒక్కరూ సానుకూల దృక్పథంతో శాఖల్లో అత్యున్నత ప్రతిభ చూపిస్తారని ఆశిస్తున్నాను” అని ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ లో ప్రస్తావించారు.
సంబంధిత కథనం
టాపిక్