PM Modi US visit: ఫిబ్రవరి 12న ప్రధాని మోదీ అమెరికా పర్యటన; మనవారికి ఏమైనా ఊరట లభిస్తుందా?

Best Web Hosting Provider In India 2024


PM Modi US visit: ఫిబ్రవరి 12న ప్రధాని మోదీ అమెరికా పర్యటన; మనవారికి ఏమైనా ఊరట లభిస్తుందా?

Sudarshan V HT Telugu
Feb 07, 2025 05:46 PM IST

PM Modi US visit: ఫిబ్రవరి 12,13 తేదీల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటిస్తారని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ శుక్రవారం వెల్లడించారు. భారత్ సహా వివిధ దేశాల నుంచి అమెరికాకు అక్రమంగా వెళ్లినవారిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్నవేళ మోదీ ఆ దేశంలో పర్యటిస్తున్నారు.

ఫిబ్రవరి 12న ప్రధాని మోదీ అమెరికా పర్యటన
ఫిబ్రవరి 12న ప్రధాని మోదీ అమెరికా పర్యటన (AP file)

PM Modi US visit: ఈ నెల 12 నుంచి 13 వరకు ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటిస్తారని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ప్రస్తుతం అమెరికాలోని భారతీయ విద్యార్థులు, ఇతరులు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో భయాందోళనలకు గురవుతున్నారు. భారత్ సహా వివిధ దేశాల నుంచి అమెరికాకు అక్రమంగా వెళ్లినవారిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్నారు. ఇటీవలనే భారత్ కు చెందిన అక్రమ వలసదారులతో అమెరికా విమానం భారత్ కు వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటన వల్ల యూఎస్ లోని భారతీయుల భయాందోళనలకు ఏమైనా పరిష్కారం లభించనుందా? అని అంతా ఎదురు చూస్తున్నారు.

yearly horoscope entry point

ట్రంప్ 2.0 లో తొలిసారి..

‘‘ఈ నెల 12, 13 తేదీల్లో ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించనున్నారు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రధాని మోదీ అమెరికాకు రావడం ఇదే తొలిసారి. ట్రంప్ ప్రమాణ స్వీకారం తర్వాత అమెరికాను సందర్శించే అతికొద్ది మంది ప్రపంచ నాయకుల్లో భారత ప్రధాని ఒకరు’’ అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రత్యేక సమావేశంలో మిస్రీ తెలిపారు. వచ్చే వారం తనను కలవడానికి భారత ప్రధాని మోదీని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆహ్వానించారని ఇటీవల వైట్ హౌస్ అధికారి ఒకరు చెప్పారు. తాజాగా, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి ప్రధాని మోదీ పర్యటన గురించి ప్రకటన వెలువడింది. భారత ప్రధానికి ఆతిథ్యం ఇవ్వనున్నట్లు ట్రంప్ గత నెలాఖరులో ప్రకటించారు. ‘‘ఈ ఉదయం ఆయనతో సుదీర్ఘంగా మాట్లాడాను. వచ్చే నెలలో, బహుశా ఫిబ్రవరిలో ఆయన వైట్ హౌస్ కు రాబోతున్నారు’’ అని ట్రంప్ అప్పుడు విలేకరులతో చెప్పారు.

జనవరి 27న ట్రంప్ తో ప్రధాని మోదీ ఫోన్

ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత జనవరి 27న డొనాల్డ్ ట్రంప్ తో ప్రధాని మోదీ ఫోన్ లో మాట్లాడారు. ప్రపంచ శాంతి, ద్వైపాక్షిక భద్రత కోసం కలిసి పనిచేయడం, సాంకేతికత, వాణిజ్యం, రక్షణ వంటి కీలక రంగాల్లో సహకారాన్ని పెంపొందించే చర్యలపై ఇరువురు నేతలు టెలిఫోన్ సంభాషణలో చర్చించారు. ‘పరస్పర ప్రయోజనకరమైన, నమ్మకమైన భాగస్వామ్యానికి మేం కట్టుబడి ఉన్నాం. మన ప్రజల సంక్షేమం కోసం, ప్రపంచ శాంతి, శ్రేయస్సు, భద్రత కోసం మేము కలిసి పనిచేస్తాము” అని ప్రధాని మోదీ అన్నారు.

ద్వైపాక్షిక వాణిజ్య బంధం

యునైటెడ్ స్టేట్స్ భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2023/24 లో 118 బిలియన్ డాలర్లను దాటింది. భారతదేశం 32 బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులును నమోదు చేసింది. చైనాను ఎదుర్కొనే ప్రయత్నాల్లో అమెరికాకు వ్యూహాత్మక భాగస్వామిగా ఉన్న భారత్ అమెరికాతో వాణిజ్య సంబంధాలను పెంపొందించుకోవడానికి, తమ పౌరులకు నైపుణ్యం కలిగిన వర్కర్ వీసాలను సులభతరం చేయడానికి ఆసక్తిగా ఉంది.

Whats_app_banner
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link