




Best Web Hosting Provider In India 2024

Kakinada Crime : విద్యార్థినులకు అశ్లీల వీడియోలు చూపించి.. ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన
Kakinada Crime : విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు కీచకుడిగా మారాడు. అశ్లీల వీడియోలు చూపించి.. వారిని తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. ఉపాధ్యాయుడి వ్యవహారిక శైలిపై విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఆ ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు అయింది.
కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలంలోని ఒక గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఉంది. ఆ పాఠశాలలో నడికి సుధీర్ అనే ఉపాధ్యాయుడు పని చేస్తున్నాడు. అతను ఐదో తరగతి విద్యార్థినులతో గత కొన్ని రోజులుగా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. తన సెల్ఫోన్లోని అసభ్యకర వీడియోలను విద్యార్థినులకు చూపించి, వారి శరీర భాగాలను అసభ్యకరంగా తాకడం వంటి పనులు చేసేవాడు. విసిగిపోయిన విద్యార్థినులు ఉపాధ్యాయుడు తమ పట్ల వ్యవహరిస్తున్న తీరును తల్లిదండ్రులకు చెప్పారు.

తల్లిదండ్రుల ఆగ్రహం..
ఉపాధ్యాయుడి కీచక బాగోతం తెలిసిన తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు గురువారం పాఠశాలకు వెళ్లి.. ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయుడు ఏవీ శ్రీనివాస్కు ఫిర్యాదు చేశారు. ఆయన ఈ విషయాన్ని మండల విద్యా శాఖ అధికారులు బి.వేణుగోపాల్, జి.పైడిరాజులకు నివేదించారు. దీంతో మండల విద్యా శాఖ అధికారులు శుక్రవారం పాఠశాలలో విచారణ చేపట్టారు. విద్యార్థినులతో మాట్లాడి వారి నుంచి వివరాలు సేకరించారు. నివేదికను జిల్లా విద్యా శాఖ అధికారికి అందించారు. ఇంత వరకు ఈ ఘటన గురించి బయటకు చెప్పలేదు.
సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు..
మండల విద్యాశాఖ అధికారుల నివేదిక ఆధారంగా కీచక ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకున్నారు. ఉపాధ్యాయుడు సుధీర్ను సస్పెండ్ చేస్తూ.. శనివారం ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో ఈ ఘటన గురించి తెలిసింది. ఉపాధ్యాయుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాకినాడ డీఎస్పీ ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తు జరుగుతుందని పోలీసులు వెల్లడించారు. దర్యాప్తు ముగిసిన తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
కీచక ఉపాధ్యాయుడికి రిమాండ్..
ఉన్నత పాఠశాల విద్యార్థిని పట్ల లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో.. ఓ ఉపాధ్యాయుడిని రిమాండ్ నిమిత్తం విశాఖ సెంట్రల్ జైలుకు తరలించినట్లు.. అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా వెల్లడించారు. అనకాపల్లి జిల్లా బుచ్చియ్యపేట మండలంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల.. లెక్కల మాస్టార్ ద్వారపూడి గంగా ప్రసాద్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఉపాధ్యాయుడు గంగా ప్రసాద్ను పట్టుకుని దేహశుద్ది చేశారు.
పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధిత విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు.. ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. శుక్రవారం చోడవరం కోర్టులో నిందితుడిని ప్రవేశపెట్టగా.. 14 రోజుల రిమాండ్ విధించారు. శనివారం నిందితుడిని విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తరిలించినట్లు ఎస్పీ చెప్పారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)
టాపిక్