Best Web Hosting Provider In India 2024

విలువలకు నీళ్లొదిలిన కడప టీడీపీ ఎమ్మెల్యే !
మొన్న వైయస్ఆర్సీపీ నేత త్యాగరాజు వాటర్ప్లాంట్ కూల్చివేసేందుకు విఫలయత్నం
నేడు దేవిరెడ్డి ఆదిత్య వాటర్ప్లాంట్తో పాటు మరోదానికి సీల్
వైయస్ఆర్ జిల్లా: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కడప నగరంలో కక్షపూరిత రాజకీయాలకు తెరలేచింది. వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా ఈ దాడులు,దౌర్జన్యాలు సాగుతున్నాయి. ప్రజలకు శుద్ధి చేసిన నీటిని అందించాలన్న లక్ష్యంలో గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ద్వారా ఎంపీ నిధులు, ఏపీఎండీసీ నిధులను వెచ్చించి నగరంలో సుమారు 10 వాటర్ప్లాంట్లు నిర్మించారు. వాటి ద్వారా పేదలు నివాసం ఉన్నచోట రూ.5లకే క్యాన్ శుద్ధి చేసిన నీటిని అందించేవారు. కాలానుగుణంగా అందులో కొన్ని ప్లాంట్లు మూతబడ్డాయి. మరికొన్ని కొనసాగుతున్నాయి. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వాటి పేరు వైయస్ఆర్ ప్యూరిఫైడ్ వాటర్ప్లాంట్లుగా మార్చారే తప్పా మూసివేయించలేదు. వీటివల్ల పేదలకు సురక్షిత నీరు అందుతుండటమే ఇందుకు కారణంగా చెబుతున్నారు.
వాటర్ ప్లాంట్లపై అధికార పార్టీ నేతల కన్ను
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల తర్వాత ఆ వాటర్ ప్లాంట్లపై అధికార పార్టీ నేతలు కన్నేశారు. వాటిని ఎలాగైనా మూసివేయించాలని, తద్వారా వాటిని నడుపుతున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యక్తల ఆత్మౖస్థైర్యాన్ని దెబ్బతీయాలని పథక రచన చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగానే మొన్న మాసాపేటలో వైయస్ఆర్సీపీ 26వ డివిజన్ ఇన్చార్జి త్యాగ రాజు తన సొంత స్థలంలో ఏర్పాటు చేసు కున్న వాటర్ప్లాంటును కూల్చివేసేందుకు నగరపాలక అధికారులు రోజంతా కాచుకూర్చున్నారు. కానీ వారి ప్రయత్నాలు సాగలేదు. తాజాగా పాఠశాలల్లో వాటర్ప్లాంట్లు నడుపుతున్నారనే కారణంతో కో ఆపరేటివ్ కాలనీలోని వైయస్ఆర్ ప్యూరిఫైడ్ వాటర్ప్లాంట్, ఆకుల వీధిలోని మరొక వాటర్ప్లాంటును అధికారులు సీజ్ చేయడం కలకలం రేపుతోంది. చెమ్ముమియ్యాపేటలోని ఇంకో వాటర్ప్లాంటును కూడా మూసివేయించేందుకు అధికారులు యత్నించినప్పటికీ న్యాయస్థానం ఆదేశాలతో దాని జోలికిపోనట్లు సమాచారం. కడప ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా ముఖ్యనేత ఆదేశాల మేరకే ఈ వ్యవహారమంతా సాగుతోంది.
ఎమ్మెల్యే తానా..అధికారులు తందానా!
అధికార పార్టీ నేతల ఆదేశాలకు నగరపాలక ముఖ్య అధికారి తానా అంటే తందానా అంటూ వత్తాసు పలుకుతున్నట్లు అర్థమవుతోంది. ఈ వాటర్ ప్లాంట్ల ద్వారా పేదలకు సురక్షిత నీరు అందించడమేగాక నగరపాలక సంస్థకు కూడా కొంత ఆదాయం సమకూరుతోంది. దీనికి గండికొట్టేలా అధికార పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. వైయస్ఆర్సీపీ నాయకుల ఆర్థిక మూలాలను దెబ్బతీస్తున్నామనే భ్రమలో వారు పేదల నోటికాడి నీరు లాగేస్తున్నారన్న సత్యాన్ని మరుస్తున్నారని వారు పేర్కొంటున్నారు. అన్ని అనుమతులు ఉన్నప్పటికీ ఎంపీ వైయస్ అవినాష్రెడ్డి నిధులతో నిర్మించారన్న అక్కసుతో వీటిని మూయించాలని స్కెచ్ వేసినట్లు చెబుతున్నారు. వాటర్ప్లాంట్లను ఈ ఏడాది కూడా కొనసాగించడానికి మేయర్, నగరపాలకవర్గం చేసిన ప్రయత్నాలకు కమిషనర్ అడ్డుకట్ట వేసినట్లు తెలుస్తోంది. టేబుల్ ఎజెండాగా అ అంశాలను స్టాండింగ్ కమిటీ ముందుకు తీసుకురాగా, కమిషనర్ వాటిని ఎజెండాలో చేర్చేందుకు అంగీకరించలేదని సమాచారం. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేనట్లు తెలుస్తోంది. నగరపాలకవర్గంలోని సభ్యులు ఏ విషయంపై ఫిర్యా దు చేసినా కమిషనర్ వాటిని ఎజెండాలో చేర్చి చర్చించేందుకు పాలకవర్గానికి అవకాశమివ్వాలి. కానీ దీనికి విరుద్ధంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. కమిషనర్ వ్యవహారశైలి ఏకపక్షంగా ఉందని పలువురు విమర్శిస్తున్నారు.
పేద వర్గాలు శుద్ధి చేసిన నీటిని తాగకూడదా?: దేవిరెడ్డి ఆదిత్య, వైయస్ఆర్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు
పేదలు, బడుగు, బలహీన వర్గాల ప్రజలు శుద్ధి చేసిన నీటిని తాగకూడదా…ఈ ప్లాంటు ఒక వ్యక్తికి ఇవ్వలేదు. ప్రజలకు సేవ చేస్తున్నారనే కారణంతో ఒక ఆర్గనైజేషన్కు ఇచ్చారు. దాని ద్వారా పేదలకు రూ.5లకే క్యాన్ నీటిని అందిస్తుంటే సహించలేకపోతున్నారు. పేరుకే పాఠశాలగానీ…గతంలో ఈ బిల్డింగ్లో శానిటేషన్ మెటీరియల్ ఉంచేవారు. దళితులు, బీసీ వర్గాలకు తాగునీరు ఇస్తుంటే జీర్ణించుకోలేకపోతున్నారు. కడపలో ఎన్నడూ ఇలాంటి సంస్కృతి లేదు. కక్షపూరిత రాజకీయాలకు ఇది పరాకాష్ట.