


Best Web Hosting Provider In India 2024
Yadagirigutta Temple : యాదగిరిగుట్టలో వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం.. ఈసారి ప్రత్యేకతలు ఇవే
Yadagirigutta Temple : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. మార్చి1 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈసారి బ్రహ్మోత్సవాలకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయాన్ని వార్షిక బ్రహ్మోత్సవాల కోసం ముస్తాబు చేశారు. ఎల్లుండి నుంచి 23 వరకు మహాక్రతువు జరగనుంది. ఇప్పటికే ఆలయ విమాన గోపుర స్వర్ణతాపడం పనులు పూర్తయ్యాయి. 108 మంది రుత్వికులతో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. దేశంలోని పుణ్య నదుల నుంచి పవిత్ర జలాలను తీసుకురానున్నారు. కొండపైన ఐదు హోమగుండాలు ఏర్పాటు చేశారు.
మార్చి1 నుంచి..
కొండపైన పెద్దకుండానికి అనుబంధంగా మరో నాలుగు హోమగుండాలను ఏర్పాటు చేసినట్టు అధికారులు వెల్లడించారు. ప్రతిరోజు శ్రీ సుదర్శన నారసింహ, శ్రీ లక్ష్మి హవన హోమాలు నిర్వహించనున్నారు. 23న విమాన రాజగోపురానికి 25 కలశాలతో అభిషేకం జరగనుంది. 19 నుంచి 22 వరకు 108 మంది రుత్వికులతో సుదర్శన హోమం, నారసింహ హోమం నిర్వహించనున్నారు. 23న సుమారు లక్షమందికి పులిహోర ప్రసాదం పంపిణీ చేయనున్నారు. మార్చి1 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. వానమామలై రామానుజా జీయర్ స్వామి చేతుల మీదుగా 5 రోజుల ఉత్సవాలు నిర్వహిస్తారు.
65. 84 కేజీల బంగారం..
యాదగిరిగుట్ట విమాన గోపురం కోసం 65. 84 కేజీల బంగారాన్ని తీసుకున్నామని ఆలయ అధికారులు వివరించారు. విరాళాల ద్వారా 10.500 కేజీలు, దేవస్థానానికి ఉన్న గోల్డ్ బాండ్ విత్ డ్రా ద్వారా 3 కేజీల 120 గ్రాములు, హుండీలో వచ్చిన ఆభరణాల ద్వారా 12 కేజీల 701 గ్రాముల, వెండిని బంగారంగా మార్చడంతో 8 కేజీల 672 గ్రాములు, బయట నుంచి 30. 51 కేజీల బంగారం కొన్నారు. దివ్య విమాన గోపురం 10, 753 స్క్వేర్ ఫీట్లు ఉండగా.. ఒక్కో స్క్వేర్ ఫీట్కు 6 గ్రాములు వెచ్చించారు.
దేశంలోనే అతిపెద్దది..
దేశంలో అతిపెద్ద విమాన గోపురం ఇదేనని అధికారులు చెబుతున్నారు. ఈ గోపురాన్ని 5 అంతస్తుల పంచ తల గోపురం అంటారు. 50.5 అడుగుల ఎత్తులో ఉంది. దీనిలో 40 విగ్రహాలు ప్రతిష్టించారు. ఒక్కో ఫ్లోర్కు ఎనిమిది విగ్రహాలు అమర్చనున్నారు. స్వామి వారి గోపురంతో పాటు.. ఆలయంపైన ఉన్న 39 కళశాలకు కూడా బంగారు తాపడానికి చేపించారు. మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాన్ని భక్తులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించడానికి.. నాలుగు మాఢ వీధుల్లో ఎల్సీడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు.
ఆలయ చరిత్ర..
యాదగిరిగుట్ట ఆలయ చరిత్ర కూడా ఆసక్తికరంగా ఉంది. విభాండక ఋషి కుమారుడు రుష్యశృంగుడు. అతని కుమారుడు హాద ఋషి. అతనినే హాదర్షి అని కూడా అంటారు. అతను నరసింహ స్వామి భక్తుడు. హాద ఋషికి స్వామివారిని ప్రత్యక్షంగా చూడాలని కోరిక పుట్టింది. అందుకని ఆయన తపస్సు చేశాడు. హాద ఋషి తపస్సుతో.. స్వామివారు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు. అప్పుడు హాదర్షి.. స్వామివారు ఎల్లప్పుడూ ఇక్కడే కొలువై ఉండాలని కోరాడు. అలా స్వామివారు యాదగిరిగుట్టలో కొలువై ఉంటానని హాదర్షికి వరం ఇచ్చారు. యాదవుడు అనే ముని ఇక్కడ తపస్సు చేయడం వల్ల.. ఈ ప్రదేశానికి యాదగిరి అనే పేరు వచ్చిందని కూడా అంటారు.
టాపిక్