



Best Web Hosting Provider In India 2024

Methi Masala Puri: ఎప్పుడూ మైదాతో చేసిన పూరీలే తింటున్నారా? గోధుమపిండితో ఇలా మేతీ మసాలా పూరీని ట్రై చేయండి!
Methi Masala Puri: మేతీ మసాలా పూరీ ఎప్పుడైనా తిన్నారా? మైదాకు బదులుగా గోధుమపిండితో చేసే ఈ పూరీలు రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మంచి ఆప్షన్. మేతీ మసాలా పూరీ ఎలా చేయాలో తెలుసుకుందాం రండి..
గోధుమ పిండి, మెంతి ఆకులతో తయారు చేసిన రుచికరమైన పూరీ
పూరీలంటే ఇష్టపడని వారు ఉండరు. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఇష్టంగా తింటారు. కానీ ఇందులోని మైదా కారణంగా ఆరోగ్యం గురించి కాస్త భయపడతారు. ముఖ్యంగా పిల్లల విషయంలో.. పూరీలు అనగానే పిల్లలు ఎగబడీ మరీ తినేస్తుంటారు. వీటిలోని మైదా వారి ఆరోగ్యాన్ని ఎక్కడ పాడు చేస్తుందో అని తల్లిదండ్రులు కంగారు పడుతుంటారు. మీ ఇంట్లో కూడా ఇదే జరుగుతుంటే ఈ రెసిపీ మీ కోసమే. మైదా లేకుండానే రుచికరమైన ఆరోగ్యకరమైన పూరీలను తయారు చేసి ఇంట్లో వాళ్లకు పెట్టచ్చు. వీటిని ఉదయం బ్రేక్ ఫాస్ట్ కోసమైనా, సాయంత్రం స్నాక్స్ సమయంలో అయినా చేసి పెట్టచ్చు. ఆరోగ్యకరమైన మెంతి ఆకులు, గోధుమపిండితో తయారు చేసే మేతీ మసాలా పూరీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
మేతీ మసాలా పూరీ తయారీకి కావాల్సిన పదార్థాలు:
- గోధుమ పిండి – రెండు కప్పులు
- మెంతి ఆకులు- ఒక కప్పు
- శనగపిండి- అర కప్పు
- నూనె- డీప్ ఫ్రైకి సరిపడా
- ఇంగువ- టీ స్పూన్
- ఉప్పు- రుచికి సరిపడా
- పసుపు- అర టీస్పూన్
- కారం – ఒక టీస్పూన్
మేతీ మసాలా పూరీ తయారి విధానం..
- మేతీ మసాలా పూరీ తయారీ కోసం ముందుగా మెంతి ఆకులను తీసుకుని కాడలు లేకుండా తుంచుకుని శుభ్రంగా కడగండి.
- శుభ్రంగా కడిగిన మెంతి ఆకులను తీసుకుని చిన్నగా కత్తిరించి పక్కకు పెట్టుకోండి.
- ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లో గోధుమ పిండి, శనగిపిండి, ఉప్పు, కారం పొడి, పసుపు వేసి బాగా కలపండి. దీంట్లోనే రెండు స్పూన్ల నూనెను కూడా వేసి బాగా కలపండి.
- తర్వాత ఈ పిండిలోనే కడిగి, తరిగి పెట్టుకున్న మెంతి ఆకులను కూడా వేసి పిండిలో ఆకులు కలిసిపోయేలాగా కలపండి.
- ఇప్పుడు పిండిలో కొద్ది కొద్దిగా నీరు పోస్తూ పిండి మెత్తగా, పూరీ చేసుకునేలా తయారయేంత వరకూ కలుపుతూ ఉండండి.
- పిండిలో మెంతి, ఆకులు, మసాలాలు అన్ని చక్కగా కలిసిపోయి పిండి స్మూత్ గా తయార్యేంతవరకూ కలిపిన తర్వాత పిండి చుట్టూ కాస్త నూనె రాసి మూత పెట్టి పక్కకు పెట్టేయండి.
- ఇలా పావుగంట పాటు పిండిని పక్కకు ఉంచిన తర్వాత మూత తీసి మరోసారి పిండిని చక్కగా కలుపుకోవాలి.
- ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న వుండల్లాగా అంటే నిమ్మకాయ అంత సైజు వుండల్లా తయారు చేసుకుని పక్కకు పెట్టుకోండి.
- ఇప్పుడు ఒక ఫైయింగ్ ప్యాన్ తీసుకుని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయండి.
- నూనె వేడెక్కే లోపు పిండి వుండలను తీసుకుని పూరీల్లా తయారు చేసుకోండి.పూరీలను తయారు చేసేటప్పుడు తిరిగి పొడి పిండిని వీటి మీద చల్లకండి. ఇలా చేయడం వల్ల పూరీలు కాల్చిన నూనె నల్లగా మారిపోతుంది.మీకు కావాలంటే పూరీలు చేయడంలో ఏమైనా ఇబ్బందిగా ఉండే నూనె రాసి చేయండి.
- మరో ముఖ్య విషయం ఏంటంటే ఈ పూరీలు సాధారణ పూరీల్లాగా సన్నగా ఉండకుండా చూసుకోండి. అలా అని బాగా మందంగా కూడా చేయకండి. మీడియం సైజులో చేసుకోవడం వల్ల రుచికరమైన పూరీలను ఆస్వాదించవచ్చు.
- ఇలా మిగిలిన పిండితో కూడా పూరీలను తయారు చేసుకుని పక్కకు పెట్టుకోండి.
- ఈ లోపు నూనె చక్కగా వేడవుతుంది. ఇప్పుడు మీరు తయారు చేసుకున్న పూరీలను ఒక్కొక్కటిగా నూనెలో వేసి వేయించండి.
- పూరీ రెండు వైపులా చక్కగా కాలి రంగు మారేంత వరకూ వేయించండి.
- పూరీలను వేయించే సమయంలో మంటను మీడియం నుంచి హై ఫ్లేంలోకి మారుస్తూ ఉండండి.
- అంతే రుచికరమైన, ఆరోగ్యకరమైన మేతీ మసాలా పూరీ రెడీ అయినట్టే. దీన్ని టామాటా చట్నీ లేదా చోలే మసాలా కర్రీ వంటి మీకు నచ్చిన పూరీ కర్రీతో సర్వ్ చేశారంటే ఇంకా కావాలని అడిగి మరీ తింటారు.
సంబంధిత కథనం