



Best Web Hosting Provider In India 2024

Revanth vs BJP : కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ 9 పేజీల బహిరంగ లేఖ.. కారణం ఇదే!
Revanth vs BJP : కేంద్రం తెలంగాణకు అన్యాయం చేస్తోందని.. కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే.. తామే తెలంగాణను అభివృద్ధి చేస్తున్నామని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంపై కాంగ్రెస్- బీజేపీ మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి 9 పేజీల బహిరంగ లేఖ రాశారు.
కేంద్రమంత్రి కిషన్రెడ్డికి 9 పేజీల బహిరంగ లేఖ రాశారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్రానికి తెలంగాణ విజ్ఞప్తి చేసిన అంశాలను లేఖలో ప్రస్తావించారు. తెలంగాణ అభ్యర్థనలను కేంద్రం పట్టించుకోవడం లేదని.. బెంగళూరు, చెన్నై మెట్రో ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చిన కేంద్రం.. హైదరాబాద్ మెట్రో విస్తరణ విషయంలో నిర్లక్ష్యం చేస్తోందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
రాష్ట్రం ఎదురుచూస్తోంది..
కీలక ప్రాజెక్టులకు కేంద్రం అనుమతుల కోసం రాష్ట్రం ఎదురుచూస్తోందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మెట్రో ఫేజ్-2కు రూ.24,269 కోట్లు, ఆర్ఆర్ఆర్ కోసం రూ.34,367 కోట్లు, మూసీ పునరుజ్జీవానికి రూ.10 వేల కోట్లు కోరినా ఇవ్వలేదని లేఖలో రేవంత్ ప్రస్తావించారు. సొంత రాష్ట్రం కంటే ఇతర రాష్ట్రాలకే కిషన్ రెడ్డి ప్రాధాన్యం ఇస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.
ప్రధానికి విజ్ఞప్తులు..
ఇటీవల ప్రధానిని కలిసిన రేవంత్ పలు విజ్ఞప్తులు చేశారు. హైదరాబాద్ మహా నగరంలో మెట్రో రైలు సౌకర్యం అన్ని ప్రాంతాలకు అందుబాటులోకి తేవడానికి ఉద్దేశించిన మెట్రో రైల్ ఫేజ్-IIకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం పదేళ్లుగా హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణపై దృష్టి సారించలేదని ప్రధానమంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. హైదరాబాద్ నగరంలో ఫేజ్-II కింద రూ.24,269 కోట్ల అంచనా వ్యయంతో 76.4 కి.మీ పొడవైన 5 కారిడార్లను ప్రతిపాదించామని రేవంత్ వివరించారు.
దక్షిణ భాగం కోసం..
రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగంలో ఇప్పటికే 90 శాతం భూ సేకరణ పూర్తయిందని.. దక్షిణ భాగాన్ని వెంటనే మంజూరు చేయాలని ప్రధానమంత్రిని రేవంత్ రెడ్డి కోరారు. ఉత్తర భాగంతో పాటే దక్షిణ భాగం పూర్తయితే.. ఆర్ఆర్ఆర్ను పూర్తిగా సద్వినియోగం చేసుకోగలమన్నారు. దక్షిణ భాగం భూ సేకరణకు అయ్యే వ్యయంలో 50 శాతం భరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
రింగ్ రైలు ప్రాజెక్టు..
ఆర్ఆర్ఆర్కు సమాంతరంగా రీజినల్ రింగ్ రైలు ప్రాజెక్టు ప్రతిపాదన ఉందని ముఖ్యమంత్రి ప్రధానికి వివరించారు. ఈ రీజినల్ రింగ్ రైలు పూర్తయితే.. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోని రైలు మార్గాలతో అనుసంధానత (కనెక్టవిటీ) సులభమవుతుందని, రీజినల్ రింగ్ రైలుకు అనుమతి ఇవ్వాలని కోరారు. తెలంగాణకు వస్తువుల ఎగుమతులు, దిగుమతులు సులువుగా చేసేందుకు రీజినల్ రింగు రోడ్డు సమీపంలో డ్రైపోర్ట్ అవసరమని, ఆ డ్రైపోర్ట్ నుంచి ఏపీలోని సముద్ర పోర్టులను కలిపేందుకు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు తోపాటు.. రోడ్డును ఆనుకొని సమాంతరంగా రైలు మార్గం మంజూరు చేయాలని కోరారు.
మూసీ ప్రాజెక్టుకు..
తెలంగాణ సంస్కృతి, ఆధ్యాత్మికత మూసీ నదితో ముడిపడి ఉందని.. రాజధాని హైదరాబాద్ నగరం మధ్యగా మూసీ ప్రవహిస్తోందని.. అంత ప్రాధాన్యం ఉన్న మూసీ పునరుజ్జీవనానికి సహకరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఈసా, మూసా నదుల సంగమంలో ఉన్న బాపూ ఘాట్ అభివృద్ధి, మూసీ ప్రక్షాళనకు 27 ఎస్టీపీల నిర్మాణం, మూసీ రిటైనింగ్ వాల్స్, కరకట్టల నిర్మాణం, మూసీ గోదావరి నదుల అనుసంధానంతో కలిపి.. మొత్తంగా ప్రాజెక్టుకు రూ.20 వేల కోట్లు ఆర్థిక సహాయం అందచాలని కోరారు. గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కు 222.7 ఎకరాల రక్షణ భూముల బదిలీకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఐపీఎస్లు కావాలి..
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు 61 ఐపీఎస్ కేడర్ పోస్టులు వచ్చాయని, 2015లో రివ్యూ తర్వాత మరో 15 పోస్టులు అదనంగా వచ్చాయని సీఎం రేవంత్ వివరించారు. సైబర్ నేరాలు, డ్రగ్స్ కేసులు పెరగడం, రాష్ట్రంలో పెరిగిన పట్టణాలు, ఇతర అవసరాల దృష్ట్యా.. తెలంగాణకు అదనంగా 29 ఐపీఎస్ పోస్టులు మంజూరు చేయాలని కోరారు. సెమీ కండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు అనువైన పరిస్థితులు తెలంగాణలో ఉన్నందున.. ఇండియా సెమీ కండక్టర్ మిషన్ ప్రాజెక్టును రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు అనుమతించాలని మోదీని రేవంత్ రెడ్డి కోరారు.
టాపిక్