Best Web Hosting Provider In India 2024

తాడేపల్లి: మహిళలు బాగుంటేనే ఆ కుటుంబం, రాష్ట్రం, దేశం బాగుంటుందని, అందరం బాగుంటామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ వైయస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.
వైయస్ జగన్ ‘ఎక్స్’ వేదికగా…
‘నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు. “మహిళలు బాగుంటేనే ఆ కుటుంబం బాగుంటుంది. కుటుంబాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రం బాగుంటే దేశం కూడా బాగుంటుంది’’ అని గట్టిగా నమ్మే వ్యక్తిని. ఆ దిశలోనే మన ప్రభుత్వ కాలంలో మహిళల అభ్యున్నతి, సాధికారతకు పెద్దపీట వేస్తూ పాలన చేశాం. అన్నిరంగాల్లో మహిళలను ప్రోత్సహించి, దాదాపు 32కు పైగా పథకాల ద్వారా వారికి భరోసా కల్పించాం.
నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం కేటాయిస్తూ తొలిసారిగా చట్టం చేశాం. గిరిజన, దళిత మహిళలను డిప్యూటీ సీఎం, హోంమంత్రి లాంటి పెద్ద పదవులతో గౌరవించాం. మహిళల భద్రత, రక్షణ కోసం “దిశ’’ వ్యవస్థను ప్రవేశపెట్టాం. “ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు’’ అన్న నానుడిని నమ్ముతూ ఆ దిశగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టాం. నా భవిష్యత్ రాజకీయ ప్రస్థానం కూడా మహిళాభ్యున్నతే ప్రధాన లక్ష్యంగా సాగుతుంది’ అని తెలిపారు.