

Best Web Hosting Provider In India 2024
Srisailam Dam : ప్రమాదం జరిగే వరకు పట్టించుకోరా.. డేంజర్ బెల్స్ మోగిస్తున్న శ్రీశైలం ప్రాజెక్టు ప్లంజ్ పూల్!
Srisailam Dam : శ్రీశైలం ప్రాజెక్టు ప్లంజ్ పూల్ ప్రాంతంలో ఏర్పడిన గొయ్యి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దీనిపై నీటి పారుదల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2009 నాటి భారీ వరదల సమయంలో ఏర్పడిన గొయ్యి పరిమాణం పెద్దగా ఉందని.. దాని ప్రభావం డ్యామ్పై పడకముందే మరమ్మతులు చేపట్టాలని స్పష్టం చేస్తున్నారు.
శ్రీశైలం ప్రాజెక్టు ప్లంజ్ పూల్ ప్రాంతంలో గొయ్యి ఏర్పడింది. 2009 లో భారీ వరదలకు శ్రీశైలం ప్రాజెక్టు కొంత కుదుపులకు లోనైంది. అప్పుడు ఎన్నడూ లేనంతగా 24 లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహం నమోదైంది. శ్రీశైలం ఆనకట్ట దిగువన ప్లంజ్ పూల్ ఉంటుంది. శ్రీశైలం ఆనకట్ట పునాది 380 అడుగులుగా ఉండగా.. ప్రస్తుతం ఏర్పడిన గొయ్యి 120 మీటర్ల వరకు ఉందని అంటున్నారు.
పునాదుల లోతుకు..
ఈ గుంత డ్యామ్ పునాదుల లోతును మించిపోయిందని.. ఇది డ్యామ్ భద్రతకు ప్రమాదకరం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ గుంత డ్యామ్ పునాదుల వరకు విస్తరించి రాతిఫలకాల మధ్య పెళుసుతో ఉన్న జాయింట్ల (షీర్ జోన్)ను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. తక్షణ మరమ్మతులు చేపట్టకపోతే.. ఊహించని ప్రమాదం జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఎన్డీఎస్ఏ అలర్ట్..
గేట్ల ద్వారా విడుదలయ్యే నీటి ప్రభావంతో ఈ గొయ్యి ఏర్పడిందని, దానిని తక్షణమే పూడ్చాల్సిన అవసరం ఉందని జాతీయ ఆనకట్టల భద్రత పర్యవేక్షణ సంస్థ (ఎన్డీఎస్ఏ) స్పష్టం చేసింది. శ్రీశైలం ప్రాజెక్టు ప్లంజ్ పూల్లో పడిన గొయ్యికి మే నెలలోపు రిపేర్లు చేయాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఆ బాధ్యత ఏపీదే..
శ్రీశైలం జలాశయం నిర్వహణ ఏపీ పరిధిలో ఉన్నందున.. ఆ జలాశయం భద్రత బాధ్యత ఆ రాష్ట్ర అధికారులదేనని ఎన్డీఎస్ఏ స్పష్టం చేసింది. శ్రీశైలం ప్రాజెక్టు ప్లంజ్పూల్లో ఏర్పడిన గొయ్యిని కాంక్రీట్ టెట్రాపాడ్స్తో పూడ్చాల్సిందిగా ఎన్డీఎస్ఏకి తెలంగాణ ఈఎన్సీ జి. అనిల్ కుమార్ విజ్ఞప్తి చేశారు. కానీ ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో మరమ్మతులు జరగడం లేదు. దీనిపై నీటిపారుదల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రాజెక్టు వివరాలు..
ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని 1960లో ప్రారంభించారు. 1981లో పూర్తయింది. శ్రీశైలం ఆనకట్ట ఎత్తు 145.10 మీటర్లు, పొడవు 512 మీటర్లు ఉంటుంది. ఈ ప్రాజెక్టులో 1,670 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన జల విద్యుత్ కేంద్రం ఉంది. 2009 అక్టోబర్ 2న ఈ ప్రాజెక్టు చరిత్రలోనే అత్యధికంగా 25 లక్షల క్యూసెక్కుల వరద నీరు జలాశయంలోకి వచ్చింది. శ్రీశైలం జలాశయాన్ని గరిష్టంగా 19 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకునేలా నిర్మించారు. 2009 అక్టోబర్లో ఏకంగా 25.5 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తింది.
నిర్వహణలో లోపాలు..
ప్రాజెక్టు నిర్వహణలో కొన్ని లోపాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. గేట్ల నిర్వహణ, ఇతర పనులపై నిర్లక్ష్యం వహించడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. స్థానిక చిన్నస్థాయి కాంట్రాక్టర్లే వీటిని చూస్తుండగా.. బిల్లులు చెల్లించకపోవడంతో పనులు చేపట్టేందుకు వారు ముందుకు రావడం లేదు. పనులు చేయకపోతే వరదల సమయంలో గేట్లు మొరాయించే ప్రమాదం ఉంటుంది.
టాపిక్