



Best Web Hosting Provider In India 2024

TG Group1 Results: నేడే తెలంగాణ గ్రూప్ 1 ఫలితాలు విడుదల, అభ్యంతరాల స్వీకరించాక ఇంటర్వ్యూ జాబితా విడుదల
TG Group1 Results: తెలంగాణ గ్రూప్ 1 ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఏప్రిల్లోగా తెలంగాణలో ఉద్యోగా నియామకాలను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుండటంతో ప్రాధాన్యత క్రమంలో మొదట గ్రూప్ 1 ఫలితాలు విడుదల చేసి నియామకాలు పూర్తి చేస్తారు. ఆ తర్వాత మిగిలిన ఉద్యోగాల భర్తీ చేపడతారు.

TG Group1 Results: తెలంగాణలో గ్రూప్స్ 1 పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్-1 ఫలితాలు సోమవారం విడుదల చేసేందుకు కమిషన్ ఏర్పాట్లు చేసింది. తెలంగాణలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రధాన పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను సోమవారం టీజీపీఎస్సీ విడుదల చేయనుంది. మంగళవారం గ్రూప్ 2 పరీక్షల జనరల్ ర్యాంకింగ్స్… మార్చి 14న గ్రూప్ 3 పరీక్షల జనరల్ ర్యాంకింగ్ విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది.
తెలంగాణలో ఉద్యోగ నియామకాల్లో భాగంగా గ్రూప్ 1 ఫలితాలను నేడు వెల్లడిస్తారు. ఆ తరువాత అభ్యర్థుల నుంచి రీకౌంటింగ్ ఆప్షన్లు స్వీకరిస్తారు. రీకౌంటింగ్, వెరిఫికేషన్ ముగిసిన తర్వాత 1:2 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు అర్హత సాధించిన వారి జాబితా వెల్లడిస్తారు. అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను టీజీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 11 సంవత్సరాల తర్వాత మొట్టమొదటి గ్రూప్-1 నియామకాలు ఇవే కావడంతో నిరుద్యోగులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
తెలంగాణలో563 గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన మెయిన్స్ పరీక్షల ఫలితాలను ఫిబ్రవరిలోనే విడుదల చేయాలని కమిషన్ భావించినా ఆలస్యమైంది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఇప్పటికే ముగి సింది. గ్రూప్ 1 పరీక్షలకు హాజరైన అభ్యర్థులు సాధించిన మార్కులను బట్టి 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా వెల్లడించేందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ తుది పరిశీలన చేస్తోంది.
తెలంగాణ గ్రూప్-1 ప్రధాన పరీక్షలకు 21,093 మంది హాజరయ్యారు. ఒక్కో పోస్టుకు 38 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. గ్రూప్ 1 నియామకాలు పూర్తైన తర్వాత గ్రూప్-2, ఆ తర్వాత గ్రూప్-3 పరీక్షల ఫలితాలు వెల్లడించేందుకు కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. ప్రాధాన్య క్రమంలో ఉద్యోగాలను భర్తీ చేస్తే బ్యాక్లాగ్ ఉండవని ఈ మేరకు నిర్ణయించారు.
రీ కౌంటింగ్కు అవకాశం…
గ్రూప్-1 ప్రధాన పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను కమిషన్ వెబ్సైట్లో విడుదల చేస్తారు. సబ్జె క్టుల వారీగా మార్కులను అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లో అందుబాటులో ఉంచుతారు. మార్కుల లెక్కింపుపై సందేహాలుంటే రీకౌంటింగ్ కలిపి మెరిట్ జాబితాతో ఆప్షన్ కల్పిస్తారు. 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా విడుదల చేసిన 15 రోజుల్లోగా అభ్యర్థులు ఒక్కో పేపర్కు రూ. వెయ్యి చెల్లించి రీకౌంటింగ్కు దరఖాస్తు చేసుకోవచ్చు.
గతేడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. ఇందుకు 21,151 మంది (67.3 శాతం) హాజరయ్యారు. వీరంతా కూడా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. జనరల్ ర్యాకింగ్ లిస్ట్ విడుదలైతే… గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి దాదాపు లైన్ క్లియర్ అవుతోంది.
ఇప్పటికే గ్రూప్ 2, 3 ప్రాథమిక కీలు కూడా విడుదలయ్యాయి. అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ కూడా ముగిసింది. వీటికి సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టులు కూడా సిద్ధం చేసే పనిలో టీజీపీఎస్సీ ఉంది. మొత్తంగా చూస్తే మార్చి నెలఖారు నాటికి కీలకమైన గ్రూప్ 1, 2,3 ఫలితాలన్నీ విడుదలయ్యే అవకాశం ఉంది.
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల్లో మొత్తం ఏడు పేపర్లకు 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారు. గత ఏడాది అక్టోబర్ 21 నుంచి నిర్వహించిన పరీక్షలు 27వ తేదీతో ముగిశాయి. మొత్తం 563 పోస్టుల భర్తీకి నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు మొత్తం 31,403 మంది అర్హత పొందారు. వీరిలో హైకోర్టు అనుమతితో పరీక్షలకు హాజరైన 20 మంది స్పోర్ట్స్ క్యాటగిరీ అభ్యర్థులు కూడా ఉన్నారు.
సంబంధిత కథనం
టాపిక్