

Best Web Hosting Provider In India 2024
Nalgonda : పరువు కత్తికి బలైన ప్రేమ.. ప్రణయ్ హత్య కేసులో తుది తీర్పు నేడే.. సర్వత్రా ఆసక్తి
Nalgonda : వారిద్దరు ప్రేమించుకున్నారు. అమ్మాయి కుటుంబం ఒప్పుకోలేదు. అయినా పెళ్లి చేసుకున్నారు. అమ్మాయి తండ్రి పరువు పోయిందని భావించాడు. కూతురు ప్రేమపై పరువు కత్తితో వేటు వేయించాడు. కుమార్తె తాళి తెంచాడు. ఆఖరికి ఆయన కూడా ఊపిరి తీసుకున్నాడు. అమృత- ప్రణయ్ కేసులో ఇవాళ తుది తీర్పు రాబోతోంది.
ప్రణయ్ హత్య.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ పరువు హత్య కేసుకు సంబంధించి ఇవాళ తుది తీర్పు వెలువడనుంది. నల్గొండ జిల్లాలో అమృత అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు.. ప్రణయ్ అనే యువకుడిని అమృత తండ్రి మారుతీరావు కిరాయి హంతకుల ముఠాతో దారుణంగా హత్య చేయించారు. 2018లో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ఈ పరువు హత్య కేసు తీవ్ర సంచలనంగా మారింది.
8 మందిపై కేసు నమోదు..
ప్రణయ్ తండ్రి బాలస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. మారుతీరావుతో సహా ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తన కుమార్తె అమృత కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతోనే ఆమె తండ్రి మారుతీ రావు సుపారీ గ్యాంగ్తో ప్రణయ్ను హత్య చేయించాడని పోలీసులు నిర్ధారించారు. ఈ హత్య కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి 2019 జూన్ 12న 1600 పేజీలతో ఛార్జిషీటు దాఖలు చేశారు.
తీర్పు రిజర్వ్..
ఛార్జిషీటు నివేదిక, పోస్టుమార్టం రిపోర్టు, సాంకేతిక ఆధారాలతో పాటు సాక్షులను న్యాయస్థానం విచారించింది. తుది తీర్పును మార్చి 10కి న్యాయస్థానం రిజర్వు చేసింది. సుమారు ఐదున్నర ఏళ్ల పాటు ఈ కేసు విచారణ కొనసాగింది. ఈ మధ్యలోనే ప్రధాన నిందితుడు మారుతీరావు 2020 మార్చి 7న హైదరాబాద్ ఆర్య వైశ్య భవనంలో ఆత్మహత్య చేసుకున్నారు.
మారుతీరావు సూసైడ్..
ఈ కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు ఆత్మహత్య చేసుకోగా.. సుభాష్ శర్మ, అజ్గర్ ఆలీ, అబ్దుల్ బారీ, ఎంఎ కరీం, తిరునగరు శ్రవణ్ కుమార్, శివ, నిజాంలు నిందితులుగా ఉన్నారు. వీరిలో సుభాష్ శర్మ, అస్గర్ ఆలీ మినహా మిగతా ఐదుగురు నిందితులు గతంలోనే బెయిల్పై విడుదలయ్యారు. అస్గర్ ఆలీ గతంలో గుజరాత్ మాజీ హోంశాఖ మంత్రి హరేన్ పాండ్యా హత్యతో పాటు పలు ఉగ్ర కుట్రలోనూ కీలక నిందితుడిగా ఉన్నారు.
రంగనాథ్ కీలక పాత్ర..
ఈ కేసులో న్యాయస్థానం వెల్లడించే తుది తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రణయ్ హత్య కేసు దర్యాప్తులో ప్రస్తుత హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలకంగా వ్యవహరించారు. హత్యకు ముందే అమృత తండ్రిని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. అటు ప్రణయ్ కుటుంబ సభ్యులను పిలిపించి జాగ్రత్తగా ఉండాలని.. ఏదైనా సమస్య వస్తే పోలీసులకు చెప్పాలని సూచించారు. ఇంకా పలు విషయాలను ఆయన వివిధ ఇంటర్వ్యూలలో పంచుకున్నారు.
టాపిక్