Best Web Hosting Provider In India 2024

12న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసనలు
వైయస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర వెల్లడి
ఫీజు రీయింబర్స్మెంట్ రాక చదువులకు దూరమవుతున్న విద్యార్థులు
డీఎస్సీ, గ్రూప్- 2 పేరుతో నిరుద్యోగ యువతతో ప్రభుత్వం ఆటలు
నిరుద్యోగ భృతికి రెండో ఏడాదీ మొడిచేయి
ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
బాబు ష్యూరిటీ … మోసం గ్యారెంటీ
పానుగంటి చైతన్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర ధ్వజం
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర
తాడేపల్లి: వైయస్ఆర్సీపీ నేతృత్వంలో యువత పోరు ద్వారా మొద్ద నిద్రపోతున్న కూటమి ప్రభుత్వ కళ్ళు తెరిపిస్తామని వైయస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర అన్నారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు అన్ని వర్గాలకు హామీలను గుప్పించి, అధికారంలోకి వచ్చిన తరువాత వారిని నిలువునా మోసం చేస్తోందని మండిపడ్డారు. యువతకు ఉపాధి, నిరుద్యోగభృతి అంటూ తీయని మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారని, నేడు వారి గురించి పట్టించుకునే పాపాన పోవడం లేదని ధ్వజమెత్తారు.
వైయస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య మాట్లాడుతూ…
వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ పిలుపు మేరకు విద్యార్థులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల, నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ పై రేపు (ఈనెల 12న) రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలో పేద, మధ్యతరగతి విద్యార్దులకు తీరని అన్యాయం చేసేలా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాలను విద్యార్థిలోకం పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్దకు విద్యార్థులు, నిరుద్యోగ యువతతో ర్యాలీగా వెళ్లి నిరసన కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం కలెక్టర్లకు విజ్ఞాపనపత్రాలు ఇవ్వడం జరుగుతుంది. వైయస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి విద్యార్థులు, యువత భారీగా తరలి రావాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్యార్థులకు కష్టాలు మొదలయ్యాయి. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ కోసం నిధులు విడుదల చేయకపోవడంతో పేద విద్యార్థులు చదువులకు దూరమవుతున్న ఘటనలు రాష్ట్రంలో చోటుచేసుకుంటున్నాయి. విద్యార్థుల జీవితాలతో సీఎం చంద్రబాబు చెలగాటం ఆడుతున్నారు. ఫీజులు చెల్లించలేదనే కారణంతో కాలేజీ యాజమాన్యాలు కూడా విద్యార్థులకు సర్టిఫికెట్లు, హాల్ టికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నాయి. 9 నెలల్లోనే ప్రకాశం జిల్లాలో ఒక విద్యార్థి ఫీజులు కట్టలేక కూలి పనులకు పోతున్నాడనే విషయం అన్ని పత్రికల్లో వచ్చింది. విజయవాడ చైతన్య గోశాల క్యాంపస్ వద్ద ఫీజు కట్టలేదని ఒక విద్యార్థిని గేట్ల బయట నిలబెట్టారు. అనంతపురంలో చరణ్ అనే విద్యార్థిని ఫీజులు కట్టలేదని అవమానించడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలే జరుగుతున్నా సీఎం చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాడు. రూ. 3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల్లో చెప్పి అధికారంలోకి వచ్చాక పథకం కోసం బడ్జెట్లో రూపాయి కూడా కేటాయించకుండా ప్రభుత్వం నిరుద్యోగులను వంచించింది. గ్రూప్- 2 పరీక్షను సైతం వివాదాల్లోకి నెట్టేసి నిరుద్యోగులను బాధిస్తోంది. గత వైయస్ఆర్సీపీ పాలనలో రూ. 8,500 కోట్లతో ఐదేళ్లలో 17 మెడికల్ కాలేజీలు ప్రారంభింగా, 5 కాలేజీలను పూర్తి చేసి అడ్మిషన్లు కూడా జరుగుతున్నాయి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక మిగిలిన కాలేజీలను పూర్తి చేసి అడ్మిషన్లు ఇవ్వకపోగా మెడికల్ సీట్లు వద్దని ఐఎంఏకి లేఖ మెడిసన్ చేయాలన్న పేద విద్యార్థుల ఆశలను వమ్ము చేశారు.
వైయస్ఆర్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర మాట్లాడుతూ…
ఏటా ఫీజు రీయింబర్స్మెంట్(విద్యా దీవెన), వసతి దీవెన కోసం రూ. 3900 కోట్లు అవసరమైతే కూటమి ప్రభుత్వం బడ్జెట్లో కేవలం రూ. 2,644 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుంది. గతేడాది చెల్లించాల్సిన బకాయిలు రూ. 700 కోట్లు మాత్రమే చెల్లించింది. గతేడాది, ఈ ఏడాది కలిపి రూ. 7,100 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంటే, బడ్జెట్లో మాత్రం రూ. 2644 కోట్లు కేటాయించడం విద్యార్థులను మోసం చేయడమే. ఇప్పటికైనా ఫీజులు ఎప్పుడు చెల్లిస్తారో ప్రభుత్వం స్ఫష్టమైన ప్రకటన చేయాలి. గతంలో త్రైమాసికాల వారీగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రీయింబర్స్మెంట్ డబ్బు ఠంచన్గా జమయ్యేది. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక కాలేజీల ఖాతాల్లోనే జమ చేస్తామని చెప్పి నిధులు విడుదల చేయకుండా విద్యార్థులను వేధిస్తోంది. జగన్ ఏర్పాటు చేశారనే కక్షతోనే, ఆయనకు మంచి పేరొస్తుందనే కుట్రతో నిర్మాణ దశలో ఉన్న మెడికల్ కాలేజీలను పూర్తి చేయకండా చంద్రబాబు సేఫ్ క్లోజ్ చేసి ప్రైవేటుకు ధారాదత్తం చేయాలని చూస్తున్నారు. రాష్ట్రంలో 25వేల టీచర్ పోస్టులు ఖాళీలున్నా, చంద్రబాబు 16,347 పోస్టులకు మాత్రమే డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చాడు. వాటిలో కూడా 6,100 పోస్టులు గత వైయస్ జగన్ హయాంలోనే నోటిఫికేషన్ ఇస్తే అంతా తానేనని గొప్పలు చెప్పుకుంటున్నాడు. చంద్రబాబు మొదటి సంతకం మెగా డీఎస్సీకి ఇప్పటికీ అతీగతీ లేదు. తల్లికి వందనం పథకానికి రూ. 13 వేల కోట్లు అవసరమైతే కేవలం రూ.9400 కోట్లు కేటాయించి దగా చేసింది. గత జగన్ పాలనలో 54,83,175 లక్షల మంది విద్యార్థులకు రూ. 18,844 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి అండగా నిలిస్తే.. కూటమి ప్రభుత్వం ఈ బడ్జెట్లో కేవలం రూ. 2644 కోట్లు కేటాయించింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇంగ్లిష్ మీడియం ఎత్తేశారు. బైజూస్ కంటెంట్ ను మాయం చేశారు. ఆఖరుకి వీసీలను కూడా బెదిరించి రాజీనామా చేయించిన దుర్మార్గం ప్రభుత్వం ఇది.
డీఎస్సీ నోటిఫికేషన్, నిరుద్యోగ భృతి పేరుతో నిరుద్యోగులను, రీయింబర్స్మెంట్ నిధుల విడుదల చేయకుండా విద్యార్థులు మోసం చేసి చంద్రబాబు ఎంతటి మోసగాడో మరోసారి నిరూపించుకున్నాడు. చంద్రబాబు మోసాలను చూసి రాష్ట్ర ప్రజలు బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ అంటున్నారు.