




Best Web Hosting Provider In India 2024

CRDA Works: రూ.37 వేల కోట్ల విలువైన పనులకు సీఆర్డీఏ ఆమోదం, త్వరలో పనులు ప్రారంభం
CRDA Works: ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతి నిర్మాణానికి రూ.37వేల కోట్ల రుపాయల విలువైన పనులకు సీఆర్డీఏ అమోదం తెలిపింది. పనులకు సంబంధించి 59 టెండర్లకు సీఆర్డీఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ వివరించారు.

CRDA Works: అమరావతి నిర్మాణం కోసం దాదాపు రూ.37 ,702.15 కోట్ల విలువైన అభివృద్ది పనులకు సంబందించిన 59 టెండర్లకు సీఆర్డీఏ ఆమోదం తెల్పిందని రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఈ నెల 17 న జరిగే క్యాబినెట్ సమావేశంలో వీటన్నింటినీ ఆమోదం పొంది వెంటనే పనులను ప్రారంభిస్తామని చెప్పారు.
వచ్చే నెల నుంచి దాదాపు 20 వేల మంది అమరావతి అభివృద్ది పనుల్లో పాల్గొంటారని నారాయణ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 45 వ సీఆర్డిఏ సమావేశం రాష్ట్ర సచివాలయంలో జరిగిందని, ఈ సమావేశంలో రాజధాని అమరావతి అభివృద్ది పనులకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపారు.
59 పనులకు అమోదం…
అమరావతి కోసం గతంలో దాదాపు రూ.48,012 కోట్ల విలువైన మొత్తం 73 పనులకు సీఆర్డీఏ మరియు క్యాబినెట్ ఆమోదంతో టెండర్లు పిలవడం జరిగిందన్నారు. వీటిలో దాదాపు రూ.37,702.15 కోట్ల విలువైన పనులకు సంబందించిన 59 టెండర్లను సోమవారం ఓపెన్ చేసి, మంగళవారం సీఆర్డీఏలో పెట్టి ఆమోదం పొందినట్టు తెలిపారు.
అమరావతి పనుల నిర్వహణకై లెటర్ ఆఫ్ ఇండెంట్ వెంటనే ఇస్తామన్నారు. మొత్తం 59 పనుల్లో సీఆర్డీఏకు చెందిన 22 పనుల విలువ దాదాపు రూ.22,607.11 కోట్ల అని, ఏడిసి కి చెందిన 37 పనుల విలువ దాదాపు రూ.15,095.04 కోట్లు ఉందన్నారు. సీఆర్డీఏకు చెందినవి 24 పనులు కాగా ప్రస్తుతానికి 22 పనులకు సంబందించిన టెండర్లను మాత్రమే ఓపెన్ చేయడం జరిగిందని, మిగిలిన 2 పనులకు సంబందించిన టెండర్లను ఈ నెల 17 వ తేదీన ఓపెన్ చేస్తామన్నారు.
నెలాఖర్లో మరికొన్ని టెండర్లు…
వీటితో పాటు అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం, ఐకానిక్ బ్రిడ్జి, జాతీయ రహదారికి అనుసందానం చేసే రహదారులు, కరకట్ట రహదారి నిర్మాణం తదితర పనులకు సంబందించి దాదాపు రూ.16,871.52 కోట్ల విలువైన మరో 19 పనులకు ఈ నెలాఖరు లోపు టెండర్లు పిలిచి పనులను చేపడతామన్నారు. అమరావతి అభివృద్ది పనులకు సంబందించి 2014-19 మద్యకాలంలో దాదాపు రూ.43 వేల కోట్ల విలువైన టెండర్లను పిలిచి, రూ.9 వేల కోట్ల వరకూ వెచ్చించినట్టు చెప్పారు.
2014-19 మద్య కాలంలో పలు సంస్థలకు భూములు కేటాయించడం జరిగిందని, ఈ అంశంపై నిన్న జరిగిన మంత్రుల బృందం సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు 31 సంస్థలకు కేటాయించిన భూములకు నేడు జరిగిన సీఆర్డీఏ సమావేశంలో ఆమోదం తెల్పడం జరిగిందన్నారు. రెండు సంస్థలకు స్థలం మార్పుకు, మరో 11 సంస్థలకు స్థలం మార్పుతో పాటు కాల పరిధిని కూడా పొడిగించడం జరిగిందన్నారు.
రాజధాని నిర్మాణానికి రూ.64వేల కోట్ల వ్యయం…
అమరావతి క్యాపిటల్ సిటీ అభివృద్దికి దాదాపు రూ.64 వేల కోట్లు ఖర్చువుతుందని, అందుకు రాష్ట్ర ప్రజల నుండి వసూలు చేసే పన్నుల నుండి ఏమాత్రము ఖర్చు పెట్టే ప్రసక్తే లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన విధంగా జరుగుతుందన్నారు. రైతుల నుండి సేకరించిన భూముల్లో దాదాపు 6,203 ఎకరాలు సీఆర్డీఏకు మిగిలిందని, అందులో దాదాపు 1900 ఎకరాలను పలు సంస్థలకు కేటాయించడం జరుగుచున్నదన్నారు.
సీఆర్టీఏకు 4వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్..
అన్నీ పోగా ఇంకా సీఆర్డీఏ వద్ద అభివృద్ది చేయబడిన స్థలం దాదాపు 4,000 ఎకరాలు ఉంటుందన్నారు. ఆ భూమి తనకా పెట్టడం ద్వారా మరియు వేలం పాట వేసి అమ్మడం ద్వారా వచ్చే ఆదాయంతో క్యాపిటల్ సిటీని నిర్మించడం జరుగుతుందని మంత్రి నారాయణ వివరించారు.
ఇప్పటికే ప్రపంచ బ్యాంకు నుండి రూ.15 వేల కోట్లు మేర ఋణాన్ని తీసుకున్నామని, హడ్కో ద్వారా రూ.11 వేల కోట్లు, వివిధ బ్యాంకుల ద్వారా రూ.5 వేల కోట్ల మేర రుణాన్ని తీసుకోనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ విధంగా దాదాపు రూ.31 వేల కోట్ల ను సమీకరించినట్టు చెప్పారు. ఆ నిధులతో పనులను ప్రారంభిస్తున్నామన్నారు.
ఈ అభివృద్ది పనుల వల్ల భూమి రేట్లు కూడా పెరుగుతాయని, అప్పుడు ఆ భూములను వేలం ద్వారా అమ్మి వచ్చిన సొమ్ముతో అసలు, వడ్డీలను కూడా తీర్చేయడం జరుగుతుందన్నారు. వివిధ బ్యాంకుల నుండి సమీకరిస్తు రుణాల నుండే వెచ్చించేందుకు బడ్జెట్ లో రూ.6 వేల కోట్లను అమరావతి అభివృద్ది పనులకు చూపడం జరిగిందన్నారు.
అమరావతి రాజధాని ప్రాంతంలో అన్ని రకాల భూములు కలుపుకుని దాదాపు 53,500 ఎకరాలు ఉందని, అందులో 30 శాతం వరకూ గ్రీన్ అండ్ బ్లూని అభివృద్ది పర్చడం జరుగుతుందని మంత్రి తెలిపారు.
సంబంధిత కథనం
టాపిక్