



Best Web Hosting Provider In India 2024

Tirumala Laddu : తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీకి నెయ్యి కష్టాలు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
Tirumala Laddu : తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యి సేకరణ రోజు రోజుకు కష్టంగా మారుతుంది. సరిపడా నెయ్యి అందుబాటులో లేకపోవడంతో ప్రసాదాల తయారీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో అధికారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.

Tirumala Laddu : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రసాదాలకు నెయ్యి సేకరణ రోజు రోజు కష్టంగా మారుతోంది. సరిపడా నెయ్యి అందుబాటులో లేకపోవడంతో ప్రసాదాల తయారీలో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. మరోవైపు నెయ్యి కొరతను పసిగట్టిన అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇతర సంస్థల నుంచి నెయ్యి సేకరణకు చర్యలు తీసుకుంటున్నారు.
తిరుమల శ్రీవారి ప్రసాదం (లడ్డూ) అంటే ఇష్టపడని వారు ఉండరు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ఆ మాటకొస్తే ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారి ప్రసాదానికి ప్రియులు ఉన్నారు. శ్రీవారి ప్రసాదమంటే అమృతంగా భావించిన వారు ఉన్నారు. ఆ ప్రసాదం దొరకడం కూడా పూర్వ జన్మ శుక్రుతమనుకునేవారు కూడా ఉన్నారు. ప్రపంచ అభిమానులు ఉన్న ఈ శ్రీవారి ప్రసాదం తయారీ చేయడానికి కీలకమైన పదార్థం నెయ్యి ఇప్పుడు తగినంత అందుబాటులో లేదు. నెయ్యి సేకరణ కష్టంగా మారింది. గత పది రోజులుగా టీటీడీ ఆధీనంలో ఉన్న తిరుమలతో పాటు తిరుపతి, పరిసర ఆలయాలకు సరిపడా నెయ్యి సరఫరా జరగటం లేదు. దీంతో శ్రీవారి ప్రసాదం తయారీలో ఇబ్బందులు తలెత్తున్నాయి.
లడ్డూ ప్రసాదంపై వివాదం
శ్రీవారి ప్రసాదం విషయంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పెద్ద ఎత్తున రగడ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని ప్రకటన చేశారు. దీంతో ఈ అంశం రాష్ట్రంలో సంచలనం అయింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఏకంగా దీక్ష చేయడం, అలాగే తిరుమల వెళ్లి బహిరంగ సభ పెట్టి సనాతన ధర్మ పరిరక్షణను కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తిరుమల వెళ్తానని ప్రకటించడం, అప్పుడు డిక్లరేషన్ అంశం తెరపైకి రావడం, ఆ తరువాత అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ఆయన తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు. టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల వెళ్లి ప్రమాణం చేయడం, పోలీసులు అడ్డుకోవడం ఇలా కొన్ని రోజుల పాటు రాష్ట్రంలో ఇదే అంశం చర్చ జరిగింది. అయితే చివరికి సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవడంతో రాష్ట్రంలో చర్చకు పుల్స్టాప్ పడింది. ప్రస్తుతానికి సీబీఐ నేతృత్వంలోని సిట్ విచారణ జరుపుతుంది.
14 టన్నుల నెయ్యి అవసరం
ప్రస్తుతం శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీకి వాడే నెయ్యి కొరత ఏర్పడింది. తిరుమలలో రోజూ ప్రసాదాల తయారీకి 14 టన్నుల నెయ్యి అవసరం అవుతుంది. ప్రస్తుతం టీటీడీకి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్), ఢిల్లీకి చెందిన ఆల్ఫా కంపెనీలు నెయ్యి సరఫరా చేస్తున్నాయి. కెఎంఎఫ్ నుంచి వచ్చే ఒక్కోక్క లారీలో 40 నుంచి 50 టన్నుల నెయ్యి ఉంటుంది. దీని నాణ్యతను ల్యాబ్లో నిర్ధారించేందుకు దాదాపు రోజున్నర (36 గంటల) పడుతుంది.
40-50 టన్నుల నెయ్యి నిల్వతో
గతంలో టీటీడీ నెయి నిల్వ కేంద్రంలో ముందస్తుగా 40 నుంచి 50 టన్నుల నెయ్యి నిల్వ చేయడంతో కొరత సమస్య రాలేదు. కానీ ప్రస్తుతం అలా జరగటం లేదు. ముందస్తు నిల్వ కింద నెయ్యిని నిల్వ చేయటం లేదు. ఇటీవలి ఒక రోజు నెయ్యి సరఫరా ఆలస్యమైంది. దీంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు లడ్డూ తయారీకి సంబంధించిన బూందీ పోటు తయారీ ఆగింది. వేసవిలో భక్తులు రద్దీ ఉంటుంది. దీంతో లడ్డూ ప్రసాదాలు తయారీకి భారీగా నెయ్యి అవసరం ఏర్పడుతుంది. అయితే ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేయకపోతే ఇబ్బందులు తప్పేలా లేవని టీటీడీ ఉద్యోగులు చెబుతున్నారు.
తిరుపతిలోని స్థానిక ఆలయాల్లోనూ నెయ్యి సరఫరా తగ్గడంతో తిరుచానూరు ఆలయం నుంచి కొద్ది మేర పంపుతున్నారు. సరఫరాదారుల సంఖ్య పడిపోవడంతో కూడా నెయ్యి కొరతకు ఒక కారణమని టీటీడీ ఉద్యోగి చెప్పారు. అయితే టీటీడీ ప్రొక్యూర్మెంట్ (సేకరణ) డిప్యూటీ ఈవో ప్రసాద్ నెయ్యి కొరతపై స్పందిస్తూ త్వరలోనే ఇతర సంస్థల నుంచి నెయ్యి సేకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అప్పటి వరకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అయితే శ్రీవారి ప్రసాదాలకు ఎటువంటి లోటు లేకుండా చేయాలని భక్తులు అంటున్నారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం
టాపిక్