






Best Web Hosting Provider In India 2024

AP Fake Pensions: ఏపీలో నకిలీ పెన్షన్ల ఏరివేత షురూ, వికలాంగుల పెన్షన్లలో భారీగా అక్రమాలు, వేలల్లో అనర్హులకు చెల్లింపులు
AP Fake Pensions: ఏపీలో బోగస్ పెన్షనర్ల గుట్టు వీడుతోంది. సదరం సర్టిఫికెట్లపై ఏపీ ప్రభుత్వం కొన్ని నెలలుగా క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో భారీ సంఖ్యలో అక్రమంగా పెన్షన్లు పొందుతున్నట్టు వెలుగు చూసింది.

AP Fake Pensions: ఏపీలో ఫేక్ పెన్షన్ల గుట్టు వీడుతోంది. గత కొన్ని నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల పెన్షన్ల తనిఖీలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వికలాంగులకు వైకల్యాన్ని బట్టి గరిష్టంగా రూ.15వేల వరకు పెన్షన్లు చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో నకిలీ పత్రాలతో పెన్షన్లు పొందుతున్నారనే అభియోగాలపై ఆరోపణలు రావడంతో వికలాంగుల పెన్షన్లను తనిఖీ చేపట్టారు. ఇప్పటి వరకు పూర్తైన తనిఖీల్లో వేల సంఖ్యలో అక్రమార్కులు బయట పడ్డారు.
వైకల్యం లేకున్నా అడ్డదారిలో ధృవీకరణ పత్రాలను సంపాదించి పెన్షన్లు పొందుతున్న వారి గుట్టు రట్టవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన తనిఖీలలో వేలాదిమంది అక్రమార్కులు పొందుతున్నట్టు గుర్తించారు. రూ.6వేలు, రూ.15వేల పెన్షన్లు పొందే వారిలో అనర్హులను గుర్తించి వారి పెన్షన్లను తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
రాష్ట్రంలో రూ.15వేల పెన్షన్లు పొందుతున్న 25వేల మందిలో 19వేల మందిని ఇప్పటికే సమగ్రంగా తనిఖీ చేశారు. వాటిలో ఉన్న వివరాల ఆధారంగా 3వేల మందికి రూ.15వేల పెన్షన్లకు అనర్హులుగా గుర్తించారు. ప్రకాశం జిల్లాలో స్వల్ప వైకల్యం ఉన్న 300మందికి రూ.15వేల పెన్షన్లు చెల్లిస్తున్నారు. 19వేలమందిలో దాదాపు 10వేల మందికి రూ.6వేల పెన్షన్ పొందడానికి మాత్రమే వైకల్యాన్ని గుర్తించారు. గరిష్ట పెన్షన్ పొందుతున్న వారిలో ఇప్పటికే 24వేల మందికి వైద్య పరీక్షలు పూర్తి చేశారు.
మరోవైపు రాష్ట్రంలో 7.96లక్షల మంది ప్రస్తుతం రూ.6వేల పెన్షన్ పొందుతున్నారు. వీరిలో2లక్షల మందికి వైద్య పరీక్షలు పూర్తి చేసి లక్షన్నర మంది సమాచారాన్ని ఆన్లైన్ చేశారు. వారిలో స్వల్ప వైకల్యం, వైకల్యం లేకున్నా 40వేల మంది పెన్షన్లు పొందుతున్నట్టు గుర్తించారు.
రాష్ట్రంలో గత ఐదేళ్లలో వృద్ధాప్య, వితంతు పెన్షన్లతో వికలాంగుల పెన్షన్లలో భారీ ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయి. వృద్ధాప్య పెన్షన్ రూ.4వేల చెల్లిస్తుండగా దివ్యాంగులకు సగటున దివ్యాంగులకు గరిష్టంగా రూ.15వేలు చెల్లిస్తుండటంతో పెద్ద ఎత్తున అనర్హులను పెన్షన్లలో చేర్చారు. పెన్షన్ల కోసం కూటమి ప్రభుత్వం ప్రతి నెల రూ.3వేల కోట్లను ఖర్చు చేస్తోంది.
వృద్ధాప్య పెన్షన్ల తనిఖీ ఎప్పుడు..
మరోవైపు ఏపీలో ప్రతి నెలల దాదాపు 63లక్షల మందికి రకరకాల పెన్షన్లను చెల్లిస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం కుటుంబాల్లో 90శాతం మందికి తెల్ల రేషన్ కార్డులను మంజూరు చేశారు. రైస్ కార్డుల ప్రతిపాదికన ప్రతి కుటుంబంలో వృద్ధాప్య, వితంతు పెన్షన్లను మంజూరు చేశారు. ఈ క్రమంలో అడ్డదారిలో పెన్షన్లను దక్కించుకున్న వారి సంఖ్య లక్షల్లో ఉంది. రాజకీయ సిఫార్సులు, సిబ్బంది అవినీతితో అర్హత లేకున్నా పెన్షన్లను ఎడాపెడా ఇచ్చేశారు. అనర్హులను గుర్తించే విషయంలో రాజకీయ విమర్శలకు ప్రభుత్వం వెనుకంజ వేస్తోంది.
సంబంధిత కథనం
టాపిక్