



Best Web Hosting Provider In India 2024
Cherlapally Railway Terminal : సీఎం రేవంత్ కీలక నిర్ణయం.. చర్లపల్లి రైల్వే టెర్మినల్కు పొట్టి శ్రీరాములు పేరు!
Cherlapally Railway Terminal : సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టుకుందామని.. ప్రతిపాదించారు. పొట్టి శ్రీరాములు చేసిన కృషిని ఎవరూ తక్కువగా చూడటంలేదని స్పష్టం చేశారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఈ కామెంట్స్ చేశారు.
చర్లపల్లి రైల్వే టెర్మినల్కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టుకుందామని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. చిత్తశుద్ధి ఉంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్రం నుంచి అనుమతులు తీసుకురావాలని సూచించారు. విశాల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు.. బాధ్యతాయుత పదవుల్లో ఉన్నవారు కులాన్ని ఆపాదిస్తున్నారని సీఎం అభ్యంతరం వ్యక్తం చేశారు.
వారిని స్మరించుకుందాం..
‘రాజకీయాలు కలుషితమయ్యాయో.. నాయకుల ఆలోచనలు కలుషితమయ్యాయో తెలియడం లేదు. పొట్టి శ్రీరాములు చేసిన కృషిని ఎవరూ తక్కువగా చూడటంలేదు. వారి ప్రాణత్యాగాన్ని గుర్తించి అందరూ స్మరించుకోవాలి. పరిపాలనలో భాగంగా కొన్ని పాలనా పరమైన నిర్ణయాలు తీసుకున్నాం. రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన వారిని స్మరించుకుని వారి పేర్లు పెట్టుకున్నాం. రాష్ట్ర పునర్విభజన తరువాత గత పదేళ్లుగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది’ అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
అగౌరవపరిచినట్టు కాదు..
‘కొన్ని వర్గాలకు కొందరు అపోహలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర పదవుల్లో ఉన్నవారు కూడా ఇలా చేయడం సమంజసం కాదు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి కాళోజీ పేరు పెట్టుకున్నాం. ఇది ఎన్టీఆర్ను అగౌరవపరిచినట్టు కాదు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీకి.. ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టుకున్నాం. వైఎస్ పేరుతో ఉన్న హార్టికల్చర్ యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టుకున్నాం. వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీకి పీవీ పేరును పెట్టుకున్నాం. ఇందులో భాగంగానే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టుకున్నాం’ అని ముఖ్యమంత్రి వివరించారు.
విశాల ప్రయోజనాల కోసం..
‘ఏపీలో ఆ పాత పేర్లతో కొనసాగుతున్న యూనివర్సిటీలకు తెలంగాణలో పేర్లు మార్చుకున్నాం. ఒకే పేరుతో రెండు యూనివర్సిటీలు ఉంటే పరిపాలనలో గందరగోళం ఉంటుంది. అందుకే తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీలకు, సంస్థలకు తెలంగాణ పేర్లు పెట్టుకుంటున్నాం. అంతే కానీ వ్యక్తులను అగౌరవపరిచేందుకు కాదు. విశాల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు కులాన్ని ఆపాదిస్తున్నారు. కుల, మత ప్రాతిపదికన విభజించి రాజకీయ ప్రయోజనాలు పొందాలనుకుంటే అది తప్పు’ అని రేవంత్ వ్యాఖ్యానించారు.
రోశయ్య పేరు పెట్టుకుందాం..
‘గుజరాత్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరుతో ఉన్న స్టేడియం పేరు తొలగించి.. ప్రధాని మోదీ పేరు పెట్టారు. మేం అలాంటి తప్పిదాలు చేయలేదు. చర్లపల్లి రైల్వే టెర్మినల్కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టుకుందాం. చిత్తశుద్ధి ఉంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్రం నుంచి అనుమతులు తీసుకురావాలి. బల్కంపేట నేచర్ క్యూర్ హాస్పిటల్కు రోశయ్య పేరు పెట్టుకుందాం. రోశయ్య సేవలను కీర్తించుకునేలా అక్కడ వారి విగ్రహాన్ని ఆవిష్కరించుకుందాం’ అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
దేశ చరిత్రలో మొదటిసారిగా..
ఇటు దేశ చరిత్రలో మొదటిసారిగా స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ.. శాసన సభలో బిల్లు ప్రవేశపెట్టారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. బీసీలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ.. మరో బిల్లు ప్రవేశపెట్టారు. ఈ రెండు బిల్లులు చారిత్రాత్మకమని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొనియాడారు.
సంబంధిత కథనం
టాపిక్