






Best Web Hosting Provider In India 2024

Aditya 369: బాలకృష్ణ సైన్స్ ఫిక్షన్ మూవీ ఆదిత్య 369 రీ రిలీజ్ డేట్ ఇదే – హిస్టరీ రిపీట్ అంటూ నిర్మాత కామెంట్స్
బాలకృష్ణ హీరోగా నటించిన ట్రెండ్ సెట్టర్ మూవీ ఆదిత్య 369…. 34 ఏళ్ల తర్వాత మరోసారి థియేటర్లలోకి రాబోతోంది. ఏప్రిల్ 11న ఈ మూవీని రీ రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ప్రకటించారు. ఆదిత్య 369 మూవీకి సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు.

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఆల్ టైమ్ కల్ట్ క్లాసిక్ మూవీ ఆదిత్య 369 మరోసారి థియేటర్ల ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాను ఏప్రిల్ 11న రీ రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ప్రకటించారు. సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ జానర్లో రూపొందిన ఈ మూవీకి సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు.
మోహిని హీరోయిన్గా నటించిన ఈ మూవీకి ఇళయరాజా మ్యూజిక్ అందించారు. దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆదిత్య 369 మూవీకి సమర్పకుడిగా వ్యవహరించడం గమనార్హం. 1991లో థియేటర్లలో రిలీజైన ఆదిత్య 369 ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడమే కాకుండా రెండు నంది అవార్డులను సొంతం చేసుకున్నది.
34 ఏళ్ల క్రితం…
‘ఆదిత్య 369’ రీ రిలీజ్ సందర్భంగా శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ… ”ఈ చిత్రాన్ని 4kలో డిజిటలైజ్ చేశాం. సౌండ్ కూడా 5.1 క్వాలిటీలోకి కన్వర్ట్ చేశాం. ప్రసాద్స్ డిజిటల్ టీం ఆరు నెలల పాటు శ్రమించి చక్కటి అవుట్ పుట్ ఇచ్చారు. 34 ఏళ్ళ క్రితం జూలై 18, 1991న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల్లో ఇప్పటికీ ఎంతో క్రేజ్ ఉంది. రీ రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేయగానే ఎంతో మంది విడుదల తేదీ కోసం ఆసక్తిని కనబరిచారు. అప్పట్లో ఇది చాలా అడ్వాన్స్ సినిమా. ఇప్పటి ట్రెండ్కి కూడా కనెక్ట్ అయ్యే సినిమా.
రెండు పాత్రల్లో బాలకృష్ణ…
అప్పట్లో నేను కొత్త నిర్మాత అయినా సరే నన్ను నమ్మి ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చారు బాలకృష్ణ. శ్రీకృష్ణదేవరాయలుగా, కృష్ణ కుమార్గా… రెండు పాత్రల్లోనూ బాలకృష్ణ అద్భుతమైన నటనను కనబరిచారు.కథకుడిగా, దర్శకుడిగా సింగీతం శ్రీనివాసరావు అసమాప ప్రతిభకు నిదర్శనంగా ఆదిత్య 369 నిలిచింది. ఇటువంటి కథా ఆలోచన ఆయనకు రావడమే కాదు, తెలుగు తెరపై అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ నభూతో నభవిష్యత్ అనే రీతిలో ఈ సినిమాని తీర్చిదిద్దారు.
అంతే ఎగ్జైట్మెంట్….
1991లో ఈ సినిమా రిలీజ్ సమయంలో నేను ఎంత ఎగ్జైట్ అయ్యానో, ఇప్పుడు రీ రిలీజ్ సమయంలోనూ అంతే ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఇళయరాజా సంగీతం, జంధ్యాల మాటలు, ముగ్గురు సినిమాటోగ్రాఫర్లు పీసీ శ్రీరామ్ - వీఎస్ఆర్ స్వామి – కబీర్ లాల్ ఛాయాగ్రహణం ఆదిత్య 369ను ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేశాయి. బాలీవుడ్ టాప్ విలన్ అమ్రిష్ పురి, ఫేమస్ నటుడు టినూ ఆనంద్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచారు.
తెలుగు ప్రేక్షకులకు కానుక…
నందమూరి అభిమానులకు మాత్రమే కాదు, తెలుగు ప్రేక్షకులకు ఇదొక గొప్ప కానుక. ఇప్పటి వరకు నిర్మాతగా 15 సినిమాలు చేశాను. ఎన్ని హిట్ సినిమాలు తీసినా సరే… నాకు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఒక గౌరవాన్ని, గుర్తింపును తీసుకొచ్చిన సినిమా ‘ఆదిత్య 369’. మా సంస్థ శ్రీదేవి మూవీస్ పేరును చరిత్రలో నిలిచిపోయేలా చేసిన చిత్రం ఇది.ఆదిత్య 369 మరోసారి ప్రేక్షాదరణ పొంది బాలయ్య బాబు హిట్ హిస్టరీని రిపీట్ చేస్తుందన్న నమ్మకం వుంది” అని నిర్మాత అన్నారు.
సంబంధిత కథనం