




Best Web Hosting Provider In India 2024

Vontimitta Sitaramula Kalyanam : పండుగ వాతావరణంలో ఒంటిమిట్ట సీతారాముల కల్యాణోత్సవం, ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా ఏర్పాట్లు
Vontimitta Sitaramula Kalyanam : ఒంటిమిట్టలో ఏప్రిల్ 11 జరగనున్న సీతారాముల కల్యాణోత్సవానికి ఏర్పాట్లు చేపట్టాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులకు సూచించారు. కల్యాణోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొని సీతారాములకు పట్టువస్త్రాలు, తలంబ్రాలు అందజేస్తారు.

Vontimitta Sitaramula Kalyanam : ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 11న జరగనున్న సీతారాముల కల్యాణోత్సవం పండుగ వాతావరణంలో భక్తులందరూ వీక్షించేలా ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సూచించారు. ఈ సందర్భంగా ఒంటిమిట్టలో జరిగిన సమీక్షాలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ… రాష్ట్ర విభజన అయ్యాక దేవాదాయ శాఖ నుంచి ఒంటిమిట్ట ఏకశిలానగరాన్ని 2015లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో టీటీడీలో విలీనం చేశారని, అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో టీటీడీ ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారని గుర్తు చేశారు.
2019లో కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎం చంద్రబాబు నాయుడు సూచనలతో సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. ఆగమ శాస్త్రం ప్రకారం ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా ఆలయాల్లో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం వైభవంగా జరిపించాలని, అన్నమయ్య నివసించిన ప్రాంతం కనుక ఇక్కడే టీటీడీ ఆధ్వర్యంలో కల్యాణం నిర్వహించాలని సీఎం భావించారని గుర్తు చేశారు.
ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని నిర్ణయించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పండుగకు ముత్యాల తలంబ్రాలు సమర్పించడానికి సీఎం చంద్రబాబు వస్తున్నారని వెల్లడించారు.
పార్కింగ్ కు ప్రత్యేక ఏర్పాట్లు
ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు విశేషంగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అందుకు తగ్గట్టుగా టీటీడీ, జిల్లా యంత్రాంగం సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను కోరారు. సీఎం వచ్చి వెళ్లేంత వరకు పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కోరారు. హైవే సెక్టార్ లలో తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల నుండి అంబులెన్స్ లను అదనంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సీసీ కెమెరాలు , డ్రోన్ కెమెరాలు పెంచాలని, వేసవి నేపథ్యంలో ఫైర్ సర్వీస్ మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భక్తులు వెలుపలికి సులువుగా వచ్చేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని, పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. ఒంటిమిట్ట ఆలయాన్ని ఒక గొప్ప పుణ్య క్షేత్రంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు.
కల్యాణ వేదిక వద్ద మెరుగైన సౌకర్యాలు
కడప జిల్లా ఇంఛార్జ్ మంత్రి ఎస్. సవిత మాట్లాడుతూ, అందరూ కలిసికట్టుగా సమిష్టిగా పనిచేసి సీతారాముల కల్యాణోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. కల్యాణ వేదిక ప్రవేశ, నిష్క్రమణ మార్గాల్లో భక్తులకు ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో జరిగిన సమీక్షలో కల్యాణ వేదిక వద్ద భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని భక్తులకు మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని మంత్రులు సూచించారు. గ్యాలరీల్లో భక్తులకు కల్పించాల్సిన వసతులు ఇతర ఏర్పాట్లపై జిల్లా అధికారులతో చర్చించారు. కడప జిల్లా ఎస్పీతో సమన్వయం చేసుకుని పోలీసులు, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పటిష్ట బందోబస్తు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.
ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా, వాహనాల పార్కింగ్, భక్తుల అవసరాలకు తగినన్ని ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. కల్యాణ వేదిక వద్ద బారికేడ్లు, అన్న ప్రసాదం కౌంటర్లు, లైటింగ్, వైద్యశిబిరాలు, మరుగుదొడ్లు, అదనపు పారిశుద్ధ్య సిబ్బంది తదితర అంశాలపై చర్చించారు. సమీక్షకు ముందు కల్యాణోత్సవానికి జరుగుతున్న ఏర్పాట్లపై మంత్రులకు జిల్లా కలెక్టర్, టీటీడీ జేఈవో, జిల్లా ఎస్పీ, టీటీడీ సీవీఎస్వోలు నివేదించారు.
సంబంధిత కథనం
టాపిక్