




Best Web Hosting Provider In India 2024

Congress vs BJP : మా సహనాన్ని చేతగానితనంగా తీసుకోవద్దు.. బండి సంజయ్పై టీపీసీసీ చీఫ్ ఫైర్
Congress vs BJP : సన్న బియ్యం పంపిణీపై క్రెడిట్ వార్ జరుగుతోంది. తామే పంపిణీ చేస్తున్నామని స్టేట్ గవర్నమెంట్ చెబుతుండగా.. డబ్బులు కేంద్రానివని బీజేపీ అంటోంది. ఈ ఇష్యూపై పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్.. బండి సంజయ్పై ఫైర్ అయ్యారు.

బండి సంజయ్పై టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ ఫైరయ్యారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులపై చర్చకు సిద్ధమా సంజయ్ అని సవాల్ విసిరారు. సన్నబియ్యం పంపిణీని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇవ్వాలని మోదీకి లేఖ రాసే దమ్ముందా అని ప్రశ్నించారు. బీసీల 42 శాతం రిజర్వేషన్ల చట్ట బద్ధత కోసం మోదీని అడిగే ధైర్యం ఉందా.. అని నిలదీశారు.
మోదీకి లేఖ రాయగలరా..
‘దేశ వ్యాప్తంగా జనగణన తోపాటు.. కుల గణన చేపట్టాలని మోదీకి లేఖ రాయగలవా? కేంద్రమంత్రులు సంజయ్, కిషన్ రెడ్డి తెలంగాణ అభివృద్ధికి సహకరించాల్సింది పోయి.. అడుగడుగునా అడ్డుపడడం సిగ్గుచేటు. అభివృద్ధి, సంక్షేమం.. రెండు కళ్ల సిద్ధాంతంతో పనిచేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదు. మా సహనాన్ని చేతగానితనంగా తీసుకోవద్దు’ అని మహేశ్ గౌడ్ వార్నింగ్ ఇచ్చారు.
రాష్ట్రానికి గుండు సున్నా..
‘బీఆర్ఎస్తో బీజేపీ అనైతిక పొత్తుతోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై సంజయ్ దుష్ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ నుంచి కేంద్రానికి వేల కోట్లు పన్నులు వెళ్తే.. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు గుండు సున్నా. కేంద్రమంత్రిని అని మర్చిపోయి సంజయ్ దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. సామాన్యుల పాలిట గ్యాస్ బండ ధరలు గుదిబండలా మారాయి’ అని టీపీసీసీ చీఫ్ విమర్శించారు.
పేదలకు వరం..
‘పేదల కడుపులను కొట్టి కార్పోరేట్స్కి దోచిపెట్టడమే బీజేపీ సర్కార్ విధానం. తెలంగాణ సన్న బియ్యం పంపిణీ నిరుపేదలకు వరం. స్వతంత్ర భారత చరిత్రలో పేదలకు సన్నబియ్యం పంపిణీ చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణ. సన్నబియ్యం పంపిణీకి ప్రభుత్వం ఏడాదికి రూ.13 వేల కోట్లు ఖర్చు చేస్తోంది’ అని మహేశ్ కుమార్ గౌడ్ వివరించారు.
కేంద్రమే ఇస్తోంది..
‘రాష్ట్రంలో పంపిణీ చేస్తున్న సన్న బియ్యం కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తోంది. కిలో బియ్యానికి కేంద్రం రూ.40 చెల్లిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.10 మాత్రమే భరిస్తోంది. కేంద్ర ప్రభుత్వ నిధులతో పంపిణీ చేస్తున్నందునా.. ఆ బియ్యం ప్యాకెట్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటం ఎందుకు ఉంచడం లేదు. పార్టీ కార్యకర్తలు మోదీ చిత్రపటాలు పెడితే వాటిని తొలగిస్తున్నారు. సన్న బియ్యం కేంద్ర ప్రభుత్వమే ఇస్తోందనే విషయాన్ని తెలంగాణలోని ప్రతి ఇంటికీ వెళ్లి ప్రచారం చేస్తాం’ అని బండి సంజయ్ స్పష్టం చేశారు.
సంబంధిత కథనం
టాపిక్