



Best Web Hosting Provider In India 2024

Kotha Prabhakar Reddy : డబ్బులు ఇస్తాం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేయండి- కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై రాజకీయ దుమారం
Kotha Prabhakar Reddy :కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని దించేయాలని వ్యాపారులు కోరుతున్నారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై మంత్రులు, కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. తన వ్యాఖ్యలపై కొత్త ప్రభాకర్ రెడ్డి వివరణ ఇచ్చారు.
Kotha Prabhakar Reddy : మేము డబ్బులు ఎన్నైనా ఇస్తాం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని దించేయాలని రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కాంట్రాక్టర్లు, ఇతర వ్యాపారాలు తమను కోరుతున్నారని, దుబ్బాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం లేపాయి. నిన్న దుబ్బాక లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ సమావేశం లో మాట్లాడుతూ, ప్రభాకర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, వ్యాపారాలు మొత్తమే నడుస్తలేవని, అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలని వ్యాపారులు, ప్రజలు కోరుకుంటున్నారని అయన అన్నారు. పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ కాంగ్రెస్ ప్రభుత్వంతో విసిగి వేసారి పోయారని ప్రభాకర్ రెడ్డి అన్నారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు.
ప్రభాకర్ రెడ్డి పై ఫిర్యాదు
ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ దుబ్బాకలో కాంగ్రెస్ నాయకులు ధర్నా చేశారు. కొత్త ప్రభాకర్ రెడ్డి దిష్టి బొమ్మను తగల బెట్టడంతో పాటు, దుబ్బాక పోలీస్ స్టేషన్ లో ప్రభాకర్ రెడ్డిపై ఫిర్యాదు కూడా చేశారు. కాంగ్రెస్ నేత చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… బీఆర్ఎస్ ప్రభుత్వం గత పది సంవత్సరాలలో వ్యాపారులకు, రియాల్టర్లకు వత్తాసు పలికిందని, అందుకే వారు బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని విమర్శించారు. కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా వ్యాపారి కావడం వలన వారికి వత్తాసుపలుకుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా, పలువురు కాంగ్రెస్ మంత్రులు కూడా ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు ఖండించారు. అయితే 24 గంటల లోపే ప్రభాకర్ రెడ్డి మాట మార్చారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.
తన వ్యాఖ్యలపై పెద్ద దుమారం రేగడంతో… కొత్త ప్రభాకర్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వ 16 నెలల పాలనను ప్రజలు ఈసడించుకుంటున్నారని, అదే విషయాన్ని నేను మాట్లాడితే వక్రీకరిస్తూ మంత్రులు మాట్లాడుతున్నారని ఆరోపించారు. దుబ్బాకలో తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు హరిగోస పడుతున్నారని సామాన్య ప్రజలతో పాటు దేశ ప్రధాని సైతం కాంగ్రెస్ పాలనపై పెదవి విరుస్తున్నారన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో అడవులపై కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్లు నడిపిస్తున్నారని స్వయంగా ప్రధానమంత్రే విమర్శించారన్నారు.
కాంగ్రెస్ హయాంలో రియల్ ఎస్టేట్ కుంటుపడింది
కాంగ్రెస్ హయాంలో రియల్ ఎస్టేట్ కుంటుపడిపోయిందని, ఆపద సమయంలో నాలుగు గుంటలు అమ్ముకుందామనుకున్నా ఎవరు కొనడం లేదన్నారు. అనుకున్న పనులు కావడం లేదని, ప్రభుత్వం ఎప్పుడు పోతే అప్పుడు బాగుండు అని సామాన్య ప్రజలతో పాటు, పారిశ్రామిక వేత్తలు, రియాల్టర్లు, రైతులు కోరుకుంటున్నారనేది తన వ్యాఖ్యల అర్థం అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని సబ్బండ వర్గాలు కోరుకుంటున్నాయన్నారు.
మా ఎమ్మెల్యేలనే కాంగ్రెస్ గుంజుకుంది
మీ ఎమ్మెల్యే లను కొనాల్సిన ఆగత్యం మాకు పట్టలేదని, మీ ఎమ్మెల్యేల మీద నమ్మకం లేకనే బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలను గుంజుకున్నారని కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ కు తానే కాదు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఆత్మలుగానే ఉంటారని, గతంలో కేసీఆర్ ఆత్మగా ఉన్న పొంగులేటి నేడు మంత్రి అయ్యారని, ఇప్పుడు ఆయన విమర్శలు చేయడం విడ్డురంగా ఉందన్నారు. మా మీద విమర్శలు పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీని సక్కపెట్టుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్, రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. మీరన్నట్లు నాతో పాటు నార్కో అనాలిసిస్ పరీక్షలు మీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు కూడా నిర్వహించాలని కోరారు.
కేసీఆర్ రుబాబు పాలన
కేసీఆర్ రుబాబుగా పరిపాలన చేశారని, మీ లెక్క డైవర్షన్ పాలిటిక్స్ చేయలేదని కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలకిచ్చిన హామీలు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. తాను ఎమ్మెల్యేగా గెలిచి ఏడాది గడిచినా పైసా నిధులు ఇవ్వలేదన్నారు. డిపాజిట్ కోల్పోయిన రాజకీయ నాయకుడితో కొబ్బరికాయలు కొట్టిస్తున్నారని, అధికారులు జీ హుజూర్ అంటున్నారని మరి వారిని అసెంబ్లీలో కూర్చో పెడితే సరిపోతుందని విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ మాకు సంస్కారం నేర్పించారని మంచి చేస్తే శభాష్ అంటామని, చెడు చేస్తే విమర్శిస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దుబ్బాకకు సమీకృత హాస్టల్, స్కిల్ యూనివర్సిటీ మంజూరు చేస్తే కృతజ్ఞతలు తెలిపామన్నారు. తాను స్వయం కృషితో ఎదిగానని, పైరవీల కోసం, కాంట్రాక్టుల కోసం, కమీషన్ ల కోసం రాజకీయాల్లోకి రాలేదన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని, కేసీఆర్ సీఎం కావడం ఖాయమని పేర్కొన్నారు.
టాపిక్