




Best Web Hosting Provider In India 2024

గోశాలకు రావాలని టీడీపీ సవాల్… సిద్ధమన్న భూమన, తిరుపతిలో హైటెన్షన్..!
టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎస్వీ గోశాలకు బయలుదేరిన భూమనతో పాటు ఆ పార్టీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేపట్టారు.
టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలకు సంబంధించి ఇటీవలే టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. గత మూడు మాసాలుగా గోశాలలో 100కుపైగా గోమాతలు మృత్యువాత పడ్డాయని.. ఈ విషయాన్ని దాచిపెట్టారని అన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో చర్చనీయాంశంగా మారాయి.
భూమన వ్యాఖ్యలను ఓవైపు తిరుమల తిరుపతి దేవస్థానం తీవ్రంగా ఖండించింది. ఇటీవల గోవులు మృతి చెందాయంటూ కొద్దిమంది సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం వాస్తవం కాదని తెలిపింది. మృతి చెందిన గోవులు ఫొటోలు టీటీడీ గోశాలకు సంబంధించినవి కావని…. దురుద్దేశంతో కొన్ని ఫొటోలను టీటీడీ గోశాలలో మృతి చెందినవిగా చూపించి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చేస్తున్న ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. ఇలాంటి అవాస్తవ ప్రచారాన్ని నమ్మవద్దని కోరింది.
టీడీపీ సవాల్ – సిద్ధమన్న భూమన…
ఇదిలా ఉంటే భూమన వ్యాఖ్యలను అధికార టీడీపీ సీరియస్ గా తీసుకుంది. దమ్ముంటే ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరింది. అసత్య ప్రచారంపై ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో పాటు భూమన గోశాలకు రావాలని తెలిపింది. గోశాలకు వచ్చి పరిస్థితిని నేరుగా చూడాలని ఎక్స్ వేదికగా ఛాలెంజ్ చేసింది.
తెలుగుదేశం పార్టీ చేసిన సవాల్ పై భూమన కరుణాకర్ రెడ్డి కూడా స్పందించారు. గురువారం ఉదయం 10 గంటలకు గోశాలకు వస్తానని… అక్కడే మాట్లాడుదామంటూ కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి నుంచి భూమన ఇంటి వద్ద పోలీసుల భద్రత పెంచారు. ఇవాళ ఉదయం ఆయన్ను ఇంటి నుంచి బయటికి రాకుండా అడ్డుకున్నారు. పోలీసుల తీరును ఖండించిన భూమన…. నేలపై పడుకొని నిరసన వ్యక్తం చేశారు.
ఛాలెంజ్ విసిరిన వాళ్లే భయపడి రాకుండా అడ్డుకోవటమేంటని భూమన ప్రశ్నించారు. గోశాలకు వెళ్లకుండా అడ్డుకోవడం అన్యాయమన్నారు.తెలుగుదేశం పార్టీ నేతలు గోశాల వద్ద ఉన్నప్పుడే నన్ను అనుమతించాలని భూమన డిమాండ్ చేశారు.
ఫేక్ డ్రామాలు కాదు.. గోశాలకు రావాలి – టీడీపీ
ఇక టీడీపీ నేతల వాయిస్ మరోలా ఉంది. టీడీపీ ఛాలెంజ్ కి భూమన పారిపోయాడని విమర్శించారు. ఇంటి ముందు హౌస్ అరెస్ట్ డ్రామాలు ఆడుతూ.. ఫేక్ రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. గోశాలకు వెళ్ళడానికి పోలీసులు భూమనకు అనుమతి ఇచ్చారని చెబుతున్నారు.
వెయ్యి మందితో గోశాలకు వెళ్తాను అంటూ హడావుడి చేస్తున్నాడని… శాంతి భద్రతలు సమస్య సృష్టించే ప్లాన్ చేశారని ఆరోపించారు. గోవులు బెదిరిపోతాయని, లిమిటెడ్ గా వెళ్ళాలని పోలీసులు చెప్తున్నా వినకుండా… హైడ్రామా చేస్తున్నాడని దుయ్యబట్టారు. భూమన… ఫేక్ డ్రామాలు ఆపి, ఇప్పటికైనా గోశాలకు రావాలంటూ సవాల్ విసురుతున్నారు.
సంబంధిత కథనం
టాపిక్