



Best Web Hosting Provider In India 2024

కేటీఆర్ ఇలాకాలో ప్రొటోకాల్ రచ్చ… గంభీరావుపేటలో కాంగ్రెస్ బీఆర్ఎస్ బాహాబాహీ…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రోటోకాల్ వివాదం రచ్చకెక్కింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఘర్షణకు దారి తీసింది. పరస్పరం కొట్టుకున్న నాయకులు ఠాణా మెట్లెక్కి పంతం నెగ్గించుకునే పనిలో నిమగ్నమయ్యారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రోటోకాల్ వివాదం పాలిటిక్స్ ఘర్షణ గా మారింది. గంభీరావుపేట మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రొటో కాల్ వివాదం ఘర్షణకు దారి తీసింది. ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేరు ఎందుకు పెట్టలేదని బిఆర్ఎస్ కార్యకర్తలు అధికారులను నిలదీశారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు అధికారులకు అండగా నిలిచి బిఆర్ఎస్ కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని తోపులాట జరిగింది.
ఒకరిపై మరొకరు చేయి చేసుకునే పరిస్థితి తలెత్తి ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అక్కడే ఉన్న పోలీసులు ఇరు వర్గాలను సముదాయించే ప్రయత్నం చేసిన ప్రయోజనం లేకపోయింది. చివరకు బిఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.
ఠాణా సాక్షిగా ఆందోళనలు…
ప్రోటోకాల్ గురించి అడిగితే కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆరోపించారు. పైగా పోలీసులు తమరినే అరెస్టు చేశారని ఆరోపిస్తు పోలీస్ స్టేషన్ లో బిఆర్ఎస్ శ్రేణులు నిరసన ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో నినాదాలు చేశారు. దాడి చేసిన కాంగ్రెస్ నాయకులపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు సర్ది చెప్పి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో బిఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన విరమించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
అధికార పార్టీనే స్టేషన్ కు పిలుస్తారా?…
బీఆర్ఎస్ ఫిర్యాదుతో విచారణ నిమిత్తం కాంగ్రెస్ నాయకులను పోలీసులు స్టేషన్ ను పిలిచారు. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పోలీస్ స్టేషన్ కు చేరుకొని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులపై కేసులు పెడితే అధికారంలో ఉండి ఏం పీకారని ప్రచారం చేస్తారని తమరిని ఎందుకు స్టేషన్ పిలిచినట్లు అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు కాంగ్రెస్ నాయకులకు సర్ది చెప్పి ధాన్యం కొనుగోలు వద్ద జరిగిన ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఓ వైపు కాంగ్రెస్, మరోవైపు బిఆర్ఎస్ నిరసన ఆందోళనతో గంభీరావుపేట పోలీస్ స్టేషన్ అట్టుడికింది.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)
సంబంధిత కథనం
టాపిక్