




Best Web Hosting Provider In India 2024

‘చంద్రబాబు గారు… మీకు ఏ రకంగా మేయర్ పదవి వస్తుంది..? వైఎస్ జగన్ ప్రశ్నలు
విశాఖ మేయర్ అవిశ్వాస తీర్మానంపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. మేయర్ పదవి నుంచి బీసీ మహిళను దించేయడం కూటమి చేస్తున్న దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష్య సాక్ష్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాఖ మేయర్ సీటును కూటమి కైవసం చేసుకోవటాన్ని వైసీపీ అధినేత జగన్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలిచ్చిన తీర్పును అపహాస్యం చేస్తూ గుండాయిజం చేస్తున్నారని ఆరోపించారు. విశాఖ మేయర్ పదవి నుంచి బీసీ మహిళను దించేయడం.. కూటమి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష్య సాక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
ఇదే సాక్ష్యం – వైఎస్ జగన్
“చంద్రబాబు గారు.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నారు. ప్రజలిచ్చిన తీర్పును అపహాస్యం చేస్తూ, గూండాయిజం చేస్తూ, ప్రలోభాలు, బెదిరింపులకు దిగి విశాఖపట్నం మేయర్గా ఉన్న బీసీ మహిళను పదవినుంచి దించేయడం, మీరు చేస్తున్న దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం” అని జగన్ దుయ్యబట్టారు.
ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం 98 డివిజన్లు ఉన్న విశాఖపట్నం కార్పొరేషన్లో వైసీపీ 58 స్థానాల్లో గెలిచిన విషయాన్ని జగన్ గుర్తు చేశారు. టీడీపీ కేవలం 30 సీట్లు మాత్రమే గెలిచిందన్నారు. అలాంటి మీకు మేయర్ పదవి ఏ రకంగా వస్తుంది…? అని ప్రశ్నించారు.
అధికార దుర్వినియోగం కాదా ఇది…?
“బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ యాదవకులానికి చెందిన మహిళను మేం మేయర్ పదవిలో కూర్చోబెట్టాం. మీరు అధికార దుర్వినియోగం చేస్తూ… కోట్లాది రూపాయలతో ప్రలోభపెట్టారు. పోలీసులను దుర్వినియోగం చేస్తూ, బెదిరిస్తూ, అప్పటికీ లొంగకపోతే మా పార్టీ కార్పొరేటర్లు విడిది చేసిన హోటల్పై మీ నాయకులతో, పోలీసులతోనూ దాడులు చేయించారు. దీనికి సంబంధించిన సీసీ కెమెరా వీడియోలు ఇప్పుడు ప్రజల ముందే ఉన్నాయి. మరి దీన్ని ప్రజాస్వామ్యం అంటారా…? అవిశ్వాస ప్రక్రియ స్వేచ్ఛగా జరిగిందని అనుకోవాలని అంటారా? అధికార దుర్వినియోగం కాదా ఇది…?” అని వైఎస్ జగన్ నిలదీశారు.
“మరో ఏడాది గడిస్తే ఇప్పుడున్న కౌన్సిల్ పదవీకాలం పూర్తవుతుంది. మళ్లీ ఎన్నికలు వస్తాయని తెలిసి కూడా… ప్రజలకు ఫలానా మంచి చేశాను అని చెప్పి ఓట్లు అడిగే ధైర్యం చంద్రబాబు గారూ.. మీకులేదు. అందుకే అన్యాయమైన రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని సమాధి చేస్తున్నారు. మీ అప్రజాస్వామిక విధానాలకు దేవుడు, ప్రజలే గుణపాఠం చెప్తారు” అంటూ జగన్ హితవు పలికారు.
ప్రలోభాలు పెట్టినా, బెదిరింపులకు గురిచేసినా తలొగ్గక పార్టీవైపు, ప్రజలవైపు నిలిచిన పార్టీ కార్పొరేటర్లను అభినందిస్తున్నట్లు జగన్ తెలిపారు.అధికార పార్టీ కుటిల ప్రయత్నాలను దీటుగా ఎదుర్కొని నిలబడుతున్న నాయకులకు, కార్యకర్తలకు మరోసారి హ్యాట్సాప్ చెప్తున్నా అంటూ జగన్ ఓ ప్రకటన విడుదల చేశారు.
సంబంధిత కథనం
టాపిక్