




Best Web Hosting Provider In India 2024

ప్రభుత్వ అవినీతి ప్రజల్లోకి వెళ్లకుండా డైవర్షన్ పాలిటిక్స్, పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు దారుణం- వైఎస్ జగన్
కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని వైసీపీ అధినేత, వైఎస్ జగన్ ఆరోపించారు. ప్రభుత్వ అక్రమాలు, అవినీతి ప్రజల్లోకి వెళ్లకుండా అరెస్టులు, స్కామ్ లు పేరుతో హడావుడి చేస్తున్నారన్నారు. ఐపీఎస్ అధికారి ఆంజనేయులు అరెస్టు దారుణమని మండిపడ్డారు.
రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ నేతృత్వంలో పీఎసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ… అక్రమాలు, అవినీతి ప్రజల్లోకి వెళ్లకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ఐపీఎస్ అధికారి ఆంజనేయులు అరెస్టు దారుణమన్నారు. ఇది కూటమి ప్రభుత్వ కక్ష రాజకీయాలకు పరాకాష్ట అన్నారు.
“పీఏసీ పార్టీలో అత్యున్నతమైనది. ఇందులో తీసుకునే నిర్ణయాలు పార్టీ దిశ, దశను నిర్ణయిస్తాయి. ఈ కమిటీ ప్రతి అంశం మీద పార్టీకి దిశానిర్దేశం చేస్తుంది. వివిధ అంశాల మీద సమగ్రంగా చర్చిస్తూ, పార్టీకి సూచనలు చేస్తుంది. అంతేకాక రాబోయే రోజుల్లో పార్టీ ఏం చేయాలన్న దానిపై కూడా తగిన ఆలోచనలు చేయడంతో పాటు, సలహాలు కూడా ఇస్తుంది. ఇకపై ప్రతినెలా కూడా పీఏసీ సమావేశం అవుతుంది” -వైఎస్ జగన్
యుద్ధ వాతావరణంలో పుట్టిన పార్టీ
వైసీపీని పునర్నిర్మించే కార్యక్రమంలో భాగంగా వివిధ విభాగాలను నిర్మిస్తున్నామని వైఎస్ జగన్ అన్నారు. ఇప్పటికే జిల్లా పార్టీ అధ్యక్షులందర్నీ నియమించామని చెప్పారు. వైసీపీ యుద్ధ వాతావరణంలోనే పుట్టిందని, పార్టీ పుట్టిన తర్వాత పదేళ్లపాటు యుద్ధ వాతావరణంలోనే ఉన్నామన్నారు. రాబోయే రోజుల్లో పార్లమెంటు నియోజకవర్గాలకూ పరిశీలకులను నియమిస్తామని చెప్పారు.
ఆరు నెలల్లో పార్టీ విస్తృత నిర్మాణం
జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గాలకు పరిశీలకులు, పీఏసీ ఏర్పాటు.. ఇలా అన్ని రకాలుగా పార్టీ నిర్మాణం అవుతోందని వైఎస్ జగన్ అన్నారు. అలాగే కింది స్థాయిలో జిల్లా కమిటీలు, నియోజకవర్గాల కమిటీలు, మండల స్థాయి కమిటీలు కూడా దాదాపు ఏర్పాటయ్యాయన్నారు. ఇక గ్రామస్థాయికి కూడా పార్టీ వెళ్లాలని సూచించారు. బూత్ లెవెల్ కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవాలని, వచ్చే ఆరు నెలల్లో మొత్తం నిర్మాణం పూర్తి కావాలన్నారు.
రాష్ట్రంలో భయానక వాతావరణం
“రాష్ట్రంలో ఒక భయాన్ని సృష్టించడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రజా సమస్యలు, అన్యాయాలు, అక్రమాలు, అవినీతి గురించి ప్రజల్లోకి రాకుండా ప్రభుత్వం తాపత్రయ పడుతోంది. సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులును అరెస్టు చేయడం ప్రభుత్వ కక్ష రాజకీయాలకు పరాకాష్టకు నిదర్శనం. ఇదే కేసులో మరో ఇద్దరు పోలీసుల అధికారుల పట్ల ప్రభుత్వం తీరును కోర్టు కూడా తప్పు బట్టింది. మొదటిసారిగా ఇలాంటి దుర్మార్గాలు చూస్తున్నాం.
చరిత్రలో తొలిసారిగా ఒక మనిషిని ఇబ్బంది పెట్టడానికి, ఇరికించడానికి సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. దీని కోసం మనుషులను భయపెడుతున్నారు. వారిని ప్రలోభపెట్టి, భయపెట్టి, తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. వ్యవస్థలన్నీ దిగజారిపోతున్నాయి. ఒక దుర్మార్గపు సంప్రదాయాలకు తెర లేపుతున్నారు. ఈ ప్రభుత్వం ఇలా పోతే రాష్ట్రంలో అరాచకం తప్ప ఏమీ కనిపించదు” –వైఎస్ జగన్
అసలు లిక్కర్ స్కాం ఎవరిది?
“లోక్సభ ఎంపీ మిథున్రెడ్డిని టార్గెట్ చేసి, ఎలాగైనా ఇరికించాలని ప్రయత్నిస్తున్నారు. తన కాలేజీ రోజుల్లో చంద్రబాబును పెద్దిరెడ్డి ఎదిరించారు కాబట్టి.. చంద్రబాబు పెద్దిరెడ్డి కుటుంబంపై కక్ష పెట్టుకున్నాడు. లేని ఆరోపణలు సృష్టించి, తప్పుడు సాక్ష్యాలు పెట్టి వారిని ఇబ్బంది పెడుతున్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్పై సీఐడీ గతంలో కేసు కూడా పెట్టింది. ప్రభుత్వం అన్యాయాలను గట్టిగా ప్రశ్నించాలి.
లిక్కర్ అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా? లేదా అమ్మకాలు పెంచితే లంచాలు ఇస్తారా? మద్యం అమ్మకాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే లంచారు ఇస్తారా? లేక ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే లంచాలు ఇస్తారా? దుకాణాలకు తోడు పర్మిట్ రూములు, బెల్టుషాపులు పెడితే లంచాలు ఇస్తారా? లేక బెల్టు షాపులు తీసేసి, పర్మిట్ రూములు రద్దు చేస్తే లంచాలు ఇస్తారా?” -వైఎస్ జగన్
“2014–19 మధ్య చంద్రబాబు నిర్ణయించిన బేసిక్ రేట్లను పెంచి డిస్టిలరీల నుంచి కొనుగోళ్లు చేస్తే లంచాలు వస్తాయా? లేక పాత రేట్లు కొనసాగిస్తే లంచాలు వస్తాయా? ఇప్పుడున్న డిస్టిలరీల్లో అధిక భాగం అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలు వస్తాయా?
లేక ఏ ఒక్క డిస్టిలరీకీ అనుమతివ్వని వైయస్సార్సీపీ ప్రభుత్వంలో ఉన్నవారికి లంచాలు వస్తాయా?. వైసీపీ హయాంలో తీసుకొచ్చిన లిక్కర్ విధానం ఒక విప్లవాత్మకం. ప్రైవేటు దుకాణాలు తీసేసి, ప్రభుత్వమే నిర్వహించింది. అమ్మకాల వేళల్ని తగ్గించింది. లిక్కర్ టాక్స్ కూడా పెంచాం. దాంతో రేట్లు పెరిగాయి. అమ్మకాలు తగ్గాయి”- వైఎస్ జగన్
డైవర్షన్ పాలిటిక్స్
వైసీపీ మీద బురదజల్లి, డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. ఏదైనా ప్రజలకు సంబంధించిన ముఖ్యమైన సమస్య బయటకు వచ్చిందంటే, వెంటనే చంద్రబాబు డైవర్షన్ చేస్తున్నారన్నారు. ఏమీ లేకపోతే జగన్ మీద ఎవరో ఒకర్ని తీసుకు వచ్చి మాట్లాడిస్తున్నారన్నారు. లేకపోతే ఎవరో ఒకర్ని అరెస్టు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
అన్ని పథకాలకు మంగళం
కూటమి ప్రభుత్వం పథకాలన్నీ రద్దు చేస్తుందని వైఎస్ జగన్ ఆరోపించారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ పూర్తిగా ఎత్తివేశారన్నారు. ఆసుపత్రులకు రూ.3500 కోట్ల బకాయిలు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం లేదన్నారు. గత ఏడాది ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన కింద రూ.3900 కోట్లు బకాయి పెట్టారన్నారు.
భూపందారాలు
“లులూ గ్రూపునకు రూ.1500–2000 కోట్ల విలువైన భూమిని కట్టబెట్టారు. రాజధానిలో నిర్మాణపు పనుల అంచనాలను విపరీతంగా పెంచి దోచేస్తున్నారు. అప్పటి రేట్లతో పోలిస్తే స్టీల్, సిమెంటు రేట్లు పెరిగాయని.. రూ.36 వేల కోట్ల పనులను ఇప్పుడు రూ.77 వేల కోట్లకు పెంచారు. జ్యుడీషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ తీసేశారు. మొబిలైజేషన్ అడ్వాన్స్ విధానం తీసుకొచ్చారు. ఇంత దోపిడీని గతంలో ఎప్పుడూ చూడలేదు” –వైఎస్ జగన్
బటన్లు నొక్కితే దోపిడీకి వీలు కాదని
గతంలో వైసీపీ ప్రభుత్వం చేసినట్టుగా చంద్రబాబు ఎందుకు బటన్లు నొక్కలేదని వైఎస్ జగన్ ప్రశ్నించారు. బటన్లు నొక్కితే చంద్రబాబు లాంటివారికి ఏమీ రాదని, ప్రజల ఖాతాలకే నేరుగా వెళ్తుందన్నారు. అందుకనే చంద్రబాబు బటన్లు నొక్కడం లేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ పెద్దల జేబుల్లోకి ఆదాయాలు వెళ్తున్నాయన్నారు. ‘ఏ రైతుకు గిట్టుబాటు ధర లేదు. పెట్టుబడి సహాయం లేదు. ఉచిత పంటల బీమా లేదు. వ్యవస్థల్లో పారదర్శకత లేదు. దాదాపు 4 లక్షల పెన్షన్లు తగ్గించారు. కొత్తగా ఒక్క పెన్షన్ ఇచ్చింది లేదు’ అని విమర్శించారు.
అధికారంలోకి వస్తాం
“రాష్ట్రంలో ఎక్కడ చూసినా రెడ్ బుక్ పాలనే కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పీఏసీ గణనీయమైన పాత్ర పోషించాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు, నేతలతో ఎప్పటికప్పుడు మమేకం కావాలి. అన్ని జిల్లాల్లో జిల్లా అధ్యక్షులను సమన్వయం చేసుకోవాలి. పార్టీ నిర్మాణంలో భాగస్వామ్యాన్ని అందించాలి. పార్టీ అధికారంలోకి వస్తుంది. మరింతగా ప్రజలకు సేవలందిస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు”-వైఎస్ జగన్
సంబంధిత కథనం
టాపిక్