



Best Web Hosting Provider In India 2024

మే 6 నుంచి తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు – 3 రోజులపాటు పలు సేవలు రద్దు
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్ ఇచ్చింది. మే 6వ తేదీ నుంచి శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు ఉంటాయని తెలిపింది. మొత్తం 3 రోజుల పాటు ఈ వేడుకలు ఉంటాయని పేర్కొంది. ఆయా తేదీల్లో పలు సేవలు రద్దు అవుతాయని వెల్లడించింది.
శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలపై తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటన చేసింది. మే 6 నుంచి 8వ తేదీ వరకు తిరుమలలో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపింది. నారాయణగిరి ఉద్యానవనాల్లోని పరిణయోత్సవ మండపంలో ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
3 రోజులు వాహనసేవలు….
3 రోజుల పాటు జరుగనున్న ఈ వేడుకల్లో తొలిరోజు శ్రీ మలయప్పస్వామివారు గజవాహనం, రెండవరోజు అశ్వవాహనం, చివరిరోజు గరుడవాహనంపై వేంచేపు చేస్తారు. మరోపక్క ఉభయ నాంచారులు ప్రత్యేక పల్లకీలలో పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. ఆ తరువాత కల్యాణమహోత్సవం కన్నుల పండుగగా నిర్వహిస్తారు.
ఆర్జిత సేవలు రద్దు…
శ్రీ పద్మావతి పరిణయోత్సవాల సందర్భంగా పలు సేవలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. మే 6 నుంచి 8వ తేదీ వరకు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసినట్లు వెల్లడించింది.
పౌరాణిక ప్రాశస్త్యం ఏంటంటే..?
పురాణాల ప్రకారం సుమారు ఐదు వేల ఏళ్ల కిందట… అంటే కలియుగం తొలినాళ్లలో సాక్షాత్తు వైకుంఠం నుంచి శ్రీమహావిష్ణువు శ్రీ వేంకటేశ్వరునిగా భూలోకానికి తరలివచ్చారు. ఆ సమయంలో నారాయణవనాన్ని పరిపాలిస్తున్న ఆకాశరాజు తన కుమార్తె అయిన శ్రీ పద్మావతిని శ్రీవేంకటేశ్వరునికిచ్చి వివాహం చేశారు. ఆకాశరాజు వైశాఖశుద్ధ దశమి శుక్రవారం పూర్వ ఫల్గుణి నక్షత్రంలో నారాయణవనంలో కన్యాదానం చేసినట్లుగా శ్రీ వేంకటాచల మహాత్మ్యం గ్రంథం తెలుపుతోంది.
ఆనాటి పద్మావతీ శ్రీనివాసుల కల్యాణోత్సవ ముహూర్తానికి గుర్తుగా ఈ వేడుకలను నిర్వహిస్తారు. ప్రతి వైశాఖ శుద్ధ దశమినాటికి ముందు ఒక రోజు, తరువాత ఒక రోజు కలిపి మొత్తం మూడురోజుల పాటు పద్మావతీ పరిణయోత్సవాన్ని టీటీడీ నిర్వహిస్తోంది. 1992వ సంవత్సరం నుంచి ఈ ఉత్సవం జరుగుతోంది. ఆనాటి నారాయణవనానికి ప్రతీకగా తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీ పద్మావతీ పరిణయ వేడుకలు జరగడం విశేషం.
టాపిక్