



Best Web Hosting Provider In India 2024

కాంగ్రెస్ నాయకుల్లారా.. ఖబడ్దార్..! ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్ట్రాంగ్ వార్నింగ్
కాంగ్రెస్ పార్టీ నాయకులకు బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రజతోత్సవ సభ టీఆర్ఎస్ కా.. లేదా బీఆర్ఎస్ కా అంటూ అవాకులు చవాకులు పేలుతున్నారని, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే గులాబీ చూస్తూ ఊరుకొబోమని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని, ఓర్వలేని కాంగ్రెస్ నేతలు మాట్లాడే మాటలను ప్రజలు క్షమించబోరని ఎమ్మెల్సీ కవిత మండి పడ్డారు. హనుమకొండ జిల్లాలో గురువారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటించారు. ముందుగా ఓరుగల్లుకు చేరుకున్న కవితకు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నేత ఏనుగుల రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో రూపొందించిన రజతోత్సవ సభ పాటను ఆవిష్కరించారు. అనంతరం ఎల్కతుర్తి మండలంలో బీఆర్ఎస్ రజతోత్సవ సంబరాల కోసం చేస్తున్న ఏర్పాట్లను ఎమ్మెల్సీ కవిత పరిశీలించారు.
చేతకాని ప్రభుత్వం
బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన అనంతరం ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీది చేతగాని ప్రభుత్వమని తేటతెల్లమైందని, 16 నెలల పాలనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల కోసం కనీసం 16 పనులు చేయలేదని విమర్శించారు.
‘కాంగ్రెస్ నాయకుల్లారా… ఖబడ్దార్.. మీ మోసపు నైజం ప్రజలకు తెలిసిపోయింది’ అని ధ్వజమెత్తారు. తెలంగాణ బాగుండాలని బీఆర్ఎస్ నాయకులు అనుకుంటారని, కానీ ఓట్లు బాగా రావాలని కోరునేది కాంగ్రెస్, బీజేపీ నాయకులు అని విమర్శించారు. ఆ రెండు పార్టీలు ప్రజల మధ్య చీలిక తీసుకొచ్చి ఓట్లు పొందే ప్రయత్నం చేస్తాయనీ మండిపడ్డారు.
అందుకే బీఆర్ఎస్ గా రూపాంతరం
రజతోత్సవం టీఆర్ఎస్ కా.. బీఆర్ఎస్ క అని అవాకులు చవాకులు పేలుతున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. దేశానికి సేవలు అందించడానికే బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందామన్నారు. పరిణతి చెందడం ప్రకృతి ధర్మమని, టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారిందంటే అది ప్రజల కోరుకున్న రెవల్యూషన్ అని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ నాయకులు అవాకులు చెవాకులు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుబోమని, కాంగ్రెస్ నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అని హెచ్చరించారు. ఓర్వలేని కాంగ్రెస్ నేతలు మాట్లాడే మాటలను ప్రజలు క్షమించబోరని స్పష్టం చేశారు.
ప్రపంచానికి చాటడానికే రజతోత్సవం
తెలంగాణ ప్రజల విజయాన్ని ప్రపంచానికి చాటడానికే బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాటు చేసుకున్నామని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. తెలంగాణ అస్తిత్వం కోసం 2001లో కేసీఆర్ పిడికిలి బిగించి ఉద్యమాన్ని మొదలుపెట్టారని, ఉద్యమం మొదలు పెట్టినప్పుడు ఉత్పన్నమైన అన్ని అనుమానాలను కేసీఆర్ పటాపంచలు చేశారని తెలిపారు.
ఒక రక్తం చుక్క కూడా చిందించకుండా రాష్ట్రం సాధించిన ధీరుడు కేసీఆర్ అని కొనియాడారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా గుండె ధైర్యంతో బీఆర్ఎస్ పార్టీని, తెలంగాణను కాపాడుతూ వచ్చారని అన్నారు.
తెలంగాణ ఉత్తిగనే రాలేదని, కేసీఆర్ మేధస్సును కరిగిస్తే వచ్చిందని స్పష్టం చేశారు. రాజకీయ కుట్రలను చేధించి తెలంగాణ వాదాన్ని ప్రజల్లో నిలబెట్టారని పేర్కొన్నారు.
కుంభమేళా తరహాలోనే..
రజతోత్సవ సభ కుంభమేళ తరహాలో జరుగుతుందని, ఈ సభకు అన్ని వర్గాల ప్రజలు భారీ ఎత్తున తరలిరావాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ నవయువకుల కోసం రజతోత్సవ సభ జరుగుతుందని, సభకు యువత పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. మహిళలకు నెలకు 2500, తులం బంగారం, స్కూటీలు ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని, కాంగ్రెస్ చేతిలో మోసపోయిన ప్రతీ ఒక్కరు సభకు రావాలని ఆహ్వానిస్తున్నానని అన్నారు.
మహిళా సాధికారతకు కేసీఆర్ బాటలు వేశారని, మున్సిపాలిటీలు, మార్కెట్ కమిటీల్లో మహిళలకు రిజర్వేషన్లు కేసీఆర్ కల్పించారని గుర్తు చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ ఆడబిడ్డల కోసం ప్రతీ జిల్లాలో హాస్టల్ తో కూడిన డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేశారని చెప్పారు. మహిళలు భారీ ఎత్తున సభకు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.
కాళేశ్వరం ఎండబెట్టి..
రైతులు గుండెలపై చేయి వేసుకొని పడుకునే పరిస్థితిని కేసీఆర్ సృష్టించారనీ, కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టి లక్షలాది ఎకరాలు ఎండిపోయేలా చేసిందని ఎమ్మెల్సీ కవిత ఆవేదన వ్యక్తం చేశారు. రైతులంతా గులాబీ దండులా రజతోత్సవ సభకు కదలిరావాలని కోరారు.
కాంగ్రెస్ పార్టీ నయవంచన చేయని వర్గమే లేదని, 2004లో తెలంగాణ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని, 1400 మంది బలిదానాలు చేసుకుంటే పదేళ్ల తర్వాత తెలంగాణ ఇచ్చిందనీ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చేతిలో మోసపోయిన ప్రతి ఒక్కరూ సభకు తరలిరావాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)
సంబంధిత కథనం
టాపిక్