Warangal Municipalities: ఓరుగల్లు మున్సిపాలిటీల్లో అవిశ్వాస కలకలం

Best Web Hosting Provider In India 2024

Warangal Municipalities: నర్సంపేట మున్సిపల్​ చైర్​ పర్సన్​ ​ గుంటి రజనీపై అవిశ్వాసం పెట్టేందుకు పలురువు కౌన్సిలర్లు రెడీ అయ్యారు. ఈ మేరకు చైర్​ పర్సన్​ పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు వరంగల్ ఆర్డీవో వాసుచంద్రకు నోటీసు అందజేశారు.దీంతో నర్సంపేట మున్సిపాలిటీలో ఒక్కసారిగా కలకలం మొదలైంది.

ట్రెండింగ్ వార్తలు

కౌన్సిలర్ల తిరుగుబావుటా..

నర్సంపేట మున్సిపాలిటీలో 24 మంది కౌన్సిలర్లు ఉండగా.. 18 మంది బీఆర్ఎస్​ , ఆరుగురు కాంగ్రెస్​ పార్టీకి చెందిన కౌన్సిలర్లు ఉన్నారు. ఇక్కడ మున్సిపల్​ చైర్​ పరన్స్​ గా బీఆర్​ఎస్​ పార్టీకి చెందిన గుంటి రజనీ ఉండగా.. గత కొంతకాల నుంచి ఆమె​తో కౌన్సిలర్లకు సయోధ్య లేకుండా పోయింది.

చైర్​ పర్సన్​ ​ ఏకపక్ష ధోరణి, ఒంటెత్తు పోకడలతో విసుగెత్తిపోయిన బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ కౌన్సిలర్లు కొందరు గత ఏడాది కిందటనే హైదరాబాద్​ లో రహస్యంగా సమావేశం అయ్యారు. ఆ సమయంలో అప్పటి అధికార పార్టీ నేతలు కొందరు కలగజేసుకుని వారికి సర్దిచెప్పారు.

దీంతో అప్పటికప్పుడు అవిశ్వాస గండానికి తెరపడింది. ఆ తరువాత కూడా చైర్​ పర్సన్​​ తీరుమార్చుకోకపోవడంతో కొద్దిరోజులుగా కౌన్సిలర్లంతా గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రెండ్రోజుల కిందట రహస్యంగా సమావేశమై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమయ్యారు.

సొంత పార్టీ కౌన్సిలర్లు కూడా..

మున్సిపల్​ చైర్​ పర్సన్​ ఒంటెత్తు పోకడల వల్ల నర్సంపేట పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కౌన్సిలర్లుగా స్థానిక సమస్యలు పరిష్కరించ లేకపోతున్నామని పేర్కొంటూ దాదాపు 17మంది కౌన్సిలర్లు సంతకాలు చేసిన లేఖతో ఆర్డీవో వాసుచంద్రకు మంగళవారం నోటీసు అందించారు.

తామంతా చైర్​ పర్సన్​ ​ పట్ల విశ్వాసం కోల్పోయామని, వెంటనే అవిశ్వాస తీర్మానం పెట్టాల్సిందిగా ఆర్డీవోకు ప్రతిపాదించారు. ఆర్డీవోకు అవిశ్వాస ప్రతిపాదన పెట్టిన వారిలో బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ పార్టీలకు చెందిన కౌన్సిలర్లు మినుముల రాజు, శ్రీలం రాంబాబు, నాగిశెట్టి పద్మ, బానాల ఇందిర, బోడ గోల్యానాయక్​, రామసహాయం శ్రీదేవి, దేవోజు తిరుమల, గడ్డమీది సునీత, వేల్పుగొండ పద్మ తదితరులున్నారు.

మున్సిపల్​ చైర్​ పర్సన్ ​ గుంటి రజనీని కుర్చీ దించేందుకు రంగం సిద్దం కాగా తిరిగి ఆ పోస్టును దక్కించుకునేందుకు ఇద్దరు మహిళా కౌన్సిలర్​లు పోటీ పడుతున్నట్లు తెలిసింది. కాగా గుంటి రజనీపై సొంత పార్టీకి చెందిన కౌన్సిలర్లు కూడా అవిశ్వాసానికి సిద్ధపడటం, ఆర్డీవోకు నోటీసుపై ఇవ్వడంపై నర్సంపేట పట్టణంలో తీవ్ర చర్చ నడుస్తోంది.

వర్ధన్నపేటలోనూ అదే తంతు

వర్ధన్నపేట మున్సిపల్​ చైర్ పర్సన్​ అంగోతు అరుణపై కూడా అవిశ్వాసానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక్కడ 12 మంది కౌన్సిలర్లు ఉండగా.. అందులో 9 మంది బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒకరు కౌన్సిలర్​ గా కొనసాగుతున్నారు. కాగా కొన్నిరోజులుగా ఓ కౌన్సిలర్​ భర్త చైర్​ పర్సన్​ అరుణపై అవిశ్వాసం పెట్టేందుకు మిగతా కౌన్సిలర్​లతో రహస్యంగా చర్చలు జరుపుతున్నారు.

ఇందుకు 8 మంది కౌన్సిలర్లు మద్దతు తెలిపినట్లు తెలిసింది. మున్సిపాలిటీకి సంబంధించి లెక్కలు సరిగా చెప్పకపోవడం, అవినీతి ఆరోపణలపై ప్రశ్నించినా ఆమె సమాధానం చెప్పడం లేదంటూ కొందరు కౌన్సిలర్లు చెబుతుండగా.. ఆమె ఒంటెత్తు పోకడలు కూడా అవిశ్వాసానికి దారి తీసినట్లు పేర్కొంటున్నారు. అంతేగాకుండా మున్సిపల్​ తీర్మానాల కాపీలు కూడా తమకు ఇవ్వడం లేదని, కొన్ని సందర్భాల్లో తమ అంగీకారం, సంతకాలు లేకుండానే ఏకపక్షంగా తీర్మానాలు చేసిందనే ఆరోపిస్తున్నారు.

దీంతోనే కొద్దిరోజులుగా మున్సిపల్​ చైర్​ పర్సన్ పై కౌన్సిలర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గత మునుగోడు ఉప ఎన్నిక సమయంలోనే ఆమెపై అవిశ్వాసం పెట్టేందుకు పావులు కదపగా.. అప్పటి అధికార బీఆర్​ఎస్​ పార్టీకి చెందిన ఓ నేత అందరికీ సర్దిచెప్పారు. దీంతో కొద్దిరోజుల పాటు అది కాస్త సద్దుమణిగింది.

ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారడం, మెజారిటీ కౌన్సిలర్లు కూడా అరుణను పదవి నుంచి తప్పించేందుకు సిద్ధం కావడంతో రేపోమాపో మున్సిపల్​ చైర్మన్​ పై అవిశ్వాస ప్రతిపాదన అధికారుల వద్దకు చేరనున్నట్లు తెలిసింది. కేవలం ఈ రెండు మున్సిపాలిటీలే కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న తొమ్మిది మున్సిపాలిటీల్లోనూ అవిశ్వాస తీర్మానాలు జరుగుతాయనే ప్రచారం జోరుగా సాగుతుండటం గమనార్హం.

(హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

WhatsApp channel
Source / Credits

Best Web Hosting Provider In India 2024