Best Web Hosting Provider In India 2024

Maoist Party Telangana News:భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) రాష్ట్ర కార్యదర్శి జగన్ లేఖ కలకలం రేపుతోంది. తెలంగాణ రాష్ట్రం లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి చురకలు వేస్తూనే గత బీఆర్ఎస్ పాలకుల రాచరిక, దౌర్భాగ్య పాలనలో జరిగిన తప్పిదాలను ఎత్తి చూపారు.
ట్రెండింగ్ వార్తలు
“కాంగ్రెసు ప్రభుత్వం శ్వేత పత్రమంటూ ప్రకటించింది. స్వేద పత్రమంటూ పదేళ్లు తెలంగాణను భ్రష్టు పట్టించిన బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని నాశనం చేసింది. వాస్తవానికి తెలంగాణ లో అన్నపు రాసులు ఒక చోట – ఆకలి దప్పులు ఒక చోట కేంద్రీకృతమయ్యాయి. ఇక్కడి వనరులను కొల్లగొట్టిన తెలంగాణ గత పాలకులు దొర తనాన్ని పునర్నిర్మించి వ్యవసాయ కులీల, పేదరైతుల, మధ్యతరగతి, ఉద్యోగ కార్మిక వర్గాలను కకావికలం చేశారు. “ఆర్థికం” అంటూ అంకెల గారడీ చూపిన గత పాలకులు తాము తెలంగాణ ఉద్యమ ప్రాంతాల్లో మళ్లీ భూస్వామ్య పెత్తందారీ గడీల నిర్మాణానికి పునాదులు వేశారు. కాళేశ్వరం పేరిట దోపిడీ, మిషన్ భగీరథ పైపుల ద్వారా అవినీతి, మేడిగడ్డ ప్రాజెక్టులో కోట్లాది రూపాయల ప్రజాధన దుర్వినియోగం.. ఇలా అంతటా ప్రజలను వంచించారు. ప్రభుత్వాలిచ్చే శ్వేత పత్రాలు అవినీతి ధనాన్ని గురించి వివరించే అవకాశం లేదు. స్వేద పత్రాలు వాస్తవాలను వెల్లడించవు. అందువల్ల అసలు వాస్తవాలను ప్రజలకు తెలియపరచండి.
కేసీఆర్ ఆస్తుల సంగతేంటి..?
“కేసీఆర్ కు అన్ని ఆస్తు లెక్కడివి? హరీశ్ రావు ఏ శ్రమతో వేల కోట్ల ఆసామి అయ్యాడు? కేటీఆర్, కవిత, సంతోష్ రావుల ఆర్థిక స్థితిగతులపై వాస్తవాలు ఏంటి? కాళేశ్వరం ద్వారా మెగా కృష్ణారెడ్డి కుటుంబం పొందిన పర్సెంటీజీల వివరాలేంటి? సెక్రెటేరియేట్, కలెక్టరేట్లు, స్మృతి చిహ్నం, అంబేద్కర్ విగ్రహం, వరంగల్ హాస్పిటల్ ద్వారా చేతులు మారి కేసీఆర్ కుటుంబానికి చేరిన మొత్తం ఎన్ని లక్షల కోట్లు? ప్రజాకంటక నయీమ్ ముఠా ఎన్ కౌంటర్ అనంతరం జప్తు అయిన నాలుగయిదు వేల కోట్ల నగదు ఎవరికి చేరింది? ఇవన్నీ శ్వేత పత్రాల పరిధికి రావు గదా.? ఈ ప్రజాధనాన్ని తిన్న కేసీఆర్ కుటుంబాన్ని ఏ ప్రజాకోర్టులో పాలకులు శిక్షించగలరు.? కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌజ్, కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌజ్, కవిత మూడుకోట్ల రూపాయల చేతి గడియారం, సంతోష్ రావు గ్రీన్ స్కీము బండారం, పదకొండు వందల కోట్ల వ్యయంతో రూపొందిన వరంగల్ హాస్పిటల్, మూడున్నర వేల కోట్ల వ్యయం పెరిగినా నోరు పెగలని బానిస నాయకులను ఏ ప్రజల్లో నిలదీయాలి.? శ్వేత పత్రాలు బయటపెట్టిన పాలకులు కేసీఆర్ అక్రమ ఆస్తుల శ్వేత పత్రం విడుదల చేసే ధైర్యం చేయగలరా.? ఎన్నెన్ని వేల కోట్లు.? ఎంతెంత అవినీతి.? ప్రజలకందనంత ఎత్తుదిగి కన్ను మిన్నుగానని అహంకారంతో ప్రజా ఆస్తులను కొల్లగొట్టిన కేసీఆర్ కుటుంబాన్ని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టి శిక్షించండి” అంటూ జగన్ తన లేఖ లో పేర్కొన్నారు.
విచారణ కమిటీ ఏర్పాటు చేయాలి..
“ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు ‘కాంగ్రెసు ప్రభుత్వం” ను విచారించాలని డిమాండ్ చేయండి. కేసీఆర్ కుటుంబం అవినీతిపై వెంటనే విచారణ కమిటీని ఏర్పాటుచేయండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యం అమలు చేస్తామని పలుసార్లు ప్రకటించారు. ఆచరణలో ప్రజాస్వామ్యాన్ని అమలు చేయాలి. కాంగ్రెసు ప్రభుత్వం అమలు చేసే విధంగా ప్రజలందరూ డిమాండ్ చేయాలని కోరుతున్నాం. ఈ డిమాండ్స్ ను “ప్రజాపాలన”లో అడగండి, నిలదీయండి. అంటూ భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) రాష్ట్ర కార్యదర్శి జగన్ పేర్కొన్నారు.
రిపోర్టింగ్ – కాపర్తి నరేంద్ర, ఖమ్మం.