Best Web Hosting Provider In India 2024

Natti Kumar About Dil Raju: సంక్రాంతి సినిమాల పట్ల తెలుగు ఫిలిం ఛాంబర్, దాని పెద్దలు ద్వంద వైఖరి అవలంబిస్తున్నారని సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ ఫైర్ అయ్యారు. శుక్రవారం హైదరాబాద్ లోని తన సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. “తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ దిల్ రాజు, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ సునీల్ నారంగ్ వద్దే అన్నీ థియేటర్స్ ఉన్నాయి” అని నట్టి కుమార్ అన్నారు.
ట్రెండింగ్ వార్తలు
“సంక్రాంతి సందర్భంగా విడుదలవుతున్న సినిమాలలో “హనుమాన్” సినిమాను తప్ప మిగతా “గుంటూరు కారం, సైంధవ్, నా సామి రంగా” సినిమాలను వారే పంపిణీ చేస్తూ, వారికి చెందిన థియేటర్స్ లో ప్రదర్శించబోతున్నారు. వాస్తవానికి ఛాంబర్ పెద్దలుగా ఉన్నవాళ్లు తమ స్వార్ధాన్ని పక్కనపెట్టి, అన్నీ సినిమాలకు థియేటర్స్ ను సర్దాల్సిన న్యాయం వారిపైన ఉంటుంది” అని నిర్మాత నట్టి కుమార్ తెలిపారు.
“నిన్నేదో ఓప్పించి “ఈగల్” సినిమాను వెనక్కి వెళ్లెందుకు కృషి చేశాం అన్నారు. కానీ హనుమాన్కు కూడా కావలసిన థియేటర్స్ను వారికివ్వాలి. వాళ్లు మంచి బడ్జెట్తో చేసినట్లు తెలిసింది. ఆ సినిమాకు కూడా క్రేజ్ ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్స్ తమకు సరిగా కేటాయించకపోవడం పట్ల ఆ సినిమా నిర్మాత అవేదన చెందిన విషయం చూశాను. డిస్ట్రిబ్యూటర్స్ను బట్టి కాదు.. సినిమాల క్రేజ్ను బట్టి థియేటర్స్ ఇవ్వాలి” అని నట్టి కుమార్ చెప్పుకొచ్చారు.
“నేను పెద్ద సినిమాలకు వ్యతిరేకిని కాదు. నా దృష్టిలో పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలకు న్యాయం జరగాలని నేనెప్పుడూ కోరుకుంటుంటాను. ఎప్పట్నుంచో నా డిమాండ్ కూడా అదే. చిన్న సినిమాల నిర్మాతలకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సపోర్ట్ చేయాలి. ఈ అన్యాయంపై ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలి. ఇక ఏపీ ప్రభుత్వం సినిమాల టికెట్ రేట్ విషయంలో విభజించు పాలించు అనేలా వ్యవహరిస్తోంది” అని నట్టి కుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
“100 కోట్లు బడ్జెట్ దాటితే టికెట్ రేటు పెంచుతాం అంటారు. గతంలో “బ్రో “, “భగవంత్ కేసరి” సినిమాలకు టికెట్ రేట్ హైక్ ఇవ్వలేదు. కానీ, ఇప్పుడు నా సామిరంగకు టికెట్ రేట్ పెంచమని నిర్మాతలు కోరినట్లు తెలిసింది. వైసీపీ ప్రభుత్వం తమకు ఇష్టమైన వారికి టికెట్ రేటును గైడ్ లైన్స్ చూడకుండా పెంచినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. నాగార్జున సినిమాకు ఎందుకంత బడ్జెట్ అవుతుంది. జగన్, పోసాని కృష్ణమురళిలను అడుగుతున్నా ఇదెక్కడి న్యాయం?” నట్టి కుమార్ ప్రశ్నించారు.
“ప్రజలకు అందుబాటులో ఉండేలా టికెట్ రేటు ఉంచాలని కోరుతున్నాను. దాసరి తర్వాత సినీ పెద్ద చిరంజీవి రెమ్యూనిరేషన్స్పై మాట్లాడాలి. నిర్మాతలు.. ఆర్టిస్టుల డేట్స్ కోసం విపరీతంగా పోటీ పడి కోట్లు కుమ్మరిస్తున్నారు. సినిమాలకు అనవసరంగా బడ్జెట్ పెంచి, దాని భారం ప్రజలపై వేస్తున్నారు. అభిమానులను అడ్డంగా దోచెస్తున్నారు. 30% పర్సెంట్ వెస్టేజ్ అవుతుంది” అని నట్టి కుమార్ వెల్లడించారు.
“జగన్ ది హిట్లర్ పాలన. ప్రజలందరు ఇబ్బందులకు గురవుతున్నారు. వాలంటీర్లు ప్రజల పక్షాన పని చేయాలి. మీకు ప్రజల సొమ్మే జీతాలిస్తున్నారన్న విషయం గుర్తుంచుకోండి. తెలంగాణ ప్రభుత్వానికి నా వినతి ఏమిటంటే.. సినీ కార్మికులకు కేటాయించిన చిత్రపురి కాలనీ మీద విచారణ జరగాలి. చాలామంది నిర్మాతలకు ఎలాంటి ల్యాండ్లు రాలేదు. షర్మీల కాంగ్రెస్లో చేరిన ప్రభావం వైసీపీ పైనే పడుతుంది. వైసీపీ ఓట్లనే కాంగ్రెస్ చీల్చుకుంటుంది. ఏపీ అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్ పాలన రావాల్సిందే” అని నట్టి కుమార్ అన్నారు.