Best Web Hosting Provider In India 2024
యంగ్ యాక్టర్ వికాస్ ముప్పాల హీరోగా నటించిన ప్లాట్ చిత్రానికి ప్రశంసలు వచ్చాయి. గతేడాది నవంబర్లో ఈ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే, ఈ తక్కువ బడ్జెట్ చిత్రం పెద్దగా ప్రజల్లోకి వెళ్లలేకపోయింది. దీంతో ఎక్కువ కలెక్షన్లను దక్కించుకోలేకపోయింది. ఈ మూవీకి భాను భావ తార్కక దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ ప్లాట్ సినిమా ఓటీటీలోకి వస్తోంది.
ఓటీటీ డేట్ ఇదే
ప్లాట్ చిత్రం ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు వస్తోంది. జూలై 11వ తేదీన ఈ మూవీని స్ట్రీమింగ్కు తీసుకురానున్నట్టు ఈటీవీ విన్ వెల్లడించింది. నేడు (జూలై 9) ఈ విషయాన్ని ప్రకటించింది. దీంతో మరో రెండు రోజుల్లోనే ప్లాట్ చిత్రం ఈటీవీ విన్లో స్ట్రీమింగ్కు రానుంది.
ప్లాట్ సినిమా కర్నూలులోని ఎమ్మిగనూర్ బ్లాక్డ్రాప్లో సాగుతుంది. ఈ చిత్రంలో వికాస్ సరసన గాయత్రి గుప్తా హీరోయిన్గా చేశారు. సంజీవ్ పసల, కిశోర్, సంతోష్ నందివాడ కీలకపాత్రలు పోషించారు. దర్శకుడు భాను ఈ మూవీని భిన్నమైన సైకలాజికల్ థ్రిల్లర్గా తెరకెక్కించారు. డిఫరెంట్ స్క్రీన్ప్లేతో మెప్పించారు.
ప్లాట్ చిత్రాన్ని కార్తీక్ సేపురు, భాను భావ తార్కక, తరుణ్ విఘ్నేశ్వర్ సంయుక్తంగా ప్రొడ్యూజ్ చేశారు. ఈ మూవీకి కార్తిక్ రోడ్రిగ్జ్ సంగీతం అందించారు. రామన్ సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి వినయ్ ఎడిటింగ్ చేశారు.
ప్లాట్ మూవీ కథ
ఎమ్మిగనూరులో ప్లాట్ సినిమా కథ నడుస్తుంది. రాహుల్ (వికాస్ ముప్పాల) వ్యాపారంలో విఫలమై ఉంటాడు. అతడి ప్రేయసి, డ్రగ్ డీలర్గా ఉండే దీపు (గాయత్రి).. హైదరాబాద్లో ఓ వ్యక్తిని హత్య చేస్తుంది. దీంతో అతడి సోదరుడు సమీర్.. దీపును వెతుకుతుంటాడు. తన ఇంటికి అమ్మేసి దీపుతో కలిసి విదేశాలకు వెళ్లిపోవాలని రాహుల్ ప్లాన్ చేస్తాడు. ఈ క్రమంలో సమీర్ వారిని కనుగొంటాడు. అప్పుడు వారిద్దరూ కలిసి సమీర్ను చంపేసి.. తాము విక్రయించాలనుకున్న స్థలంతో పాతేస్తారు. అయితే, ఆ తర్వాత రియల్ ఎస్టేట్లో రాహుల్ దశ తిరుగుతుంది. ఓ స్నేహితుడి వల్ల వ్యాపారంలో లాభాలు వస్తాయి. అయితే, అప్పుడు రాహుల్ను ఓ అపరిచిత వ్యక్తి బెదిరిస్తాడు. బ్లాక్మెయిల్ చేస్తూ అతడి వ్యాపారాలను అడ్డుకొంటుంటాడు. ఆ అపరిచిత వ్యక్తి ఎవరు? గతంతో ఆ వ్యక్తికి ఉన్న సంబంధం ఏంటి? రాహుల్ ఈ సమస్య నుంచి బయటపడ్డాడా? అనేదే ప్లాట్ సినిమా కథగా ఉంది.
ప్లాట్ చిత్రంలో నటీనటులు తక్కువగానే ఉన్నా.. వారి పర్ఫార్మెన్స్ మెప్పిస్తుంది. ముఖ్యంగా దర్శకుడు భాను కథనాన్ని నడిపించిన తీరు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్క్రీన్ప్లే, నరేషన్ ఆకట్టుకుంటాయి. సైకలాజికల్ థ్రిల్లర్లను ఇష్టపడే వారికి ప్లాట్ బాగా నచ్చుతుంది. జూలై 11 నుంచి ఈ చిత్రాన్ని ఈటీవీ విన్లో చూడొచ్చు.
కాగా, ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఇటీవలే శశిమథనం వెబ్ సిరీస్ వచ్చింది. ఈ లవ్ కామెడీ డ్రామా సిరీస్లో పవన్ సిద్ధు, సోనియా సింగ్ ప్రధాన పాత్రలు పోషించారు. వినోద్ గాలి దర్శకత్వం వహించారు. గత వారం జూలై 4వ తేదీనే శశిమథనం సిరీస్ స్ట్రీమింగ్ షురూ అయింది.