Best Web Hosting Provider In India 2024
![](https://www.netisamajam.com/wp-content/uploads/2024/07/Gudivada Amarnath (3).jpg)
మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైర్
ఉత్తరాంధ్రపై చంద్రబాబుది చవతి తల్లి ప్రేమ
భోగాపురం ఎయిర్పోర్ట్ అనుమతులు తెచ్చి..పనులు ప్రారంభించింది వైయస్ జగనే
30 రోజుల పాలన.. అప్పుడే ప్రజల్ని మోసం చేయడం మొదలుపెట్టేశారు
అప్పుల మీద ప్రజలను తప్పు తోవ పట్టిస్తున్నారు
విశాఖపట్నం: ఏమి చెయ్యకుండా అన్ని తనే చేసినట్లు చెప్పుకోవడంలో చంద్రబాబు ఆయనకి ఆయనే సాటి.. దేశంలో చంద్రబాబుకి ఉన్న మార్కెటింగ్ స్కిల్స్ ఎవరికి వుండవు అంటూ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. నాలుగు సార్లు సీఎం ఉన్న చంద్రబాబు ఉత్తరాంధ్రకి ఏమి చెయ్యకుండా ఇప్పుడు చవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారంటూ మండిపడ్డారు. శుక్రవారం అమర్నాథ్ మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఇన్నాళ్లు చంద్రబాబు ఒక ప్రాంతానికే పరిమితమై పరిపాలన కొనసాగించారు.భోగాపురం ఎయిర్పోర్ట్కి కావాల్సిన అనుమతులు అన్ని వైయస్ జగన్ తీసుకొచ్చి పనులు మొదలు పెడితే ఇప్పుడు వచ్చి చంద్రబాబే అన్ని తానే చేసినట్లు మాట్లాడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వున్న చంద్రబాబు ఎప్పుడైనా పోర్ట్లు, మెడికల్ కాలేజీలు కట్టించారా?. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తే ఇప్పుడేమో వైయస్ జగన్ ఏమి చెయ్యలేదని చంద్రబాబు చిత్రీకరించారు. మేము మొదలు పెట్టిన పనులు చంద్రబాబు చేస్తున్నట్లు చెప్పుకుంటున్నాడు. ఇంట్లో ఎంతమంది చదివితే అంతమందికి తల్లికి వందనం 15000 ఇస్తామన్న చంద్రబాబు ఇప్పుడేమో ఒకరికే ఇస్తాం అన్నట్లు జీఓ ఇచ్చారు.. ఇసుక ఫ్రీ అన్నారు, డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు… వాలంటీర్లు పరిస్థితి ఏంటో చెప్పాలి అంటూ అమర్నాథ్ డిమాండ్ చేశారు.
చంద్రబాబు అధికారంలోకి వచ్చి 30 రోజులు అయ్యింది. అప్పుడే ప్రజల్ని మోసం చేయడం మొదలుపెట్టేశారు.. గడిచిన నెల రోజుల నుంచి వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు మీద దాడులు చాలా ఆందోళన కలిగిస్తుంది. ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియాపై కూడా దాడుకు దిగడం చాలా దారుణమంటూ అమర్నాథ్ ధ్వజమెత్తారు.
భోగాపురం ఎయిర్ పోర్ట్కు సంబంధించిన భూసేకరణ వైయస్ఆర్సీపీ హయాంలో జరిగింది. ఏమీ చేయకపోయన అన్ని నేనే చేశానని చంద్రబాబు చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసింది. భోగాపురం ఎయిర్ పోర్ట్ భూములకు సంబంధించిన కేసులను పరిష్కరించాము. రెండు గ్రామాలకు 80 కోట్ల రూపాయల పరిహారం ఇచ్చాము. కేంద్ర సంస్థల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకున్నాము.. మేము చేసిన కార్యక్రమాలను వారే చేసినట్లు చెప్పుకుంటున్నారు. భోగాపురం ఎయిర్ పోర్టుకు ఉన్న భూ సమస్యలు సహా అన్ని పరిష్కరించి వైయస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో పనులు ప్రారంభం అయ్యాయి.. భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులు ప్రారంభించేనాటికి ప్రభుత్వం దగ్గర 377 ఎకరాల భూమి మాత్రమే ఉంది.. పరిహారం, కోర్టు కేసులు ఎదుర్కొని ముందుకు వెళ్లామని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. ములపేట పోర్ట్ పనులు దాదాపు 45 శాతం పూర్తయ్యాయని గుడివాడ అమర్నాథ్ వివరించారు.
బీపీసీఎల్ అధికారులు వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పరిశీలనకు వచ్చారు. చంద్రబాబు సీఎం అయ్యాక బీపీసీఎల్ వచ్చినట్లు చెపుతున్నారు. మార్కెటింగ్ చేసుకోవడంలో చంద్రబాబును మించిన వారు మరొకరు లేరు. ఎన్నికల ముందు చంద్రబాబు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి రూ.15000 చొప్పున ఇస్తామని చెప్పారు. జీవో నెంబర్ 29లో పిల్లలను బడికి పంపే తల్లికి రూ.15000 వేలు ఇస్తామని చెప్పారు. దీనిపై తల్లుల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. చంద్రబాబు దీనిపై ఎందుకు ప్రకటన చేయలేదు.. ఉచిత ఇసుక అని చెప్పి అమ్ముకుంటున్నారు. అప్పుల మీద ప్రజలను తప్పు తోవ పట్టిస్తున్నారు. టీడీపీ హయాంలో కంటే వైయస్ఆర్సీపీ హయాంలో అప్పు తక్కువని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారని గుడివాడ అమర్నాథ్ గుర్తు చేశారు.
ఈ ప్రభుత్వ ఉడత బెదిరింపులకు మా కార్యకర్తలు కూడా భయపడరు అని గుడివాడ అమర్నాథ్ అన్నారు. వైయస్ఆర్సీపీపై ఎన్ని కుట్రలు చేసిన భయపడేది లేదని తెలిపారు. ప్రజలకు మంచి చేయాలనే కోరిక ఉండాలి.. కానీ, ఇలా ఇబ్బంది పెట్టొద్దని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ది కోసం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎనలేని కృషి చేశారని మాజీ మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు.