Bihar bridge in field : ఇలాంటివి బిహార్​లోనే జరుగుతాయి- పొలం మధ్యలో బ్రిడ్జ్​! రూ. 3 కోట్ల ఖర్చు..

Best Web Hosting Provider In India 2024


చిత్ర విచిత్ర ఘటనలకు బిహార్​ రాష్ట్రం కేరాఫ్​ అడ్రెస్​గా మారింది! నిన్న, మొన్నటి వరకు బ్రిడ్జ్​లు కూలిపోతున్న ఘటనలతో బిహార్​ వార్తల్లో నిలిచింది. ఇక ఇప్పుడు, అసలు రోడ్డే లేని ప్రాంతంలో బిహార్​ అధికారులు ఒక వంతెన కట్టారు. పొలం మధ్యలో బ్రిడ్జ్​ని కట్టేందుకు అయిన ఖర్చు ఏకంగా రూ. 3కోట్లు అని సమాచారం. పొలం మధ్యలో నిర్మించిన బ్రిడ్జ్​కి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. అసలు కథ ఏంటంటే..

పొలం మధ్యలో బ్రిడ్జ్​- అసలు కథ ఏంటంటే..

బిహార్​ అరారియా జిల్లాలో ఈ ఘటన జరిగింది. పచ్చటి పొలాల మధ్యలో అధికారులు ఒక చిన్న వంతెనను నిర్మించారు. ఈ ఫొటోలు వైరల్​గా మారాయి. అసలు అక్కడ బ్రిడ్జ్​ కట్టాల్సిన అవసరం ఏముందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

‘ప్రకృతి అందాలను పాడుచేయడానికి తప్ప ఈ బ్రిడ్జ్​ దేనికీ పనికిరాదు,’ అని స్థానికులు అంటున్నారు.

“పరమానంద్​పూర్​ గ్రామంలో 6 నెలల ముందు పొలంలో బ్రిడ్జ్​ని నిర్మించారు. కానీ రోడ్డు వేయలేదు. పొలం మధ్యలో అదొక్కటే ఉండిపోయింది,” అని గ్రామస్థులు అంటున్నారు. వాస్తవానికి తమ గ్రామంలో రోడ్డు లేదని, పొలం మధ్యలో నుంచి రోడ్డు వేయడనికి ఆ బ్రిడ్జ్​ కట్టి ఉంటారేమో అని గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు.

అయితే.. బిహార్​ పొలంలో బ్రిడ్జ్​పై అధికారులు కొన్ని విషయాలను వెల్లడించారు. 3.2 కి.మీల రోడ్డు వేయాల్సి ఉందని, పొలం మధ్యలో కనిపిస్తున్న బ్రిడ్జ్​ కూడా అందులో భాగమని అంటున్నారు. మరోవైపు అసలు అది పూర్తిస్థాయి బ్రిడ్జే కాదని, కల్వర్ట్​ అని అసిస్టెంట్​ ఇంజినీర్​ మనోజ్​ కుమార్​ చెబుతున్నారు.

“పొలం మధ్యలో ఉన్నది వంతెన కాదు. ఒక బాక్స్​ కల్వర్ట్​. కింద నీటి ప్రవాహాన్ని మెయిన్​టైన్​ చేసేందుకు దానిని ఉపయోగిస్తారు. ముఖ్యమంత్రి గ్రామీణ సడక్​ యోజన కింద దీనిని నిర్మించారు. పరమానంద్​పూర్​ నుంచి కొపరి సరిహద్దు వరకు ప్రతిపాదిత 3.2 కి.మీల రోడ్డులో భాగంగా దీనిని నిర్మించారు. గ్రామస్థులు కాంట్రాక్టర్​ని డబ్బులు అడిగారు. అతను ఇవ్వను అన్నాడు అందుకే ఫొటోలను మార్ఫ్​ చేసి సోషల్​ మీడియాలో పెట్టారు,” అని అసిస్టెంట్​ ఇంజినీర్​ మనోజ్​ కుమార్​ తెలిపారు.

ఈ బాక్స్​ కల్వర్ట్​తో రెండు గ్రామాలకు చెందిన 1,500మందికి ప్రయోజనం కలిగిస్తుందని మనోజ్​ అన్నారు. అయితే ప్రతిపాదిత రోడ్డులో 200 మీటర్లు ప్రైవేటు భూమి ఉందని, అందుకే బాక్స్​ కల్వర్ట్​ సమస్య వచ్చిందని అన్నారు. సమస్య పరిష్కారమైన తర్వాత దానిని రోడ్డుకు కనెక్ట్​ చేస్తారని తెలిపారు. ఇందులో ఎలాంటి అవినీతి కోణం లేదని, నిబంధనలకు తగ్గట్టే బ్రిడ్జ్​ని నిర్మించినట్టు వెల్లడించారు.

పొలం మధ్యలో బ్రిడ్జ్​ ఘటనపై అరారియా జిల్లా మెడిస్ట్రేట్​ ఇనాయత్​ ఖాన్​ విచారణకు ఆదేశించారు. రోడ్డు నిర్మాణం కోసం నిపుణుల బృందం సంబంధిత ప్రాంతంలో పర్యటిస్తోందని, ఏదైనా అవకతవకలు జరిగితే చెబుతుందని, అనంతరం సదరు అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

బిహార్​ పొలం మధ్యలో వంతెన నిర్మాణంపై మీ ఒపీనియన్​ ఏంటి?

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024



Source link