AP Ration Shops : ఏపీలో భారీగా రేషన్ షాపుల పెంపు..! త్వరలోనే డీలర్ల నియామకాలు

Best Web Hosting Provider In India 2024


కొత్త రేషన్ కార్డుల జారీకి ఆంధ్రప్రదేశ్ లో రంగం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన డిజైన్లను పౌరసరఫరాల శాఖ పరిశీలించే పనిలో పడింది. త్వరలోనే ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసే అవకాశం ఉంది. ముందుగా కొత్తగా పెళ్లైన వారికి త్వరితగతిన కార్డులను పంపిణీ చేస్తారని సమాచారం. ఇదిలా ఉంటే… రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పంపిణీ కేంద్రాలను పెంచాలని సర్కార్ నిర్ణయించింది.  రేషన్ పంపిణీ మరింత సజావుగా సాగడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 29 వేలకుపైగా రేషన్ దుకాణాలు ఉండగా…. కొత్తగా మరో  4 వేల కేంద్రాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సిద్ధమైంది.   నిర్దేశిత సమయంలో లబ్ధిదారుడికి రేషన్ అందించటమే లక్ష్యంగా ముందుకు సాగాలని నిర్ణయించింది. ఎక్కువ రేషన్ కార్డులు ఏ పరిధిలో ఉంటే అక్కడ ఈ కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దీనిపై పౌరసరఫరాల నుంచి ప్రకటన వస్తుంది.

ప్రస్తుతం ఉన్న రేషన్ దుకాణాల్లో కొన్నింటికి   ఇన్‌ఛార్డ్ డీలర్లు ఉన్నారు. అయితే ఇలాంటి పరిస్థితులు ఎక్కడైతే ఉన్నాయో… వాటిని గుర్తించాలని సర్కార్ నిర్ణయించింది. త్వరితగతిన ఆయా ఖాళీలను కూడా భర్తీ చేసే చర్యలను ప్రారంభించనుంది. ప్రాథమిక వివరాల ప్రకారం…  6 వేలకుపైగా డీలర్ల ఖాళీలు ఉన్నట్లు గుర్తించారు.

త్వరలోనే డిజైన్లు ఖరారు…!

కొత్త రేషన్ కార్డుల డిజైన్లను పరిశీలిస్తున్న పౌరసరఫరాల శాఖ…త్వరలోనే తుది డిజైన్ ను ఖరారు చేయనుంది. ఆ వెంటనే కార్డుల జారీ కోసం ప్రకటన వెలువడనుంది. అయితే ఇకపై రేషన్ కార్డు తీసుకోవాలనుకునే కొత్త జంట.. తప్పనిసరిగా మ్యారేజీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ను సమర్పించాల్సి ఉంటుంది. ఇటీవలే ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా రేషన్ కార్డుల జారీపై కీలక ప్రకటన చేశారు. కొత్త కార్డులను డిజైన్ చేసే పనిలోనే ఉన్నామని చెప్పారు.

కొత్తగా వివాహమైన జంటలు కొత్త రేషన్ కార్డు కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారని…. ఇలాంటి సమస్యలను పరిష్కరించే దిశగా నిర్ణయం తీసుకోబోతున్నామని నాదెండ్ల తెలిపారు. వివాహం చేసుకొని రేషన్ కార్డులో పేర్లు లేనివారిని గుర్తించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఓ కార్యక్రమాన్ని చేపడుతామనిపేర్కొన్నారు. కొత్త రేషన్ కార్డులను తప్పకుండా జారీ చేస్తామని స్పష్టం చేశారు. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియలో భాగంగా ముందుగా ఎవరైతే వివాహం చేసుకుని పేర్లు నమోదు చేసుకోలేదో వారిని గుర్తిస్తామని మంత్రి నాదెండ్ల క్లారిటీ ఇచ్చారు. మొత్తంగా చూస్తే త్వరలోనే ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ పట్టాలెక్కే అవకాశం ఉంది.

తెలంగాణలోనూ కొత్త రేషన్ కార్డులు – అర్హతలివే

మరోవైపు రేషన్ కార్డులపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్తవి జారీ చేయాలని ఇటీవలే కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, మాగాణి 3.5 ఎకరాలు, చెలక 7.5 ఎకరాల లోపు భూమి ఉన్న వారికి, పట్టణ ప్రాంతాల్లో వార్షికాదాయం రూ.2 లక్షలు ఉన్న కుటుంబాలను తెల్ల రేషన్ కార్డులకు అర్హులుగా గుర్తించాలని కేబినెట్ సబ్ కమిటీ ప్రతిపాదించింది.

అలాగే రెండు రాష్ట్రాల్లో కార్డులున్న వారికి ఆప్షన్ ఇవ్వాలని నిర్ణయించింది. తెల్ల రేషన్‌ కార్డుల పంపిణీ విధివిధానాలపై మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, దామోదర రాజనర్సింహా, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కూడిన కేబినెట్ సబ్ కమిటీ చర్చించింది.

రేషన్ కార్డులు జారీపై అన్ని పార్టీలు, ఎమ్మెల్యేలు, ఎంపీల సలహాలు తీసుకోవాలని కేబినెట్ ఉపసంఘం నిర్ణయించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలకు లేఖలు రాసి వారి సూచనలు తీసుకోవాలని యోచిస్తోంది. కేబినెట్ సబ్ కమిటీ భేటీ అనంతరం మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. సక్సేనా కమిటీ సిఫార్సులను తెల్ల రేషన్‌ కార్డుల జారీలో పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ప్రస్తుతం తెలంగాణలో 89.96 లక్షల తెల్ల రేషన్‌ కార్డులున్నాయన్నారు. 10 లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని ఆ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు.

 

టాపిక్

Ration CardsAndhra Pradesh NewsTrending Ap

Source / Credits

Best Web Hosting Provider In India 2024