కోల్‌కతా హత్యాచార నిందితుడికి చేసే పాలిగ్రాఫ్ టెస్ట్ ఏంటి? కోర్టులు సాక్ష్యంగా తీసుకుంటాయా?

Best Web Hosting Provider In India 2024


కోల్‌కతాలో వైద్యురాలి మీద హత్యాచారంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజలు. మరోవైపు ఈ ఘటనలో ఉన్నది ఒక్కరు కాదు.. మరికొంతమంది అని వాదనలు ఉన్నాయి. ఇప్పటికే నిందితుడు సంజయ్ రాయ్‌ని అరెస్ట్ చేశారు. ఈ కేసును సీబీఐ ఎంక్వైరీ చేస్తోంది. నిందితుడికి పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించడానికి అనుమతి తీసుకుంది. ఇంతకీ పాలిగ్రాఫ్ పరీక్ష అంటే ఏమిటి? దర్యాప్తులో ఎలా సహాయపడతాయి? అవి కోర్టులో అనుమతించబడతాయా?

పాలిగ్రాఫ్ టెస్ట్ అంటే

పాలిగ్రాఫ్ పరీక్ష కొన్నిసార్లు లై డిటెక్టర్ పరీక్ష అని పిలుస్తారు. ఇది రక్తపోటు, పల్స్, శ్వాసక్రియ, వ్యక్తి భావోద్వేగాలను అంచనా వేసి రికార్డ్ చేస్తుంది. పాలిగ్రాఫ్ పరీక్షలో ఒక వ్యక్తి అబద్ధం చెప్పినప్పుడు హృదయ స్పందన, శ్వాస, చెమట వంటి శారీరక ప్రతిస్పందనలలో మార్పులను గుర్తిస్తుంది. మరో మాటలో చెప్పాలంటే మోసపూరిత సమాధానాలు చెబితే దొరికే అవకాశం ఉంటుంది.

ఈ శారీరక ప్రతిస్పందనలను కార్డియో-కఫ్స్ లేదా వ్యక్తికి పెట్టిన సున్నితమైన ఎలక్ట్రోడ్‌లు వంటి పరికరాల ద్వారా కొలవవచ్చు. రక్తపోటు, పల్స్, రక్త ప్రవాహం వంటివాటిని ప్రశ్నలు వేసినప్పుడు కొలుస్తారు. శ్వాసక్రియ రేటు, శ్వాస లోతును వ్యక్తి ఛాతీ చుట్టూ చుట్టిన న్యుమోగ్రాఫ్‌ల ద్వారా కొలుస్తారు. రక్తపోటు కఫ్ ద్వారా హృదయనాళ కార్యకలాపాలు అంచనా వేస్తారు. పరీక్షించే వ్యక్తి చేతివేళ్లకు పెట్టే ఎలక్ట్రోడ్ ద్వారా కూడా అంచనా వేస్తారు. వ్యక్తి నిజం చెబుతున్నాడా? మోసం చేస్తున్నాడా? లేదా అని నిర్ణయించడానికి ప్రతి ప్రతిస్పందనకు నెంబర్ వాల్యూ కేటాయిస్తారు.

పాలిగ్రాఫ్ పరీక్షలు కచ్చితమైనవా?

పాలిగ్రాఫ్ పరీక్షలు శాస్త్రీయంగా 100 శాతం కచ్చితమైనవని నిరూపించబడలేదు. ఏదేమైనా అనేక దేశాలలో పాలిగ్రాఫ్‌లను అనుమానితుల విచారణ సాధనంగా ఉపయోగిస్తారు. ఇటీవలి కాలంలో దర్యాప్తు సంస్థలు నిందితులపై ఈ పరీక్షలను ఉపయోగించడానికి కోర్టుల నుండి అనుమతి కోరుతున్నాయి. అవి కొన్నిసార్లు నిజాన్ని వెలికి తీయడానికి సరైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తాయి.

2000 సంవత్సరంలో అనుమానితులకు పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలను ఎన్‌హెచ్‌ఆర్‌సీ విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం.. నిందితుల సమ్మతితో పాలిగ్రఫీ పరీక్ష నిర్వహించాలి. నిందితులు ఇచ్చిన సమ్మతిని జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు నమోదు చేయాలి. ఈ విషయంపై విచారణలో ఉన్న నిందితుడికి కూడా పరిజ్ఞానం ఉండాలి. పాలిగ్రఫీ పరీక్షలో తాను మాట్లాడిన మాటలు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలాలు మాత్రమేనని, ఘటనను ఒప్పుకోవడం కాదని స్పష్టంగా తెలుసుకోవాలి అని పేర్కొంది.

కోర్టులు సాక్ష్యంగా ఆమోదిస్తాయా?

పాలిగ్రాఫ్ పరీక్షల ఫలితాలు కోర్టులో సాక్ష్యంగా అనుమతించబడవు. సెల్వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక (2010) కేసులో ఇటువంటి పరీక్షలు రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తున్నాయని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. పాలిగ్రఫీ పరీక్షలు నిందితుడి నుండి సమాచారాన్ని సేకరించే ప్రక్రియగా ఉపయోగపడుతుంది. ఇది అతనికి వ్యతిరేకంగా ఉండవచ్చు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21(3) ప్రకారం ఒక వ్యక్తి తనకు వ్యతిరేకంగా సాక్షిగా ఉండకూడదు. అందువల్ల పాలిగ్రఫీ పరీక్ష ఫలితాలు ఈ చట్టానికి విరుద్ధంగా ఉన్నాయి. దీన్ని కోర్టులో సాక్ష్యంగా తీసుకోలేరు.

సెల్వీ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక (2010) కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం.. స్వచ్ఛందంగా తీసుకున్న పాలిగ్రఫీ పరీక్ష సహాయంతో ఆ తర్వాత కనుగొన్న ఏదైనా సమాచారం లేదా మెటీరియల్‌ను సాక్ష్యాలుగా అంగీకరించవచ్చు. అందువల్ల, పరీక్ష సమయంలో నిందితులు వెల్లడించిన ప్రదేశంలో స్వాధీనం చేసుకున్న ఏదైనా హత్య ఆయుధం, సాక్ష్యాలను వాంగ్మూలంగా కాకుండా సాక్ష్యంగా ఉపయోగించవచ్చు.

Best Web Hosting Provider In India 2024



Source link