Best Web Hosting Provider In India 2024
విజయనగరం : మే నెల 3 వ తేదీన భోగాపురం ఎయిర్ పోర్టుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారని, అందుకు అవసరమగు ఏర్పాట్లను చురుగ్గా చేపట్టాలని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులకు ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో బుధవారం మంత్రి బొత్స సత్యనారాయణ, పరిశ్రమలు, మౌలిక వసతుల ప్రత్యెక ప్రధాన కార్యదర్శి కరికాల వలెవన్, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు, శాసన సభ్యులు బడ్డుకొండ అప్పల నాయుడు , ఎం. పి బెల్లాన చంద్ర శేఖర్, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్.పి దీపికా పాటిల్ తో కలసి ఏర్పాట్ల పై సమీక్షించారు. ఎయిర్ పోర్టుతో పాటు చింతపల్లి వద్ద ఫ్లోటింగ్ జట్టి కు కూడా శంకు స్థాపన చేస్తారని తెలిపారు. శంకుస్థాపన అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మాట్లాడతారని అందుకు అనువైన వేదికను రెండు రోజుల్లో గుర్తించాలని జిల్లా పరిషత్ చైర్మన్కు, శాసన సభ్యులకు సూచించారు. శంకు స్థాపనకు అవసరమగు శిలాఫలకం ఏర్పాటుకు, వాహనాల పార్కింగ్ కు అనువైన స్థలాన్ని గుర్తించి ఏర్పాట్లను గావించాలన్నారు. వి.ఐ.పి ల వాహనాలకు, అధికారులకు, సాధారణ ప్రజలకు బహిరంగ సమావేశానికి వేర్వేరు రూట్లు ఉండే స్థలాన్ని గుర్తించాలన్నారు. వాహనాలకు, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ లో ఉండేలా చూడాలని, బందోబస్తు ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్సీకి సూచించారు. శంకు స్థాపన జరిగే నాటికి ఆర్ అండ్ ఆర్ లో ఎలాంటి పెండింగ్ లేకుండా చూడాలని జే.సి. మయూర్ అశోక్ కు సూచించారు. అందరికీ గృహాలు, అన్ని సౌకర్యాలతో ఉండేలా చూడాలని ఆర్.డి.ఓ సూర్య కళ కు ఆదేశించారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద మంత్రి మాట్లాడుతూ.. జూన్ నెల లో సాలూరులో గిరిజన విశ్వ విద్యాలయానికి కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుందని తెలిపారు.