Best Web Hosting Provider In India 2024
వాతావరణ శాఖ ఏపీకి వర్ష సూచన చేసింది. నైరుతి రుతుపవనాల తిరోగమనం, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశంతో రాగల 24 గంటల్లో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దేశ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు తిరోగమిస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, ఒడిశా, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్,నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మహారాష్ట్ర, ఉత్తర బంగాళాఖాతంలో తదుపరి 2 రోజులలో నైరుతి రుతుపవనాలు క్రమంగా వైదొలుగుతున్నాయని పేర్కొంది. మరో రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు బలహీనపడే పరిస్థితులు ఉన్నాయని తెలిపింది.
నైరుతి బంగాళాఖాతంలో కొనసాగిన ఉపరితల ఆవర్తనం…ఇవాళ తమిళనాడుపై సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో విస్తరించి ఉందని తెలిపింది. దక్షిణ భారతదేశ ద్వీపకల్పం మీదుగా తూర్పు, ఈశాన్య గాలులు వీచే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో దక్షిణ రాష్ట్రాలతో పాటు మధ్య బంగాళాఖాతంలో వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపింది.
అక్టోబర్ 14న అల్పపీడనం
నైరుతి బంగాళాఖాతంలో శనివారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం….అక్టోబరు 14 నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. మరో 48 గంటల్లో ఉపరితల ఆవర్తనం మరింతగా బలపడే సూచనలు ఉన్నాయని ప్రకటించింది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఏపీ తీరాల వైపు ఈ ఆవర్తనం కదిలే అవకాశం ఉందంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. పలు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
బలమైన మేఘాలు అల్పపీడనం ఉత్తర భాగంలో ఉన్న ప్రాంతంలో మొదలవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. దీని వలన రేపు(సోమవారం) ఉదయం తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నెల్లూరు, కావలి, తడ, సూళ్లూరుపేట, సత్యవేడు, నాయుడుపేట, శ్రీకాళహస్తి డివిజన్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తిరుపతి నగరంలో మోస్తరు వర్షాలు, అప్పుడప్పుడు భారీ వర్షాలను కురిసే అవకాశం ఉంది. ప్రకాశం జిల్లాతో పాటుగా చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో మోస్తరు వర్షాలను పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
సంబంధిత కథనం
టాపిక్