Best Web Hosting Provider In India 2024
ఏపీలో ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ దాడి ఘటన సంచలనం సృష్టించింది. తీవ్రంగా గాయపడిన విద్యార్థిని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. దీంతో విద్యార్థిని కుటుంబం శోకసద్రంలో మునిగిపోయింది. మరోవైపు ఘటనకు బాధ్యుడైన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఏం జరిగిందంటే…?
ఇంటర్ విద్యార్థిపై విగ్నేష్ అనే యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ దాడిలో విద్యార్థిని తీవ్రంగా గాయపడింది. బద్వేలు సమీపంలోని సెంచరీ ఫ్లైవుడ్ వద్ద ఈ ఘటన జరిగింది. విద్యార్థినిని బలవంతంగా రోడ్డు పక్కనే చెట్లలోకి తీసుకెళ్లి విగ్నేష్ అనే యువకుడు పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు.
మంటలు వ్యాపించి, విద్యార్థిని తీవ్రంగా గాయపడింది. స్థానికులు యువతిని గుర్తించి కడప రిమ్స్కు తరలించారు. ఈ ఘటనపై బద్వేలు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యార్థిని చికిత్స పొందుతూ మృతి చెందింది.
ఇక అంతకముందు ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. అధికారులతో మాట్లాడారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వెంటనే నిందితుడిని అరెస్టు చేయాలని ఆదేశించారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి నిందితుడి ఆచూకీని కనుకొని.. అరెస్ట్ చేశారు.
కర్నూలులో దారుణం:
కర్నూలు జిల్లాలో మరో ఘోరం వెలుగు చూసింది. ఇంటర్ విద్యార్థిని నోట్లో పురుగుల మందు పోసి హత్యకు పాల్పడ్డాడు ఓ ప్రేమోన్మాది. ఆ విద్యార్థిని ఇంట్లోకి చొరబడి ఆ ఘాతుకానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులు పొలం పనులు ముగించుకుని వచ్చేసరికి విద్యార్థిని అపస్మారక స్థితిలో పడింది. బాలికను హుటాహుటినా ఆసుపత్రికి తరలించగా ఆమె అప్పటికే మరణించినట్లు పోలీసులు నిర్దారించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
కర్నూలు జిల్లా ఆస్పరి మండలం పరిధిలోని ఓ గ్రామంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ గ్రామానికి చెందిన ఒక కుటుంబంలో ఒక్కగానికి ఒక్క కుమార్తె పత్తికొండ మోడల్ స్కూల్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. దసరా సెలవులకు ఇంటికి వచ్చిన విద్యార్థినిని ఆ గ్రామానికి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థి సన్నీ ప్రేమ పేరుతో వేధించారు. సన్నీ ప్రేమను ఆమె నిరాకరించింది. తాను ప్రేమించలేనని, చదువుకోవాలని స్పష్టం చేసింది.
దీంతో కోపంతో రగిలిపోతున్న సన్నీ అదును చూసి విద్యార్థినిపై దారుణానికి పాల్పడ్డాడు. శుక్రవారం ఆ విద్యార్థిని తల్లిదండ్రులు పొలం పనులు వెళ్లడం తెలుసుకుని.,, ఇంట్లో విద్యార్థిని ఒంటరిగా ఉందని నిర్థారించుకున్నాడు. సన్నీ ఆమె ఇంట్లోకి ప్రవేశించి తనను ప్రేమించాలని, ప్రేమించకపోతే చంపేస్తానని వెంట తెచ్చుకున్న పురుగుల మందు డబ్బాతో బెదిరించాడు.
అప్పటికీ బాలిక ఆ ప్రేమోన్మాది మాట లెక్కచేయకపోవడంతో ఆమె నోట్లో బలవంతంగా పురుగుల మందు పోసి అక్కడి నుంచి పరారయ్యాడు. కొద్దిసేపటికి విద్యార్థిని తల్లిదండ్రులు పొలం పనులు ముగించుకుని ఇంటికి వచ్చి చూసేసరికి కుమార్తె చావు బతుకుల్లో అపస్మారక స్థితిలో పడిఉంది. కొద్దిగా తెలివి ఉండటంతో బాలిక తల్లిదండ్రులకు కొన్ని విషయాలు చెప్పింది. తనకు సన్నీ అనే వాడు బలవంతంగా పురుగు మందు తాగించాడని చెప్పింది. వెంటనే తల్లిదండ్రులు విద్యార్థిని అదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా…అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
టాపిక్