Best Web Hosting Provider In India 2024
పార్టీ శ్రేణులకు వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపు
చెల్లిపై ప్రేమతోనే సొంత ఆస్తుల్లోనూ వాటా ఇవ్వాలనుకున్న వైయస్ జగన్
గిఫ్ట్ డీడ్ను షర్మిల దుర్వినియోగం చేశారు
హైకోర్టు స్టేటస్కో ఉన్నా షర్మిల షేర్లు మార్చుకున్నారు
తాడేపల్లి: రక్తం పంచుకు పుట్టిన చెల్లి షర్మిలపై ప్రేమాభిమానాలతోనే సొంత ఆస్తుల్లోనూ వైయస్ఆర్సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి వాటా ఇస్తామన్నారని, కానీ గిఫ్ట్ డీడ్ను షర్మిల దుర్వినియోగం చేసి, తల్లి పేరిట షేర్లుగా మార్చారని వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఒరిజినల్ షేర్ సర్టిఫికెట్లు జగన్ వద్దే ఉన్నాయని తెలిసే అవి పోయాయని అబద్ధాలాడారని, షర్మిల చేసిన ఈ చట్టవిరుద్ధ చర్యలపై క్రిమినల్ కేసు పెట్టొచ్చని అభిప్రాయపడ్డారు. ఈ వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు, శ్రేణులతో సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైయస్ జగన్ ఎన్సీఎల్టీలో అర్జీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? షర్మిల తీరు, ఎల్లో మీడియా దు్రష్పచారాన్ని పార్టీ శ్రేణులకు వివరించారు. సరస్వతి పవర్ షేర్ల మ్యాటర్ హైకోర్టులో ఉందన్నారు. ఈడీ అటాచ్మెంట్లో ఉన్న ఆస్తులపై స్టేటస్కో మెయిన్టెయిన్ చేయాలని హైకోర్టు నిర్దేశించిందని తెలిపారు. వైయస్ జగన్పై అప్పట్లో కాంగ్రెస్ అక్రమ కేసులు పెట్టి, జైలుకు పంపిస్తే.. ఆయన ఆస్తుల అటాచ్మెంట్ కూడా జరిగిందని తెలిపారు.
అలా ఈడీ అటాచ్మెంట్లో ఉన్న షేర్లను బదిలీ చేయించుకున్నారు కాబట్టే, దాన్ని ఆపాలంటూ వైయస్ జగన్ ఎన్సీఎల్టీలో పిటిషన్ ఇచ్చారని వివరించారు. అంతేతప్ప, ఆస్తులు వెనక్కు తీసుకోవాలని కాదన్నారు. సొంత అన్న చట్టపరంగా ఇబ్బందులు పడతారని తెలిసి కూడా షర్మిల కుయుక్తులు పన్నారని చెప్పారు. న్యాయపరంగా జగన్ను ఇబ్బంది పెట్టాలనే సీఎం చంద్రబాబు కుట్రలో భాగంగానే షర్మిల ఇదంతా చేశారన్నారు.
ఇది తెలిశాక ఆ షేర్ల బదిలీ చట్టవిరుద్ధమంటూ ఆపాలంటూ చెల్లెలికి వైయస్ జగన్ లేఖ రాశారని చెప్పారు. ఆమె ససేమిరా అనడంతో న్యాయనిపుణుల అభిప్రాయాన్ని తీసుకొన్నారని తెలిపారు. షేర్ల బదిలీ చట్ట విరుద్ధమని, దానిని ఆపకుంటే ఇబ్బందులొస్తాయని న్యాయ నిపుణులు చెప్పారన్నారు. ఈ వాస్తవ విషయాలను పార్టీ నాయకులు, శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు.