Best Web Hosting Provider In India 2024
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/02/mudragada.jpg)
మాజీ మంత్రి ఇంటిపై జరిగిన దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని నేతల డిమాండు
కిర్లంపూడి: మాజీ మంత్రి, వైయస్ఆర్సీపీ నేత ముద్రగడ పద్మనాభంను వైయస్ఆర్సీపీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని, కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్సీ తోట త్రిమూ ర్తులు, గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు, మాజీ ఎమ్మెల్యేలు సింహాద్రి రమేశ్, దూలం నాగేశ్వరరావు, మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ తదితరులు పరామర్శించారు. ఆయన ఇంటిపై జనసేన కార్యకర్త చేసిన దాడికి సంబంధించి ప్రభుత్వం తక్షణమే స్పందించాలని పార్టీ నేతలు డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా, కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి పార్టీ నేతలు చేరుకొని ఆయనకు, పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జి ముద్రగడ గిరి బాబుకు సంఘీభావం తెలిపారు. అనంతరం వారు విలేకర్లతో మాట్లాడుతూ.. ముద్రగడ ఇంటి మీదకు ఒక వ్యక్తి అర్ధరాత్రి వచ్చి పార్టీ కార్యకర్తను అంటూ బీభత్సం సృష్టించడాన్ని తీవ్రంగా ఖండించారు. కాపు ఉద్యమాన్ని నడిపి, అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న ముద్రగడపై జరిగింది చిన్న దాడి అని అనుకోవడం లేదన్నారు. 70 ఏళ్ల పైబడిన ఆయన అనేక అవమానాలు తట్టుకుని నిలబడ్డారని, ఆయన ఇంటిపై జరిగిన దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు.
ఇలాంటి అరాచక ఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్కళ్యాణ్ మౌనవ్రతం వీడి ఖండించాలని డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తి గంజాయి తాగాడా.. మత్తు పదార్థాలు తీసుకున్నాడా అనేది తర్వాత విషయమన్నారు. తాను జనసేన మనిషేనని, ఆ పార్టీ జెండా మోశానని చెప్పిన వ్యక్తి అర్ధరాత్రి ముద్రగడ ఇంటి పైకి వచ్చి రచ్చ చేయడమే కాకుండా.. మళ్లీ ఉదయం వచ్చి ఇదంతా తానే చేశానని చెప్పడాన్ని చూస్తే.. కూటమి ప్రభుత్వ పాలనలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చునన్నారు.
నిందితుడి ఫోన్ డేటా ఇప్పటి వరకూ ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ బాధ్యత తీసుకుని వివరణ ఇవ్వాలన్నారు. దాడులపై విచారణ జరిపేలా పోలీసులను ఆదేశించాలని డిమాండ్ చేశారు.