YS Jagan in Guntur : ‘చంద్రబాబుగారూ… ఇప్పటికైనా కళ్లు తెరవండి, మిర్చి రైతులతో మాట్లాడండి’ – వైఎస్ జగన్

Best Web Hosting Provider In India 2024

YS Jagan in Guntur : ‘చంద్రబాబుగారూ… ఇప్పటికైనా కళ్లు తెరవండి, మిర్చి రైతులతో మాట్లాడండి’ – వైఎస్ జగన్

Maheshwaram Mahendra HT Telugu Feb 19, 2025 02:07 PM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Twitter
  • Share on Facebook
Maheshwaram Mahendra Chary HT Telugu
Feb 19, 2025 02:07 PM IST

మిర్చి రైతుల ఇబ్బందులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు పట్టడం లేదని జగన్ ఫైర్ అయ్యారు. బుధవారం గుంటూరు మిర్చి యార్డును సందర్శించిన జగన్.. ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం క్వింటాకు రూ.10-12 వేలు కూడా రావడం లేదన్నారు. రైతులు పండించిన పంట అమ్ముకోలేని పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు.

వైఎస్ జగన్
వైఎస్ జగన్
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on twitter
  • Share on Facebook

ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కూటమి పాలనలో మిర్చి రైతులను పట్టించుకునే పరిస్థితి లేదని దుయ్యబట్టారు. సచివాలయానికి గుంటూరు మిర్చియార్డ్‌ కూతవేటు దూరంలోనే ఉందని… అయినా మిర్చి రైతుల అవస్థలు, కష్టాలు చంద్రబాబుకు పట్టడం లేదని ఆక్షేపించారు.

బుధవారం గుంటూరు మిర్చి యార్డును సందర్శించిన జగన్… మిర్చి రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…. గత ప్రభుత్వం హయాంలో మిర్చి ధర క్వింటాకు రూ. 21వేలు పలికిందని గుర్తు చేశారు. కానీ ఇవాళ కేవలం 10, 11 వేలకు కూడా కొనేనాథుడు లేడన్నారు. పంట అమ్ముకోలేని పరిస్థితుల్లో రైతు బతకడానికే కష్టపడుతున్నాడని చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా ఏ పంట తీసుకున్నా రైతుకు గిట్టుబాటు ధరలేదని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని రైతులను సీఎం చంద్రబాబు దళారీలకు అమ్మేశాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కనీసం భద్రత ఇవ్వరా..? జగన్

ఒక ప్రతిపక్ష నేత పర్యటనకు వస్తే కనీసం పోలీస్ భద్రత కూడా చంద్రబాబు ఇవ్వలేదని జగన్ ఆరోపించారు. “ఎల్లకాలం మీరే అధికారంలో ఉండరు. రేపు మేము అధికారంలోకి వచ్చినప్పుడు మీకు పోలీస్ భద్రత ఇవ్వకపోతే ఎలా ఉంటుందో ఓసారి ఆలోచన చేసుకోండి. అసలు మీరు చేస్తున్నది కరెక్టేనా..? కాదా..? అనేది ఆలోచించండి” అంటూ జగన్ ప్రశ్నించారు.

సీఎం చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు….

మిర్చి రైతుల ఇబ్బందులపై చంద్రబాబు ప్రభుత్వానికి జగన్ పలు ప్రశ్నలు సంధించారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఓ ప్రకటన విడుదల చేశారు.

  • రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతలకు కష్టాలు, నష్టాలే మిగులుతున్నాయి. పంటలకు మద్దతు ధర దేవుడెరుగు.. కనీసం అమ్ముకుందామన్నా కొనేవారు లేరు. మొన్నటి వరకూ ధాన్యం రైతుల కష్టాలు చూశాం. ఇవాళ మిర్చిరైతుల కష్టాలు చూస్తున్నాం. చంద్రబాబు గారు సీట్లోకి వచ్చారు, మళ్లీ రైతులను పట్టి పీడించడం మొదలుపెట్టారు.
  • మన ప్రభుత్వంలో నిరుడు క్వింటాలుకు అత్యధికంగా రూ.21-27 వేల దాకా పలికిన మిర్చి ధర, ఇప్పుడు రూ.8-11వేలకు పడిపోయింది.
  • పంట బాగుంటే ఎకరాకు సగటున 20 క్వింటాళ్లు దిగుబడి వస్తుంది. తెగుళ్లు కారణంగా ఈ ఏడాది దిగుబడులు పడిపోయాయి. ఏ జిల్లాలో చూసినా ఎకరాకు 10 క్వింటాళ్లకు మించి రాలేదు. పెట్టుబడి ఖర్చులు చూస్తే, ఎకరా సాగుకు సుమారు రూ.1,50,000 పైమాటే అవుతోంది. కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, అనంతపురం ఈజిల్లాల్లో రైతులందరి పరిస్థితీ అంతే.
  • పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా ఆ ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి.. వీరంతా పట్టించుకోవడంలేదు. ప్రభుత్వంలో ఒక్క రివ్యూ కూడా చేయలేదు. గవర్నమెంటు తరఫున రైతులను పలకరించే వారు లేరు. రాష్ట్ర సచివాలయానికి అత్యంత సమీపంలో గుంటూరు మార్కెట్‌ యార్డు ఉంది. ఇక్కడ రైతుల ఆక్రోశం, ఆవేదన చంద్రబాబునాయుడు గారికి వినిపించడంలేదు.
  • చంద్రబాబుగారు అధికారంలోకి వచ్చి రైతులకు సహాయం చేయకపోగా, వైయస్సార్‌సీపీ ప్రభుత్వంలో వ్యవసాయరంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలన్నింటినీ కూడా మూలన పడేశారు. ఆర్బీకేలను, ఈ-క్రాప్‌ వ్యవస్థలను నిర్వీర్యంచేశారు. ఇంటిగ్రేటెడ్‌ ల్యాబులను నిర్వీర్యంచేశారు. 
  • కనీస మద్దతు ధరలు తెలియజేస్తూ ఆర్బీకేల్లో పోస్టర్లు ఉంచేవాళ్లం. ధాన్యం కొనుగోలుకు రూ.65,258 కోట్లు ఖర్చు చేస్తే, ధాన్యం కాకుండా ఇతర పంటల కొనుగోలు కోసం అక్షరాల రూ. 7,773 కోట్లు ఖర్చు చేసి మన ప్రభుత్వం రైతులను ఆదుకుంది. ఇవాళ మిర్చి రైతులు ఇన్ని కష్టాలు పడుతుంటే, చంద్రబాబునాయుడుగారు కుంభ కర్ణుడిలా నిద్రపోతున్నాడు.
  • మన ప్రభుత్వ హయాంలో CM APP అనే గొప్ప మార్పును తీసుకువచ్చాం. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఏ పంట ధర ఎలా ఉందో ఆ యాప్‌ద్వారా నిరంతరం సమాచారం వచ్చేది. ఆర్బీకేల్లో ఉండే సిబ్బంది రైతులకు అందుతున్న ధరలమీద ఎప్పటికప్పుడు యాప్‌లో అప్‌డేట్‌ చేసేవాళ్లు. ఆ సమాచారం ఆధారంగా కనీస మద్దతు ధర రాని పక్షంలో వెంటనే చర్యలు తీసుకునేవాళ్లం. రైతులనుంచి ఫిర్యాదులు స్వీకరించి, వాటిని పరిష్కరించడానికి 14400, 1907 నంబర్లు కూడా ఉండేవి. ఇప్పుడు ఈవ్యవస్థలను పూర్తిగా నాశనం చేశారు.
  • రైతులకు అందే విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యతపై ఎప్పటికప్పుడు పరీక్షలు జరిగేవి. ప్రభుత్వం ఏర్పాటుచేసిన 147 ఇంటిగ్రేటెడ్‌ అగ్రికల్చర్‌ ల్యాబుల్లో పరీక్షలు జరిగేవి. ఇప్పుడు ఈ ల్యాబులను గాలికొదిలేశారు. ప్రైవేటుకు అప్పగిస్తున్నారు.
  • మార్కెట్లో క్రమం తప్పకుండా అధికారులు తనిఖీలు చేసేవారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు క్రమం తప్పకుండా ఈ తనిఖీలమీద, తీసుకుంటున్న చర్యలమీద రిపోర్టులు ఇస్తూ, గట్టి పర్యవేక్షణ చేసేవారు. దీనివల్ల నకిలీలకు అడ్డుకట్టపడేది. ఎక్కడైనా తప్పు జరిగితే సంబంధిత వ్యక్తులమీద కఠిన చర్యలు తీసుకునేవాళ్లం.
  • వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మిరప రైతులకు ఎప్పుడూలేని విధంగా చాలా గొప్పగా పంటలబీమా అందించాం. 2019-20లో రూ.90.24 కోట్లు, 2020-21లో రూ.36.02 కోట్లు, 2021-22లో రూ.439.79 రైతులకు కోట్లు అందించాం. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఇప్పుడు ఉచిత పంటల బీమాను పూర్తిగా రద్దుచేసి రైతులపై భారాన్ని మోపారు. మన ప్రభుత్వంలో రైతుల‌పై ఒక్కపైసా భారం మోపకుండా ఉచిత పంటలబీమాను అమలు చేసి, 54.55లక్షల మందికి రూ.7,802 కోట్లు పంట నష్టపరిహారం కింద చెల్లించాం.
  • గత ఏడాది క్వింటాలు పత్తి ధర రూ.10వేలు ఉండేది. ఇప్పుడు రూ.5వేలుకూడా దాటడం లేదు. పెసలు కనీస మద్దతు ధర రూ.8,558లు. ఇప్పుడు రూ.6వేలు రావడం కష్టంగా ఉంది. అలాగే మినుములు కనీస మద్దతు ధర రూ.7,400. గత ఏడాది క్వింటాలుకు రూ.10వేలు రాగా, ఇప్పుడు రూ.7వేలు కూడా రావడంలేదు. టమోటా రైతులకు కిలోకి రూ.3-5లు కూడా రావడంలేదు.
  • ఎన్నికల్లో చంద్రబాబుగారు సూపర్‌ సిక్స్‌ అన్నారు.. సూపర్‌ సెవెన్‌ అన్నారు. రైతుకు ప్రతిఏటా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్‌ కాకుండా, రూ.20వేలు ఇస్తామని నమ్మబలికారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల్ని మోసం చేశారు. పోనీ మన ప్రభుత్వంలో ఇచ్చిన రైతు భరోసా కొనసాగించకుండా, రద్దు చేశారు. పలావూ.. లేదు, బిర్యానీ లేదు. కాని, మన ప్రభుత్వంలో ఒక్క రైతు భరోసా కిందే క్రమం తప్పకుండా సుమారు 54 లక్షల మంది రైతులకు రూ.34,288 కోట్లు ఇచ్చాం.
  • ఇదొక్కటే కాదు ఉచిత పంటల బీమాను చంద్రబాబుగారు రద్దు చేశారు, ఒక సీజన్‌లో పంట నష్టం జరిగితే, అదే సీజన్‌ ముగిసేలోగా ఇన్‌పుట్‌ సబ్సిడీని చెల్లించే గొప్ప విధానాన్ని, రైతులకు సున్నావడ్డీ పథకాన్ని రద్దుచేశారు. ఈ-క్రాప్‌ను లేకుండా చేసేశారు, ధరల స్థిరీకరణ నిధికీ ఎగనామం పెట్టారు. కనీసం ఎరువులను కూడా సకాలంలో పంపిణీ చేయడంలోనూ కొరతే. ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకోవడం అత్యంత దారుణం.
  • చంద్రబాబుగారూ… ఇప్పటికైనా కళ్లు తెరవండి. రైతే రాజని గుర్తించండి, రైతు కన్నీరు పెట్టుకుంటే… అది రాష్ట్రానికి అరిష్టం. చంద్రబాబుగారు గుంటూరు మార్కెట్‌ యార్డుకు వచ్చి, మిర్చి రైతులతో మాట్లాడి, వారికి బాసటగా నిలవాలి. ప్రభుత్వమే మిర్చిని కొనుగోలుచేసి రైతులకు అండగా నిలవాలని డిమాండ్‌ చేస్తున్నాం.
Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

Ys JaganYsrcpGunturTdpChandrababu Naidu
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024