IND vs ENG 5th T20: ధనాధన్ సెంచరీతో చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. సిక్స్‌ల రికార్డు కూడా.. భారత్ భారీ స్కోరు

Best Web Hosting Provider In India 2024


IND vs ENG 5th T20: ధనాధన్ సెంచరీతో చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. సిక్స్‌ల రికార్డు కూడా.. భారత్ భారీ స్కోరు

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 02, 2025 08:54 PM IST

IND vs ENG 5th T20 – Abhishek Sharma: ఇంగ్లండ్‍తో ఐదో టీ20లో భారత్ భారీ స్కోరు చేసింది. యంగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ వీరబాదుడు బాదేశాడు. సెంచరీతో కదం తొక్కాడు. రెండు రికార్డులు సృష్టించాడు.

IND vs ENG 5th T20: ధనాధన్ సెంచరీతో చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. సిక్స్‌ల రికార్డు కూడా.. భారత్ భారీ స్కోరు
IND vs ENG 5th T20: ధనాధన్ సెంచరీతో చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. సిక్స్‌ల రికార్డు కూడా.. భారత్ భారీ స్కోరు (Surjeet Yadav)

భారత యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ.. ఇంగ్లండ్ బౌలర్లను కుమ్మేశాడు. ఐదో టీ20లో హిట్టింగ్ తాండవం చేశాడు. ముంబై వాంఖడే స్టేడియంలో ధనాధన్ ఆటతో సెంచరీ మోత మెగించాడు. కేవలం 54 బంతుల్లోనే 135 పరుగులతో అభిషేక్ చెలరేగిపోయాడు. ఏకంగా 13 సిక్స్‌లు, 7 ఫోర్లతో కదంతొక్కాడు. సిక్స్‌ల వర్షం కురిపించాడు. రెండు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. దీంతో ఇంగ్లండ్‍తో సిరీస్‍లో చివరిదైన ఐదో టీ20లో నేడు (ఫిబ్రవరి 2) తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 247 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా.. ఈ చివరి మ్యాచ్‍లో ఇంగ్లండ్ ముందు కొండంత టార్గెట్ ఉంచింది. భారత బ్యాటింగ్ ఎలా సాగిందంటే..

చెలరేగిన అభిషేక్

ఈ మ్యాచ్‍లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‍కు దిగింది టీమిండియా. భారత ఓపెనర్ సంజూ శాంసన్ (7 బంతుల్లో 16 పరుగులు).. ఇంగ్లండ్ పేసర్ ఆర్చర్ వేసిన తొలి బంతికే సిక్సర్ బాది అదిరే ఆరంభం ఇచ్చాడు. రెండో ఓవర్లో ఔటయ్యాడు. అభిషేక్ శర్మ మాత్రం సూపర్ హిట్టింగ్ చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లను చితకబాదేశాడు. గ్రౌండ్‍కు నలుదిక్కులా సిక్స్‌ల మోత మోగించాడు. ఆకాశమే హత్తుగా అభిషేక్ చెలరేగాడు. కేవలం 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేరాడు. దీంతో ఆరు ఓవర్ల పవర్ ప్లే ముగిసే సరికి టీమిండియా ఒక వికెట్‍కు 95 పరుగులు చేసింది. పవర్ ప్లేలో తన అత్యధిక స్కోరుతో భారత్‍ రికార్డు సృష్టించింది.

తెలుగు ఆటగాడు తిలక్ వర్మ (15 బంతుల్లో 24 పరుగులు) ఉన్నంతసేపు దూకుడైన ఆటతో దుమ్మురేపాడు. అయితే, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (2) త్వరగా ఔటై.. మరోసారి నిరాశపరిచాడు. శివమ్ దూబే (13 బంతుల్లో 30 పరుగులు) దుమ్మురేపాడు. అయితే, 14వ ఓవర్లో పెలిలియన్ చేరాడు. అభిషేక్ మాత్రం దూకుడుగానే కొనసాగాడు. 11.5 ఓవర్లలోనే 150 పరుగుల మార్క్ దాటింది భారత్.

అభిషేక్ అదిరే సెంచరీ

వికెట్లు పడుతున్నా అభిషేక్ శర్మ టాప్ గేర్‌లో హిట్టింగ్ చేశాడు. దూకుడు కొనసాగించాడు. మొత్తంగా 37 బంతుల్లోనే సెంచరీ మార్క్ చేరి దుమ్మురేపాడు. అంతర్జాతీయ టీ20ల్లో అభిషేక్‍కు ఇది రెండో సెంచరీ. భారత్ తరఫున టీ20ల్లో రెండో వేగవంతమైన శతకం బాదాడు. టీమిండియా తరఫున ఫాస్టెస్ట్ టీ20 సెంచరీ రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉంది. 2017లో లంకపై 35 బంతుల్లోనే శతకం బాదాడు హిట్‍మ్యాన్. ఇప్పుడు ఈ మ్యాచ్‍లో ఇంగ్లండ్‍పై 37 బంతుల్లో అభిషేక్ సెంచరీ చేశాడు.

హార్దిక్ పాండ్యా (9), రింకూ సింగ్ (9) ఎక్కువసేపు నిలువలేకపోయారు. కానీ అభిషేక్ హిట్టింగ్ కొనసాగించాడు. దూకుడుగా ఆడాడు. చివరికి 18న ఓవర్లో ఔటయ్యాడు. అక్షర్ పటేల్ 15 రన్స్ చేశాడు. మొత్తంగా 9 వికెట్లకు 247 పరుగుల భారీ స్కోరు చేసింది భారత్. ఇంగ్లండ్ ముందు 248 పరుగుల భారీ టార్గెట్ ఉంది.

చరిత్ర సృష్టించిన అభిషేక్.. రెండు రికార్డులు

అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాడిగా అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఈ రికార్డు ఇప్పటి వరకు శుభ్‍మన్ గిల్ (2023లో న్యూజిలాండ్‍పై 126 పరుగులు నాటౌట్) పేరిట ఉండేది. ఈ మ్యాచ్‍లో 135 రన్స్ చేసి ఆ రికార్డును బద్దలుకొట్టాడు అభిషేక్ శర్మ.

ఓ అంతర్జాతీయ టీ20 మ్యాచ్‍లో అత్యధిక సిక్స్‌లు బాదిన భారత బ్యాటర్ రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు అభిషేక్ శర్మ. ఈ మ్యాచ్‍లో అతడు 13 సిక్స్‌లు బాదాడు. 2017లో లంకపై టీ20 మ్యాచ్‍లో 10 సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ పేరిట ఇప్పటి వరకు ఆ రికార్డు ఉండగా.. అభిషేక్ ఇప్పుడు బ్రేక్ చేశాడు.

Whats_app_banner

సంబంధిత కథనం


Best Web Hosting Provider In India 2024


Source link