Best Web Hosting Provider In India 2024

వైయస్ఆర్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ ప్రకటన
క్యాంప్ ఆఫీస్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైయస్ జగన్ సమావేశం
క్షేత్ర స్థాయిలో ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత
టీడీపీ ఇస్తామన్న పథకాలన్నీ మోసాలుగా మిగిలాయి
ప్రజలకు తోడుగా, వారితో ఉంటే గెలుపు సాధించినట్లే
ఈ ప్రభుత్వాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు
వైయస్ జగన్ స్పష్టీకరణ
పార్టీ కోసం, ప్రజల కోసం పని చేస్తే ఉజ్వల భవిష్యత్తు
మీ అందరి భవిష్యత్తుకు నాది భరోసా
అసెంబ్లీలో వైయస్ఆర్సీపీ తప్ప వేరే ప్రతిపక్షం లేదు
సభలో సమయం ఇవ్వాల్సి వస్తుందనే హోదా ఇవ్వడం లేదు
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు
టీడీపీ కూటమి ప్రభుత్వంపై వైయస్ జగన్ ఫైర్
తాడేపల్లి: ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం కొనసాగిస్తామని మాజీ సీఎం, వైయస్ఆర్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రంగా ఉందని, టీడీపీ ఇస్తామన్న పథకాలన్నీ మోసాలుగా మిగిలిపోయాయని క్యాంప్ ఆఫీస్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమైన ఆయన వెల్లడించారు.
వైయస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
ప్రజలతో ఉంటే అది సాధించినట్లే:
మనం యుద్ధ రంగంలో ఉన్నాం. విజయం దిశగా అడుగులు వేయాలి. ప్రజా సమస్యల విషయంలో రాజీలేని పోరాటం చేయాలి. నిజాయితీగా, చిత్తశుద్ధితో ప్రజల తరపున పోరాటం చేయాలి. ప్రజలకు తోడుగా ఉంటూ, వారితో మమేకమైతే గెలుపు సాధించినట్లే. అందుకనే ప్రజా సమస్యలపై పోరాటంలో వెనుకడుగు వేయవద్దు. మనం వేసే ప్రతి అడుగు పార్టీ ప్రతిష్టను పెంచేదిలా ఉండాలి. ఎక్కడా రాజీ పడకూడదు.
మీ భవిష్యత్తుకు నాది భరోసా:
ఈ ప్రభుత్వాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికీ నేను భరోసా ఇస్తున్నాను. మీ భవిష్యత్తుకు నాది భరోసా. నేను మరో 30 ఏళ్లు రాజకీయాలు చేస్తాను. ప్రతిపక్షంలో మన సమర్ధతను నిరూపించుకోవడానికి ఇదొక అవకాశం. పార్టీ కోసం, ప్రజల కోసం గట్టిగా పని చేస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. కళ్లు మూసుకుని, తెరిచేలోగా ఏడాది గడిచిపోతుంది. జమిలి ఎన్నికలు అంటున్నారు. అదే జరిగితే ఎన్నికలు మరింత మందుగా వస్తాయి. అందుకే ప్రజా సమస్యల విషయంలో ఎక్కడా రాజీ వద్దు. ప్రజల తరపున గొంతు విప్పే విషయంలో ఎక్కడా తగ్గాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో మనం విలువలు, విశ్వసనీయత పాటిస్తున్నాం కాబట్టే ఎన్నో క్లిష్ట పరిస్థితులు అధిగమించాం. ఇంత దూరం ప్రయాణం చేశాం. దేవుడు మనల్ని అందరినీ తప్పకుండా ఆశీర్వదిస్తాడు.
అందుకే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు:
అసెంబ్లీలో మనం తప్ప వేరే ప్రతిపక్షం లేదు. ప్రతిపక్ష హోదా విషయంలో అధికార పార్టీ వైఖరిని ప్రజలకు తేటతెల్లం చేసేందుకే ఇవాళ అసెంబ్లీకి వెళ్లాం. మనకు ప్రతిపక్ష హోదా ఇస్తే.. హక్కుగా మనకు సమయం ఇవ్వాల్సి వస్తుంది. సభా నాయకుడికి దాదాపు సమానమైన స్ధాయిలో సమయం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకనే ప్రతిపక్ష హోదాను ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. ఆ విధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. సభలో ప్రతిపక్షం స్వరం వినాలి. తప్పులుంటే సరిదిద్దుకోవాలి.
నేను ఏ అంశంపై మాట్లాడినా నిందలకు, దూషణలకు దూరం. ప్రతి అంశాన్నీ ఆధారాలు, రుజువులతో మాట్లాడతాను. నా ప్రసంగాల్లో కూడా చాలా సార్లు సభలో చంద్రబాబునాయుడు ఉంటే బాగుండేదని చెప్పాను. అయితే ప్రభుత్వం స్వరం తప్ప వేరే స్వరం వినపడకూడదు అన్నట్టు అసెంబ్లీని తయారు చేశారు.
ఇళ్ల పట్టాలు రద్దు చేస్తే కోర్టుకెళ్తాం:
కాగా, సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూటమి ప్రభుత్వం అన్యాయంగా ఇళ్ల పట్టాలు రద్దు చేస్తోందని ప్రస్తావించారు. దీనిపై స్పందించిన వైయస్ జగన్.. మన హయాంలో 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. పార్టీలు చూడకుండా, పక్షపాతం లేకుండా ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఎవరైనా ఇల్లు కట్టుకోకపోతే ప్రభుత్వమే వారికి ఇల్లు మంజూరు చేసి ఇవ్వాలి. అంతేకానీ పేదలపై కక్ష కట్టి పట్టాలు రద్దు చేయడం ఏంటి? పట్టాలు రద్దు చేస్తే తప్పకుండా కోర్టును ఆశ్రయిస్తాం.
ప్రజలకు అన్నీ తెలుసు:
కాలనీలు పేర్లు కూడా మారుస్తున్నారని కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రస్తావించగా.. ఎవరు ఇళ్లస్ధలాలిచ్చారో, ఎవరు కాలనీలు ఏర్పాటు చేశారో ప్రజలకు తెలుసు. విజయవాడలో అంబేడ్కర్ స్మృతివనాన్ని మనమే నిర్మించాం. కానీ పేరు తీసేయాలన్న ఉద్దేశంతో ఏకంగా అంబేడ్కర్ విగ్రహం మీదే దాడికి దిగారు. ప్రభుత్వ ఆదేశాలతోనే అదంతా జరిగింది. అధికారులే స్వయంగా దానికి ఒడిగట్టారు. మరి స్మృతివనం ఎవరు కట్టారో ప్రజలకు తెలియదా?
ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా ప్రజలకు రూ.2.73 లక్షల కోట్లు ఇచ్చి మంచి చేశాం. మనమిచ్చిన పథకాలన్నీ రద్దు చేశారు. నోటి దాకా వచ్చిన కూడును తీసేశారు. టీడీపీ వాళ్లు ఇస్తామన్న పథకాలన్నీ మోసాలుగా మిగిలాయని ఈ సందర్భంగా వైయస్ జగన్ గుర్తు చేశారు.