







Best Web Hosting Provider In India 2024

Narasaraopet Mla: ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో నరసరావుపేట ఎమ్మెల్యే నిరసన.. నేలపై పడుకుని హంగామా..
Narasaraopet Mla: వైసీపీ హయంలో నియమించిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని తీసేసి తాను చెప్పిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలంటూ నరసరావు పేట ఎమ్మల్యే చదలవాడ అరవిందబాబు ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో హంగామా చేశారు. మూడు గంటల పాటు కమిషనర్ కార్యాలయంలో హడావుడి చేయడం చర్చనీయాంశమైంది.

Narasaraopet Mla: ఏపీ ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు గురువారం హంగామా చేశారు. దాదాపు మూడు గంటల పాటు కమిషనర్ ఛాంబర్లో బైఠాయించి హడావుడి చేశారు. పలువురు మంత్రులు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు నచ్చ చెప్పేందుకు ప్రయత్నించినా ఎమ్మెల్యే వెనక్కి తగ్గలేదు.
ఏపీ ఎక్సైజ్ కమిషనర్ నిషాంత్ కుమార్ ఛాంబర్లో గురువారం హైడ్రామా చోటు చేసుకుంది. ఐఏఎస్ అధికారి నిషాంత్కుమార్ చాంబర్కు వెళ్లిన ఎమ్మెల్యే తాను చెప్పిన పని చేసే వరకు కదలనంటూ బైఠాయించారు.
గుంటూరు జిల్లా మద్యం డిపోలో పనిచేస్తున్న ఔట్సోరింగ్ ఉద్యోగులను మార్చాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే కొద్ది రోజుల క్రితం లేఖ పంపారు. నరసరావుపేటలో ఎక్సైజ్ శాఖకు చెందిన మద్యం డిపోలో 11మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు.
వారంతా వైసీపీ ప్రభుత్వంలో నియమితులయ్యారని వారిలో ఒకరు మినహా మిగిలిన పదిమందిని వెంటనే తొలగించి వారి స్థానాల్లో తాను సిఫార్సు చేసిన పదిమందిని తక్షణమే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని ఆదేశించారు. ఎమ్మెల్యే సూచన అమలు కాకపోవడంతో అరవిందబాబు గురువారం మధ్యాహ్నం ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లారు. తాను రాసిన లేఖపై స్పందన లేదని వెంటనే దానిని అమలు చేయాలని పట్టుబట్టారు. తాను సూచించిన వారికి ఉద్యోగాలు ఇస్తేనే వెళతానంటూ అక్కడే బైఠాయించారు.
ఎమ్మెల్యే తీరుతో ఎక్సైజ్ డైరెక్టర్… మంత్రి కొల్లు రవీంద్రకు సమాచారం అందించారు. మంత్రితో పాటు వినుకొండ ఎమ్మెల్యే, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులు ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని సముదాయించినా కమిషనర్ కార్యాలయం నుంచి వెళ్లేందుకు ఎమ్మెల్యే అంగీకరించలేదు.
కమిషనర్ గదిలో ఉన్న సోఫాలో పడుకుని నిరసన తెలిపారు. దీంతో దాదాపు మూడు గంటల తర్వాత ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని నర్సరావుపేట డిపో మేనేజర్ను ఆదేశిస్తూ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడంతో ఎమ్మెల్మయే అరవిందబాబు అక్కడినుంచి వెళ్లిపోయారు.
గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం ఆరు వరకు ఈ రచ్చ కొనసాగింది. మొదట కమిషనర్ యాంటీ రూమ్ లోపలికి వెళ్లి దిండ్లు తెచ్చుకున్న ఎమ్మెల్యే కొంత నేపు సోఫాలో కూర్చుని ఆ తర్వాత నేలపై పడుకొని నిరసన తెలిపారు. ఎక్సైజ్ ఉన్నతాధికారులు పదే పదే ఆయనకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా వినలేదు.
ఎమ్మెల్యేచదలవాడ అరవిందబాబును ఎక్సైజ్ కమిషనరేట్ నుంచి వెనక్కి రావాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు విఫలయత్నం చేశారు.
గంటలో ఆర్డర్లు కావాలని పట్టుబట్టి…
నరసరావుపేటలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించి వారి స్థానంలో తాను చెప్పిన వారిని నియమించాలంటూ ఎక్సైజ్ కమిషనర్ నిషాంత్ కుమార్కు ఎమ్మెల్యే గురువారం మధ్యాహ్నం 1 గంట సమయంలో నేరుగా వినతి పత్రం ఇచ్చారని ఉద్యోగులు చెబుతున్నారు. మళ్లీ గంటలో వస్తానని అప్పటికి కొత్త వారికి అపాయింట్మెంట్ ఆర్డర్లు సిద్ధం చేయాలని కమిషనర్ను ఆదేశించారు.
ఆ తర్వాత మూడు గంటల సమయంలో వచ్చి హంగామా మొదలు పెట్టారు. ఎమ్మెల్యే తీరుపై ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రభుత్వ కార్యాలయంలో బైఠాయించడం ఎంత మేరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.
సంబంధిత కథనం
టాపిక్