



Best Web Hosting Provider In India 2024

Banglore Pakashala Board: మా హోటల్ తినడానికి మాత్రమే అంటూ విచిత్రంగా బోర్డు రాసి పెట్టిన యజమాని.. నెటిజన్లు ఊరుకుంటారా!
Banglore Pakashala Board: బెంగళూరులోని పాకశాల హోటల్లో ఏర్పాటు చేసిన బోర్డు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారింది. సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. అంతలా ఆ బోర్డులో ఏముంది? దాని గురించి నెటిజన్లు ఏమంటున్నారు? చూద్దాం రండి.

బెంగళూరులోని ప్రముఖ వెజ్ హోటళ్లలో పాకశాల ఒకటి. ఇది అక్కడ చాలా ఫేమస్ భోజనాశాల. ఇక్కడ భోజనం చాలా రుచిగా ఉంటుందనీ, నాణ్యతలోనూ మంచి పేరు కలిగి ఉందని తెలుస్తోంది. అయితే ఇప్పుడీ హోటల్ బెంగుళూరులో మాత్రమే కాదు మొత్తం సోషల్ మీడియాలో తెగ ఫేమస్ అయిపోతుంది. ఇందుకు ఆ హోటల్ యజమాని ఏర్పాటు చేసిన విచిత్రమైన బోర్డు కారణం. ఇంతకీ ఆ బోర్డులో ఏముంది, ఎందుకు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తెలుసుకుందాం రండి.
బోర్డు మీద ఏం రాసి ఉందంటే..
బెంగుళూరులోని జేపీ నగర్లో ఉండే హోటల్లో భోజనం చేయడానికి వెళ్లిన ఓ వ్యక్తి అక్కడున్న బోర్డును ఫోటో తీసి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. బోర్డు మీద రాసి ఉన్న అంశాన్ని హైలేట్ చేస్తూ “Clear instructions alright” అనే కామెంట్ను జత చేశాడు. దాని మీద యజమాని రాసిన అంశం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.
ఆ బోర్డు మీద ఏముందంటే.. ‘‘This facility is only for Dine-In Purpose. Not for Real Estate / Political Discussions. Please understand and Cooperate” అని కన్నడ, ఇంగ్లీషు భాషల్లో రాసి ఉంది. దీనికి అర్థం “ఈ హోటల్ కేవలం భోజనం చేయడానికి మాత్రమే, రియల్ ఎస్టేట్, రాజకీయాలకు సంబంధించిన చర్చలకు కాదు దయచేసి అర్థం చేసుకుని సహకరించగలరు” అని.
అంటే తమ హోటల్లో భోజనం, స్నాక్స్ తీసుకునేటప్పుడు కొన్ని విషయాలపై చర్చించరాదని సున్నితంగా చెప్పే ప్రయత్నం చేశాడు యజమాని. ఈ బోర్డును ఫారాగో మెటికుర్కే అనే ఎక్స్ యూజర్ తన ఎక్స్ పేజీలో షేర్ చేశాడు. ఈ పోస్టుపై నెటిజన్లు తమ భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తుండటంతో ఇప్పుడిది వైరల్ గా మారింది.
నెటిజన్లు ఏమంటున్నారంటే..
ఈ పోస్టును చూసి నెటిజన్లు రకరకాలుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. “అవును ఇది చాలా మంచి నిర్ణయం. కాఫీ డే రోజున అలాంటి వారిని చూసినప్పుడు నాకు కొట్టాలనిపిస్తుంది. కొందరికి పబ్లిక్లో హుందుగా ఎలా ఉండాలి అనే కామన్ సెన్స్ కూడా ఉండదు. గట్టిగా అరుస్తూ, అర్థం పర్థం లేకుండా మాట్లాడతారు. కొందరేమో పది మంది వచ్చి కూర్చుని ఐదు కాఫీలు ఆర్డర్ చేస్తారు.. హోటల్ పై కప్పు పడిపోయేంత గట్టిగా మాట్లాడుకుంటారు.” అని ఒక నెటిజన్ బోర్డును మెచ్చుకుంటూ రియాక్ట్ అయ్యారు.
కుటుంబ, రాజకీయాల గురించి కూడా మాట్లాడకూడదా అని మరొకరు ప్రశ్నించారు.
” హహహ! అవును, ఈ చర్చలు ఎప్పటికీ ముగియవు. నిజానికి ఇలాంటి చర్చలు చేసేవారు భోజనం చేయడానికి వచ్చే వారి కంటే ఎక్కువసేపు హోటల్లో కూర్చుంటారు” అని మరొకరు వ్యాఖ్యానించారు.
హోటల్లో రియల్ ఎస్టేట్ గురించి చర్చిస్తే ఏమవుతుందని మరొకరు కామెంట్ చేశారు.
ఏదైనా హోటల్ లో భోజనం చేసే వారికంటే టైం పాస్ చేసే వాళ్లే ఎక్కువగా ఉన్నారని మరోక యూజర్ అన్నారు.
ఇలా నెటిజన్లలో కొందరు హోటల్ యజమాని చేసిన పనిని మెచ్చుకుంటే మరొకరు ఇది సరికాదంటూ కామెంట్లు చేశారు. ఇంకొందరు ఇలాంటి నిబంధనలను ఇతర హోటళ్లలో కూడా ప్రవేశపెడితే బాగుంటుందని అంటున్నారు. మొత్తానికి బెంగుళూరు పాకశాల హోటల్ బోర్డు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
సంబంధిత కథనం