


Best Web Hosting Provider In India 2024

Posani Krishna Murali : సినీనటుడు పోసానికి మరో షాక్, ఈ నెల 20 వరకు రిమాండ్
Posani Krishna Murali : సినీనటుడు పోసాని కృష్ణమురళికి మరో షాక్ తగిలింది. ఈ నెల 20 వరకు విజయవాడ కోర్టు పోసానికి రిమాండ్ విధించింది. తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, ఒకే కేసులో అన్ని ప్రాంతాలకు తిప్పుతున్నారని ఆవేదన చెందారు.

Posani Krishna Murali : సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళికి విజయవాడ కోర్టు షాక్ ఇచ్చింది. ఈ నెల 20వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ విజయవాడ సీఎంఎం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇవాళ పోసానిని విజయవాడ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. తనపై అక్రమంగా కేసులు పెట్టారని, ఒకే విధమైన కేసులతో అన్ని ప్రాంతాలకు తిప్పుతున్నాని కోర్టులో ఆవేదన వ్యక్తం చేశారు. తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని న్యాయమూర్తి ముందు గోడు వెల్లబోసుకున్నారు. తనకు గుండె సమస్యలు, పక్షవాతం వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని తెలిపారు. తనకు జరిగిన ఆపరేషన్ల గురించి న్యాయమూర్తికి వివరించారు.
ఈ నెల 20 వరకు రిమాండ్
కర్నూలు జిల్లా జైలులో ఉన్న పోసాని కృష్ణ మురళిని పీటీ వారెంట్పై విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు పోలీసులు. వైద్యపరీక్షల అనంతరం విజయవాడ కోర్టులో హాజరుపర్చారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, వారి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారని జనసేన నేత శంకర్ ఫిర్యాదుతో భవానీపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో భాగంగా పీటీ వారెంట్పై కర్నూలు జిల్లా జైలు నుంచి విజయవాడకు తలించారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు పోసాని కృష్ణ మురళికి ఈ నెల 20వ తేదీ వరకు రిమాండ్ విధించింది.
అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో పోసానిపై ఏపీ వ్యాప్తంగా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులకు సంబంధించి పలు జిల్లాల్లోని కోర్టుల్లో వాదనలు జరిగాయి. కర్నూలు జిల్లా ఆదోని అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో శుక్రవారం పోసాని కేసుపై వాదనలు ముగియగా…వయస్సు, ఆరోగ్య కారణాలను దృష్ట్యా కోర్టు బెయిల్ మంజూరు చేయాలని పోసాని న్యాయవాదులు వాదనలను వినిపించారు. రాజకీయ దురుద్దేశంతోనే పోసానిపై అక్రమంగా కేసులు పెట్టారని వాదించారు.
అయితే పోసాని వాడిన పదజాలం చాలా తీవ్రంగా ఉందని ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ మహేశ్వరి వాదనలు వినిపించారు. పోసాని మాటలు బాధితుల ప్రాథమిక హక్కులను హరించేలా ఉన్నాయని, బెయిల్ ఇస్తే ఆయన సాక్ష్యాలను ప్రభావితం చేస్తారని చెప్పారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను ఈనెల 10కి వాయిదా వేసింది.
కడప కోర్టు బెయిల్
అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్ లో నమోదైన కేసులో పోసానికి కడప కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. అయితే పోసానిని రెండ్రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ పల్నాడు జిల్లా నరసరావుపేట కోర్టు శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు పోసాని దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ సోమవారానికి వాయిదా వేసింది.
హైకోర్టులో ఊరట
సినీనటుడు పోసాని కృష్ణమురళికి బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 35(3)కు అనుగుణంగా నడుచుకోవాలని పోలీసులను ఏపీ హైకోర్టు ఆదేశించింది. విజయవాడ, సూర్యారావుపేటలో నమోదైన కేసులను కొట్టివేయాలని పోసాని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేసింది. ఈ కేసుల్లో పీటీ వారెంట్ అమలుకాలేదని పోసాని న్యాయవాదులు కోర్టుకు వివరించారు. ఈ వాదనలు పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు పిటిషనర్ విషయంలో బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 35(3) ప్రకారం నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.
ఓ టీవీ ఛానల్, ఆ సంస్థ యజమాని, ఉద్యోగులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు అసభ్యకరంగా దూషించానంటూ విజయవాడకు చెందిన పావులూరి రమేశ్బాబు ఇచ్చిన ఫిర్యాదుతో సూర్యారావుపేట పోలీసులు పోసానిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులను కొట్టివేయాలని కోరుతూ పోసాని హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
సంబంధిత కథనం
టాపిక్