

Best Web Hosting Provider In India 2024

AP Teachers Transfers : ఏపీ ఉపాధ్యాయ సీనియారిటీ జాబితాలు, తప్పులు సరిచేసేందుకు డీఈవోలతో ప్రత్యేక సమావేశం
AP Teachers Transfers : ఏపీలో ఉపాధ్యాయ బదిలీలపై కసరత్తు కొనసాగుతోంది. అయితే సీనియారిటీ జాబితాలో తప్పులు సరిచేసేందుకు డీఈవోలతో ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు సిద్ధం అయ్యారు.

AP Teachers Transfers : ఏపీలో ఇటీవల తయారుచేసిన ఉపాధ్యాయ సీనియారిటీ జాబితాలు తప్పులు తడకలుగా ఉన్నాయని, వాటిని సరిచేసేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యా శాఖ అధికారులు (డీఈవో)లతో ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు రాష్ట్ర విద్యా శాఖ అధికారులు సిద్ధం అయ్యారు. స్పెషల్ ఎడ్యుకేషన్, క్రాప్ట్, డ్రాయింగ్, మ్యూజిక్, ఒకేషనల్ టీచర్లకు కూడా సాధారణ టీచర్ల మాదిరిగానే బదిలీలు నిర్వహించనున్నారు.
ఈ మేరకు ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విద్యా శాఖ కమిషనర్ విజయరామరాజు, అడిషనల్ డైరెక్టర్ సుబ్బారెడ్డి, డిప్యూటీ డైరెక్టర్స్ అబ్రహం, శైలజ, ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో వివిధ విద్యా రంగ సంబంధిత అంశాలపై చర్చించారు. తరగతులు విలీనం, ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలో తప్పులు తదితర అంశాలపై దృష్టి పెట్టారు.
మోడల్ ప్రైమరీ స్కూల్స్ లో మూడు, నాలుగు, ఐదు తరగతులను విలీనం చేయడం గురించి ఎమ్మెల్యేలు మంత్రులతో కూడా మాట్లాడి నిర్ణయం తీసుకోవడం జరిగిందని, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల నిర్ణయం మేరకే మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. సీనియారిటీ లిస్టులు చాలావరకు అన్ని జిల్లాలలో తప్పులుగా ఉన్నాయని కమిషనర్ దృష్టికి ఉపాధ్యాయ సంఘాలు, తీసుకువెళ్లగా అందరూ డీఈవోలకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సరి చేయిస్తామన్నారు.
ఏజెన్సీ టీచర్లకు
ఏజెన్సీ ఏరియాలలో పనిచేసే టీచర్లకు ప్రత్యేకంగా వారు పనిచేసిన కాలానికి సంవత్సరానికి ఒక పాయింట్ అదనంగా కేటాయిస్తామని తెలిపారు. గతంలో గవర్నమెంట్ జీవోల ద్వారా బదిలీ అయిన వారికి గతంలో పని చేసిన, ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాలలో కలిపి లాంగ్ స్టాండింగ్ తీసుకోవడం జరగదని తెలిపారు. గవర్నమెంట్ జీవోల ద్వారా బదిలీ అయిన వారికి రెండు స్టేషన్లను కలిపి లాంగ్ స్టాండింగ్ తీసుకోవడం బదిలీల చట్టం అమలు నుంచి అమలు చేస్తామన్నారు.
స్పెషల్ ఎడ్యుకేషన్, క్రాప్ట్, డ్రాయింగ్, మ్యూజిక్, ఒకేషనల్ టీచర్లకు కూడా సాధారణ టీచర్ల మాదిరిగానే బదిలీలు నిర్వహిస్తామని తెలిపారు. సర్వీస్ పాయింట్ లో 0.5 నుంచి ఒకటికి పెంచడంపై ఎక్కువ మంది లేవనెత్తారు. సర్వీస్ పాయింట్లు ఒకటి ఇవ్వాలా, 0.5 ఇవ్వాలా అనే విషయమై కమీషనర్ అన్ని సంఘాల అభిప్రాయాలు కోరారు. ప్రస్తుత క్యాడర్కు 1 పాయింట్, ఫీడర్ కేడర్కు 0.5 కోరారు. తదుపరి నిర్ణయం త్వరలోనే ప్రకటిస్తారు.
వితంతువును ప్రిఫరెన్షియల్ కేటగిరిగా పరిగణించే విషయం పునరాలోచిస్తున్నామన్నారు. వితంతువుకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు కోరారు. దివ్యాంగుల విషయం కూడా జీఏడీ సూచించిన విధంగా పెడితే న్యాయపరమైన వివాదాలు ఉండవని అందరూ అభిప్రాయం వ్యక్తం చేశారు. సాధారణ బదిలీలతో కాకుండా అంతర్ జిల్లా బదిలీలు ప్రత్యేకంగా చేపట్టేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం
టాపిక్