





Best Web Hosting Provider In India 2024
Konanki Sudikhsa Parents: కోణంకి సుదిక్ష చౌదరి మరణాన్ని ధృవీకరించాలని డొమనికన్ రిపబ్లిక్ను కోరిన తల్లిదండ్రులు
Konanki Sudikhsa Parents: డొమనికన్ రిపబ్లికన్ దేశంలో విహార యాత్రకు వెళ్లి అదృశ్యమైన ప్రవాసాంధ్ర యువతి కోణంకి సుదీక్ష చౌదరి మరణాన్ని ధృవీకరించాలని ఆమె తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. ఉత్తర అమెరికా దేశమైన డొమనికన్ రిపబ్లిక్లో సముద్ర తీరంలో మార్చి 6న సుదీక్ష అనుమనాస్పద స్థితిలో అదృశ్యమయ్యారు.
Konanki Sudikhsa Parents: డొమనికన్ రిపబ్లిక్ దేశంలో అదృశ్యమైన 20 ఏళ్ల భారతీయ విద్యార్థిని సుదిక్ష చౌదరి కోణంకి మరణించినట్లు ప్రకటించాలని అమెరికాలో స్థిరపడిన ఆమె కుటుంబం డొమినికన్ రిపబ్లిక్లోని పోలీసులను కోరింది.
ఆంధ్రప్రదేశ్కు చెందిన కోణంకి సుదిక్ష అమెరికాలో పర్మనెంట్ రెసిడెంట్గా ఉన్నారు. ఆమె కుటుంబం కడప జిల్లా నుంచి వాషింగ్టన్కు వలస వెళ్లి స్థిరపడ్డారు. సుదీక్ష చివరిసారిగా మార్చి 6న పుంటా కానా పట్టణంలోని రియు రిపబ్లిక్ రిసార్ట్ లో కనిపించారు.
డొమినికన్ రిపబ్లిక్ లో విహారయాత్రకు వెళ్లిన సుదిక్ష కనిపించకుండా పోయారని, ఆమె అదృశ్యంపై దర్యాప్తులో అమెరికా ఫెడరల్ లా ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీలు కరీబియన్ దేశంలోని అధికారులతో కలిసి పనిచేస్తున్నాయి. దాదాపు రెండు వారాలుగా విస్తృతంగా గాలించినా ఆమె మృతదేహం లభ్యం కాకపోవడం అనుమానాలకు తావిచ్చింది. తమ కుమార్తె అపహరణకు గురై ఉంటుందని సుదీక్ష తండ్రి ఆరోపించారు.
తీవ్ర విషాదంలో కుటుంబం..
తాజాగా డొమినికన్ రిపబ్లిక్ నేషనల్ పోలీస్ అధికార ప్రతినిధి డియాగో పెస్క్వేరా ఎన్బీసీ మీడియాతో మాట్లాడుతూ, కోణంకి కుటుంబం సుదీక్ష మరణ ధృవీకరణ ప్రకటన కోరుతూ ఏజెన్సీకి లేఖ పంపిందని ఎన్బీసి న్యూస్ కథనం వెల్లడించింది. ఈ ప్రకటనపై కోణంకి కుటుంబం వెంటనే స్పందించలేదు.
మరోవైపు డొమినికన్ రిపబ్లిక్ అధికారులు సుదీక్షతో చివరి సారి కలిసి ఉన్న రిబే పాస్పోస్ట్ స్వాధీనం చేసుకున్నారని దర్యాప్తు వర్గాలను ఉటంకిస్తూ సిఎన్ఎన్ న్యూస్ ప్రకటించింది.
డొమినికన్ రిపబ్లిక్ అటార్నీ జనరల్ యెనీ బెరెనిస్ రేనోసో గత వారాంతంలోదాదాపు ఆరు గంటలకు పైగా జాషువా స్టీవెన్ రైబేను ఇంటర్వ్యూ చేశారని, స్థానిక ప్రాసిక్యూటర్ తో విచారణ కొనసాగుతుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
అనుమానాల్లేవు…
ఈ కేసులో రిబేను అనుమానితుడిగా పరిగణించడం లేదని సుదీక్ష బృందంలో అతను లేడని, వారితో కలిసి అక్కడకు వెళ్లలేదని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. అదను తప్పు చేసినట్లు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు.
రిబే పాస్ పోర్టును ఏ కారణాాలతో స్వాధీనం చేసుకున్నారో వెల్లడించలేదు. మార్చి 6 తెల్లవారుజామున సుదీక్ష కనిపించకుండా పోయినప్పటి నుండి, అయోవాలోని రాక్ రాపిడ్స్కు చెందిన 22 ఏళ్ల రిబే పోలీసులు నిగాలో ఉన్నాడు. మిన్నెసోటాలోని సెయింట్ క్లౌడ్ స్టేట్ యూనివర్శిటీలో సీనియర్ అయిన రిబేనున అమెరికా, డొమనికన్ రిపబ్లిక్ దర్యాప్తు బృందాలు ప్రశ్నిస్తున్నాయి. రిబేను పలుమార్లు విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లినట్లు అతని తల్లిదండ్రులు ఒక ప్రకటనలో తెలిపారు.
పోలీసులకు లేఖ రాసిన బాధితురాలి కుటుంబం..
మార్చి 6 తెల్లవారుజామున పుంటా కానా బీచ్ నుండి అదృశ్యమైన కోణంకి మరణంలో ఎటువంటి అనుమానాలు లేవని అంగీకరిస్తూ కోణంకి కుటుంబం సోమవారం అధికారులకు అధికారిక లేఖను పంపిందని న్యూయార్క్ పోస్ట్ కథనం పేర్కొంది.
ఈ కేసులో అధికారుల దర్యాప్తును తాము విశ్వసిస్తున్నామని, యువతిని సజీవంగా చూసిన చివరి వ్యక్తి రిబే దర్యాప్తునకు సహకరించాడని ఆమె తండ్రి, తల్లి కూడా రాశారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
తమ అభ్యర్థనకు చట్టపరమైన విధానాలను అనుసరించాలని తాము అర్థం చేసుకున్నామని, అవసరమైన నిబంధనలు, డాక్యుమెంటేషన్లను పాటించడానికి తాము సిద్ధంగా ఉన్నామని కోణంకి తల్లిదండ్రులు అదే లేఖలో పేర్కొన్నట్లు ఏబీసీ న్యూస్ పేర్కొంది.
హోటల్లోనే రిబేతో పరిచయం..
కోణంకి సుదీక్ష తన స్నేహితురాళ్లతో కలిసి మార్చి 3 న పుంటా కానాకు చేరుకుంది. పిట్స్ బర్గ్ విశ్వవిద్యాలయానికి చెందిన మరో ఐదుగురు మహిళా విద్యార్థులతో కలిసి ఆమె ప్రయాణించినట్లు లౌడన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం వెల్లడించింది.
సుదీక్షను హోటల్లో రిబే మొదటిసారి కలిశానని, తనతో పాటు స్నేహితుడు తమను ఆమె బృందానికి పరిచయం చేసుకున్నారని రిబే చెప్పారు. ఇరు బృందాలు కలిసి బార్ కు వెళ్ళాయని, అక్కడ ఉన్న వారి సూచనతో బీచ్ కు వెళ్ళినట్టు పోలీసులకు రిబే వెళ్లడించాడు.
మార్చి 6వ తేదీ తెల్లవారు జామున రియు రెపుబ్లికా హోటల్ బార్ లో ఐదుగురు మహిళలు, ఇద్దరు పురుషులతో కలిసి మద్యం సేవించడం కనిపించింది. ఈ వీడియోలో వైట్ కవర్ అప్ ధరించి తన స్నేహితులను కౌగిలించుకుని మాట్లాడుతోంది. రిబే కొన్ని అడుగుల దూరంలో, వంగి బార్ వెలుపల ఉన్న లాన్ లో తడబడుతున్నాడు.
ఆ తర్వాత తెల్లవారుజామున 4.15 గంటలకు కోణంకి బృందం బీచ్ లోకి ప్రవేశించడాన్ని నిఘా కెమెరా బంధించింది. తెల్లవారు జామున 5 గంటల లోపు ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు బీచ్ నుంచి వెళ్లిపోయినట్లు సీసీ ఫుటేజీలో కనిపించింది. వారిలో సుదీక్ష లేదు.
ప్రాసిక్యూటర్లకు ఇచ్చిన నాలుగో ఇంటర్వ్యూలో రిబే మాట్లాడుతూ, అలల తాకిడికి కొట్టుకుపోయామని ఈత కొడుతూ సుదీక్షను రక్షించే ప్రయత్నంలో తాను అలసిపోయినట్టు వివరించారు. యువతి అదృశ్యంలో ఎవరినీ అనుమానితులుగా పరిగణించడం లేదని డొమినికన్ రిపబ్లిక్ అధికారులు తెలిపారు.ఈ ఘటనను మిస్సింగ్ కేసుగానే పరిగణిస్తున్నట్టు అమెరికా దర్యాప్తు బృందాలు ప్రకటించాయి.
సంబంధిత కథనం
టాపిక్