



Best Web Hosting Provider In India 2024

Medak Constables : ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ వ్యక్తి.. సీపీఆర్ చేసి కాపాడిన పోలీస్ కానిస్టేబుల్స్
Medak Constables : ఓ వ్యక్తి కుటుంబ సభ్యులతో గొడవపడి సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ఈ విషయం పోలీసులకు తెలిసింది. వెంటనే వారు ఘటనా స్థలానికి వెళ్లి.. ఉరేసుకున్న వ్యక్తిని కాపాడారు. కానిస్టేబుల్ సీపీఆర్ చేసి ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తిని సేవ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని దేవయ్యగూడెం తండాకు చెందిన రాజు.. అతిగా మద్యం సేవించాడు. తాగి గొడవ చేస్తూ.. తాను ఆత్మహత్య చేస్తుకుంటానని కుటుంబసభ్యులని బెదిరించడం మొదలుపెట్టాడు. తీవ్ర ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు.. గ్రామస్తుల సహాయం కోరారు. గ్రామస్తులు ఎంత నచ్చజెప్పినా.. రాజు వినలేదు. దీంతో వారు డయల్ 100 కు కాల్ చేసి పోలీసుల సహాయం కోరారు.
ఫ్యాన్కు ఉరేసుకొని..
ఇంతలో రాజు తన ఇంటిలోని ఒక గదిలోకి వెళ్లాడు. లోపటి నుండి తాళం వేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఎంత ప్రయత్నం చేసినా రాజు తలుపు తీయలేదు. ఇంతలో డ్యూటీలో ఉన్న పోలీసులు విష్ణువర్ధన్ రెడ్డి, మహేందర్ అక్కడి చేరుకున్నారు. పరిస్థితిని అర్ధం చేసుకొని బలవంతంగా ఆ రూమ్ తలుపులు తొలగించి లోనికి వెళ్లారు. అప్పటికే రాజు ఫ్యాన్కు ఉరి వేసుకొని కంపించారు.
సీపీఆర్ చేసిన పోలీసులు..
వెంటనే రాజుని కిందికి దించిన కానిస్టేబుల్స్.. సీపీఆర్ చేయటం మొదలుపెట్టారు. ఇంతలో మరో కానిస్టేబుల్ మహేందర్ 108 అంబులెన్కి ఫోన్ చేసి పిలిపించారు. ఐదు నిమిషాలు ప్రయత్నం తర్వాత రాజు స్పృహలోకి వచ్చారు. అతన్ని వెంటనే నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం.. మెరుగైన ట్రీట్మెంట్ కోసం రాజుని సంగారెడ్డిలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు.
అభినందించిన ఎస్పీ..
రాజుకి ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. సకాలంలో స్పందించి రాజు ప్రాణాలను కాపాడిన కానిస్టేబుళ్లు విష్ణువర్ధన్ రెడ్డి, మహేందర్కు గ్రామస్తులు కృతజ్ఞతలు చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న మెదక్ ఎస్పీ డీ.ఉదయ్ కుమార్ రెడ్డి ఇద్దరు కానిస్టేబుళ్లను అభినందించారు.
ఈత సరదా ప్రాణాల మీదకి..
మెదక్ జిల్లా పరిదిలో ఈ సంవత్సరంలో నలుగురు చిన్నారులు ఈతకు వెళ్లి మృతి చెందారు. ఈతకు వెళ్లే పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి సూచించారు. లేదంటే ఈత సరదా ప్రమాదంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. పిల్లలకు నీటి లోతు తెలియక ప్రమాదంలో చిక్కుకుంటారని సూచించారు. వీలైనంత వరకు పిల్లలను ఇంట్లోనే ఉంచుకుని ఏమైనా కొత్త విషయాలు నేర్పించాలని సూచించారు.
టాపిక్